పరీక్షలను ఎగ్గొట్టేందుకు.. ప్రిన్సిపాల్ చనిపోయారని ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన విద్యార్థులు
మధ్యప్రదేశ్లోని ఓ ప్రభుత్వ కాలేజ్లోని విద్యార్థులు చేసిన ఒక పని ఇప్పుడు వారి అరెస్ట్ వరకు దారి తీసింది! పరీక్షలను ఆపేందుకు ఏకంగా ప్రిన్సిపాల్ చనిపేయారంటూ ఫేక్ న్యూస్ని వ్యాపింపజేశారు!
స్కూల్కు వెళ్లకుండా ఉండేందుకు పిల్లలు కడుపు నొప్పి, తలనొప్పి అని చెబుతుంటారు. కాస్త వయస్సు వచ్చిన తర్వాత కాలేజ్కి వెళ్లకూడదంటే బంక్ కొడుతుంటారు. కానీ ఇప్పుడు కాలం మారింది! స్కూల్/కాలేజ్లో బాంబు ఉందని, ప్రిన్సిపాల్ చనిపోయారని ఫేక్ న్యూస్ని వ్యాపింపజేస్తున్నారు! మధ్యప్రదేశ్ ఇండోర్లోని ఓ ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ కళాశాలలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. పరీక్షలను నిలిపివేసే ఉద్దేశంతో.. “ప్రిన్సిపాల్ మరణించారు” అంటూ ఒక ఫేక్ లెటర్ రాసి, దాన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు.

ఇదీ జరిగింది..
నకిలీ లేఖను సృష్టించి, కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ప్రచారం చేసినందుకు గాను, ఆ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులపై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. హోల్కర్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అనమికా జైన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఇద్దరు బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ) మూడవ సెమిస్టర్ విద్యార్థులపై కేసు నమోదు చేసినట్లు భాన్వర్కువా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ రాజ్కుమార్ యాదవ్ తెలిపారు.
భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ $336(4) (ఒక వ్యక్తిని అవమానపరిచే ఉద్దేశంతో నకిలీ పత్రాన్ని సృష్టించడం) కింద ఎఫ్ఐఆర్ నమోదైందని యాదవ్ చెప్పారు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.
పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. రెగ్యులర్ అసెస్మెంట్ల కోసం జరుగుతున్న ఆన్లైన్ పరీక్షలను ఆపడానికి, తరగతులను వాయిదా వేయడానికి చేసిన కుట్రలో భాగంగా, ఆ ఇద్దరు విద్యార్థులు ప్రిన్సిపాల్ చనిపోయారని తప్పుడు లేఖను సృష్టించి, దానిని అక్టోబర్ 14న సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు.
"ముఖ్యమైన సమాచారం" అనే శీర్షికతో ఉన్న ఆ లేఖను ఇన్స్టిట్యూట్ లెటర్హెడ్ను కాపీ చేసి సృష్టించారని కళాశాల అధికారి ఒకరు తెలిపారు. ప్రిన్సిపాల్ డాక్టర్ జైన్ "అకస్మాత్తుగా మరణించడం" కారణంగా అక్టోబర్ 15-16 తేదీల్లో జరగాల్సిన ఆన్లైన్ పరీక్షలు వాయిదా పడ్డాయని, అన్ని సబ్జెక్టుల తరగతులు కూడా రద్దు అయ్యాయని ఆ లేఖలో పేర్కొన్నారు.
బాధిత ప్రిన్సిపాల్ స్పందన..
"ఈ నకిలీ లేఖ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన తర్వాత నా కుటుంబం, నేను తీవ్రంగా కలత చెందాం. ఆ లేఖ నిజమని నమ్మి చాలా మంది నాకు సంతాపం చెప్పడానికి ఇంటికి కూడా వచ్చారు," అని ప్రిన్సిపాల్ డాక్టర్ అనమికా జైన్ ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి, నిందితులైన ఇద్దరు విద్యార్థులపై పోలీసులు కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఎవరి పేరు ఎత్తకుండా.. కొందరు అసంతృప్త వ్యక్తులు కళాశాలలో ఉన్నారని, వారు తన విధులను సక్రమంగా నిర్వహించకుండా అడ్డుకోవడానికి వివిధ దురుద్దేశపూర్వక చర్యల ద్వారా తనను వేధిస్తున్నారని ప్రిన్సిపాల్ ఆరోపించారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


