LPG cylinder price hike : షాక్ మీద షాక్! ఎల్పీజీ సిలిండర్ ధర పెంపు- ఎంతంటే..
LPG price increase : కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపు నేటి నుంచే అమల్లోకి రానుంది.
LPG cylinder price Hyderabad : అమెరికా- ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దేశ ప్రజలకు షాక్ మీద షాక్లు తగులుతున్నాయి. గత నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఇక జూన్ నెల మొదటి రోజే కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు సైతం పెరిగాయి. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 42 మేర పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపుతో దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 3,113కి చేరింది. అలాగే, 5 కిలోల ఎఫ్టీఎల్ (ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ) సిలిండర్ ధర కూడా రూ. 11 పెరిగి రూ. 821.50 కి చేరింది.
అయితే గృహ అవసరాలకు వాడే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు జరగలేదు.
పశ్చిమ ఆసియాలో జరుగుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు ఆటంకం కలగడమే ఈ వరుస ధరల పెంపునకు ప్రధాన కారణం.
కమర్షియల్ గ్యాస్ ధరల పెంపు ప్రభావం నేరుగా హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ వ్యాపారాలు, ఇతర వాణిజ్య సంస్థలపై పడనుంది. దీనివల్ల బయట లభించే ఆహార పదార్థాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది సామాన్యుడి జేబును ప్రభావితం చేస్తుంది.
గత ఆరు నెలల కాలంలోనే కమర్షియల్ గ్యాస్ ధరలు దాదాపు రెట్టింపు అవ్వడం గమనార్హం! డిసెంబర్ 2025లో దిల్లీలో రూ. 1,580గా ఉన్న 19 కిలోల సిలిండర్ ధర ఇప్పుడు రూ. 3,000 మార్కును దాటేసింది.
చమురు కంపెనీల తాజా సవరణల ప్రకారం దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరల వివరాలు:
దిల్లీ- రూ. 3,071.50 నుంచి రూ. 3,113కి
ముంబై- రూ. 3,067.00
చెన్నై- రూ. 3,283.00
కోల్కతా - రూ. 3,255.00
కాగా హైదరాబాద్లో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 3,367గాను, డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 965గాను ఉన్నాయి.
ఇక విజయవాడలో ఈ రేట్లు వరుసగా రూ. 3,303.50, రూ. 937.50గా ఉన్నాయి.
2026 లో వరుసగా 7సారి పెంపు!
ఈ ఏడాది (2026) ఇప్పటికే ఎల్పీజీ ధరలను 7సార్లు పెంచారు.
జనవరి 1: సిలిండర్పై రూ. 111 పెరిగింది.
ఫిబ్రవరి 1: సిలిండర్పై రూ. 49 పెంచారు.
మార్చి 1: రూ. 28 నుంచి రూ. 31 వరకు పెంచారు.
మార్చి 7: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల వల్ల అకస్మాత్తుగా మరో రూ. 114.50 పెంచారు.
ఏప్రిల్ 1: ఏకంగా రూ. 200 పైగా భారీగా పెరిగింది.
మే 1: చరిత్రలోనే అత్యంత గరిష్టంగా ఒకేసారి రూ. 993 భారీగా పెంచారు.
జూన్ 1: తాజాగా మరో రూ. 42 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
అమెరికా- ఇరాన్ యుద్ధం.. భారత్కు ఇంధన సెగ!
గత మూడు నెలలుగా పశ్చిమ ఆసియా లో జరుగుతున్న యుద్ధం గ్లోబల్ ఎనర్జీ సప్లైని తీవ్రంగా దెబ్బతీసింది. ఇది భారతదేశ ఇంధన దిగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.
భారతదేశం తన అవసరాలకు గాను గల్ఫ్ దేశాల నుంచి భారీగా ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుంది. భారత్కు వచ్చే ముడి చమురులో 40 శాతం, సహజ వాయువులో 65 శాతం, వంట గ్యాస్ (ఎల్పీజీ) సరఫరాలో ఏకంగా 90 శాతం వాటా గల్ఫ్ రీజియన్ నుంచే వస్తుంది. యుద్ధం కారణంగా ఈ సరఫరా లైన్లు దెబ్బతినడంతో దేశీయంగా ధరలు ఈ స్థాయికి చేరాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


