LPG Cylinder rules : వంటగ్యాస్ కస్టమర్లకు అలర్ట్! మే 1 నుంచి మారనున్న ఎల్పీజీ సిలిండర్ రూల్స్..
LPG Cylinder booking rules : మే 1 నుంచి ఎల్పీజీ సిలిండర్ బుకింగ్, డెలివరీ పద్ధతుల్లో భారీ మార్పులు రాబోతున్నాయి. ఓటీపీ విధానం నుంచి బుకింగ్ గ్యాప్ వరకు చమురు సంస్థలు కొత్త నిబంధనలను ఖరారు చేశాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
LPG Cylinder price in Hyderabad : సామాన్యుడి వంటింట్లో మరోసారి మార్పుల సెగ తగలనుంది! దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది గ్యాస్ వినియోగదారులపై ప్రభావం చూపేలా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు.. మే 1 నుంచి కొత్త నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించాయి. గ్యాస్ సిలిండర్ల అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్కు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపడుతున్నారు. ముఖ్యంగా బుకింగ్ గ్యాప్, ఓటీపీ ఆధారిత డెలివరీ, ఈ-కేవైసీ వంటి అంశాల్లో స్పష్టమైన ఆదేశాలు వెలువడ్డాయి.

బుకింగ్ గ్యాప్: ఇక ఇష్టమొచ్చినప్పుడు బుక్ చేయడం కుదరదు!
గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు బుకింగ్ గ్యాప్ను పెంచాలని నిర్ణయించారు. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో రెండు సిలిండర్ల బుకింగ్ మధ్య ఉండాల్సిన వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఈ గ్యాప్ ఏకంగా 45 రోజులకు చేరింది!
అంటే, మీరు ఒక ఎల్పీజీ సిలిండర్ తీసుకున్న తర్వాత, నిర్ణీత గడువు ముగియకముందే మరో సిలిండర్ బుక్ చేయడానికి ప్రయత్నిస్తే సిస్టమ్ ఆటోమేటిక్గా దాన్ని రిజెక్ట్ చేస్తుంది.
ఓటీపీ ఉంటేనే సిలిండర్: డీఏసీ విధానం తప్పనిసరి..
డెలివరీ పద్ధతిలో పారదర్శకత కోసం మే 1 నుంచి 'డెలివరీ అథెంటికేషన్ కోడ్' (డీఏసీ) విధానాన్ని పక్కాగా అమలు చేయనున్నారు. ఇకపై గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ మీ ఇంటికి వచ్చినప్పుడు, మీ మొబైల్కు వచ్చిన ఓటీపీని చెబితేనే సిలిండర్ అందిస్తారు. కేవలం బ్లూ బుక్ చూపిస్తే సరిపోదు. ఇప్పటికే 94.5 శాతం డెలివరీలు ఈ పద్ధతిలోనే జరుగుతున్నాయని, మిగిలిన వాటిని కూడా ఈ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల అసలైన వినియోగదారుడికే గ్యాస్ చేరుతుందనేది ప్రభుత్వ ఉద్దేశం.
పెరుగుతున్న గ్యాస్ ధరల భారం..
అంతర్జాతీయ పరిణామాలు భారతీయ వినియోగదారుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు సరఫరాపై ప్రభావం పడింది. ఇప్పటికే 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరపై సుమారు 60 రూపాయల వరకు భారం పడింది. కమర్షియల్ సిలిండర్ ధరలు కూడా వరుసగా మూడుసార్లు పెరిగాయి. మే 1న జరగబోయే సమీక్షలో గ్యాస్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఉజ్వల లబ్ధిదారులకు ఈ-కేవైసీ మస్ట్..
ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ పొందుతున్న వారు వెంటనే ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఈ-కేవైసీని పూర్తి చేయాలి. ఎవరైతే ఇప్పటివరకు ఈ ప్రక్రియను పూర్తి చేయలేదో, వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. సబ్సిడీ దుర్వినియోగం కాకుండా ఉండటానికే ఈ కఠిన నిబంధనలు తెచ్చారు.
సరఫరాలో ఇబ్బందులు.. అమెరికా నుంచి దిగుమతులు!
భారతదేశానికి రోజుకు సుమారు 80,000 టన్నుల ఎల్పీజీ అవసరం కాగా, మన దేశీయ ఉత్పత్తి కేవలం 46,000 టన్నులుగానే ఉంది. ఈ లోటును భర్తీ చేసేందుకు అమెరికా నుంచి అదనపు దిగుమతులకు ఆర్డర్లు ఇచ్చారు. జూన్, జులై నెలల్లో ఈ స్టాక్ మన దేశానికి చేరుకునే అవకాశం ఉంది. వినియోగదారులు తమ మొబైల్ నంబర్ను గ్యాస్ కనెక్షన్తో లింక్ చేసుకోవాలని, MyLPG పోర్టల్లో తమ బుకింగ్ స్టేటస్ను చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


