...
...
Next Story

క్రెడిట్ కార్డ్ బిల్లుపై 2% అదనపు ఛార్జ్ వేస్తున్నారా? ఆర్బీఐ నిబంధనలు ఇవే

షాపింగ్ చేసేటప్పుడు క్రెడిట్ కార్డు వాడితే అదనంగా 2 శాతం ఛార్జ్ చెల్లించాలని దుకాణదారులు అడుగుతున్నారా? అసలు ఈ అదనపు రుసుము ఎందుకు వసూలు చేస్తారు, దీనిని వినియోగదారులు కచ్చితంగా చెల్లించాల్సిందేనా అనే అంశాలపై ఆర్బీఐ మార్గదర్శకాలు ఇవే.

Published on: Sep 9, 2026, 21:10:00 IST
Advertisement

షాపింగ్ చేసిన తర్వాత కౌంటర్ దగ్గర క్రెడిట్ కార్డు స్వైప్ చేయగానే.. "సార్, కార్డ్ పేమెంట్‌కు అదనంగా 2 శాతం పడుతుంది" అని షాపు నిర్వాహకులు చెప్పడం చాలామందికి అనుభవమే. పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేసినప్పుడు ఈ అదనపు భారం భారంగా మారుతుంది. అసలు వ్యాపారులు ఈ 2 శాతం అదనపు రుసుమును ఎందుకు డిమాండ్ చేస్తారు? వినియోగదారులు దీనిని కచ్చితంగా చెల్లించాల్సిందేనా? ఈ విషయంలో నిబంధనలు ఏం చెబుతున్నాయి?

అసలు ఈ 2 శాతం అదనపు ఛార్జ్ ఏమిటి?

క్రెడిట్ కార్డ్ బిల్లుపై 2% అదనపు ఛార్జ్ వేస్తున్నారా? ఆర్బీఐ నిబంధనలు ఇవే
క్రెడిట్ కార్డ్ బిల్లుపై 2% అదనపు ఛార్జ్ వేస్తున్నారా? ఆర్బీఐ నిబంధనలు ఇవే

విక్రేతలు కార్డు లావాదేవీలను స్వీకరించినందుకు సంబంధిత బ్యాంకులకు, పేమెంట్ నెట్‌వర్క్‌లకు ఒక నిర్దిష్ట రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీనినే 'మర్చంట్ డిస్కౌంట్ రేట్' (ఎమ్‌డీఆర్) అంటారు.

లావాదేవీల ప్రక్రియలో కార్డ్ జారీ చేసిన బ్యాంక్, స్వైపింగ్ మెషిన్ ఇచ్చిన బ్యాంక్, నెట్‌వర్క్ ఆపరేటర్లు భాగస్వాములుగా ఉంటారు. వ్యాపారులు ఈ ఎమ్‌డీఆర్ ఖర్చును తమ సొంత ఖాతా నుంచి భరించకుండా, వినియోగదారులపైకి నెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. అందుకే బిల్లుపై అదనంగా 2 శాతం వసూలు చేస్తుంటారు.

ఆర్బీఐ మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి?

క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై అదనపు రుసుము వసూలు చేయడంపై తమ నుంచి ప్రత్యేక ఆదేశాలు ఏవీ లేవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. వ్యాపారులకు, వారి బ్యాంకులు లేదా పేమెంట్ ప్రొవైడర్లకు మధ్య ఉండే ఒప్పందాలు దీనిని నిర్ణయిస్తాయి.

బ్యాంకులతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం ఈ రుసుమును కస్టమర్లపైకి నెట్టకూడదనే నిబంధనలు ఉంటే, వ్యాపారులు అదనపు డబ్బులు వసూలు చేయడం నిబంధనల ఉల్లంఘనే అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో వినియోగదారులు ఆ ఛార్జీని ప్రశ్నించవచ్చు. అవసరమైతే తమ కార్డ్ జారీ చేసిన బ్యాంకు దృష్టికి తీసుకెళ్లవచ్చు.

డెబిట్ కార్డులకు వేరే నిబంధనలు

ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లు లేదా ఇతర సేవల సమయంలో విధించే 'కన్వినెన్స్ ఫీజు' లేదా 'సర్వీస్ ఛార్జ్' అనేది సాధారణ కార్డ్ ఛార్జ్ కంటే భిన్నమైనది. చెల్లింపు పూర్తయ్యే ముందే ఈ రుసుము వివరాలను వినియోగదారులకు పారదర్శకంగా చూపించాలని ఆర్బీఐ పేమెంట్ అగ్రిగేటర్లను ఆదేశించింది. కాబట్టి పిన్ నంబర్ నమోదు చేసే ముందే మొత్తం బిల్లును సరిచూసుకోవడం మంచిది.

అదనపు ఛార్జీలు వేస్తే ఏం చేయాలి?

షాపింగ్ కౌంటర్ వద్ద అదనపు రుసుము అడిగితే అది దేనికి సంబంధించిందో ముందుగా వ్యాపారిని అడిగి తెలుసుకోండి. బిల్లును పూర్తిగా పరిశీలించిన తర్వాతే పిన్ ఎంటర్ చేయండి లేదా స్వైప్ చేయండి.

ఒకవేళ మీ వద్ద అనవసరంగా ఛార్జీలు వసూలు చేశారని భావిస్తే, మొదట సదరు వ్యాపారిని లేదా మీ క్రెడిట్ కార్డ్ బ్యాంకును సంప్రదించండి. బ్యాంకు నుంచి నెల రోజుల్లోగా సరైన స్పందన రాకపోతే, ఆర్బీఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్‌ను (RBI Integrated Ombudsman) ఆశ్రయించవచ్చు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks