Delhi crime news : 1984 నాటి మర్డర్ కేసు- 42ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన నిందితుడు!
1984 నాటి మర్డర్ కేసులో 65 ఏళ్ల నిందితుడు నత్తును దిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 42 ఏళ్ల తర్వాత యూపీలో అరెస్ట్ చేశారు. నాలుగు దశాబ్దాలుగా ఎవరికీ చిక్కకుండా తలదాచుకున్న అతడిని పక్కా సమాచారంతో పట్టుకున్నారు.
నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన ఓ హత్య కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితుడిని దిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఎట్టకేలకు పట్టుకుంది! ఫలితంగా పోలీసుల సుదీర్ఘ వేటకు ఎట్టకేలకు తెరపడింది. ఆ నిందితుడి పేరు నత్తు అలియాస్ నత్తులాల్ (65). ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లా అతని స్వస్థలం. 1984లో దిల్లీలోని జనక్పురి పోలీస్ స్టేషన్లో అతనిపై తొలిసారి హత్య కేసు నమోదైంది. అప్పటి నుంచి అతను పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు.

అసలేం జరిగిందంటే..
ఈ దారుణ ఘటన 1984 మే 22, 23 మధ్య రాత్రి జరిగింది. ఆ రోజు పశ్చిమ దిల్లీలోని వికాస్పురి డిస్ట్రిక్ట్ పార్క్లో ఒక వ్యక్తి మృతదేహాన్ని స్థానికుల సమాచారంతో పోలీసులు గుర్తించారు. అతడిని కత్తులతో విచక్షణారహితంగా పొడిచి దారుణంగా చంపేశారు. విచారణలో ఆ మృతుడు యూపీలోని సీతాపూర్కు చెందిన అశోక్ కుమార్గా అప్పట్లో పోలీసులు తేల్చారు.
కేసు దర్యాప్తులో భాగంగా సీతాపూర్కే చెందిన భభూతి ప్రసాద్ అనే వ్యక్తికి ఈ హత్యతో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని వెంటనే అరెస్ట్ చేశారు. అతను ఇచ్చిన వివరాల ఆధారంగా హత్యకు వాడిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. కానీ, ఆ సమయంలో అతని స్నేహితుడు నత్తు మాత్రం పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు.
దశాబ్దాల తర్వాత పాత ఫైళ్లకు మోక్షం..
ఇన్నేళ్ల తర్వాత దర్యాప్తు అధికారులు మళ్లీ పాత ఫైళ్లను దుమ్ము దులిపారు. నిందితుడి పాత చిరునామాలు, కుటుంబ సభ్యుల వివరాలు, అతను ఎక్కడ తలదాచుకునే అవకాశం ఉందనే సమాచారాన్ని సేకరించారు. దశాబ్దాల తర్వాత అతని ఆచూకీ కోసం యూపీలోని సీతాపూర్, హర్దోయ్ జిల్లాల్లో నెలల తరబడి మకాం వేసి క్షేత్రస్థాయిలో ఆరా తీశారు.
ఈ గాలింపులో నత్తు ఇంకా బతికే ఉన్నాడని, అప్పుడప్పుడూ సొంత ఊరికి వచ్చి వెళుతున్నాడని పోలీసులకు తెలిసింది. దీనితో హర్దోయ్లోని పాలి ప్రాంతంపై దృష్టి పెట్టి, స్థానికుల నుంచి రహస్యంగా సమాచారం రాబట్టారు.
ఎట్టకేలకు వలలో..
పోలీసుల ఓపికకు చివరకూ ఫలితం దక్కింది. 2026 ఆగస్టు 17న నత్తు పోలికలతో ఉన్న ఒక వ్యక్తి ఆ గ్రామంలో తిరుగుతున్నట్లు వారికి పక్కా సమాచారం అందింది. మరుసటి రోజు అంటే ఆగస్టు 18న క్రైమ్ బ్రాంచ్ బృందం అతన్ని పట్టుకుంది. అతను తన సొంత ఊరి నుంచి ఫరూఖాబాద్కు వెళుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.
హత్యకు కారణమిదే..
"వ్యక్తిగత కక్షల వల్లే ఈ హత్య జరిగింది" అని దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నత్తు, భభూతి ప్రసాద్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు. మృతుడు అశోక్ కుమార్, భభూతి ప్రసాద్ ఒకే ఊరికి చెందినవారు.
భభూతి ప్రసాద్ భార్యతో అశోక్ కుమార్ అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు ఉన్నాయి. దీనితో ఆ ఇద్దరి మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. ఆ రోజు రాత్రి పార్కులో నత్తు, భభూతి ప్రసాద్ కలిసి మద్యం తాగారు. ఆ సమయంలోనే ఇద్దరూ కలిసి అశోక్ కుమార్ను చంపాలని ప్లాన్ చేశారని పోలీసులు వివరించారు.
హత్య తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా తన గుర్తింపును దాచుకునేందుకు నత్తు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఉత్తరప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న హోల్సేల్ కూరగాయల మార్కెట్లలో కొన్నేళ్ల పాటు కూలీగా పనిచేశాడు.
అతను పెళ్లి చేసుకోలేదు, జీవితాంతం ఒంటరిగానే జీవించాడు. బహుశా ఇదే అతను ఇన్ని దశాబ్దాల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకోవడానికి కలిసొచ్చి ఉంటుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
నత్తుపై యూపీలో మరో కేసు కూడా ఉన్నట్లు క్రైమ్ బ్రాంచ్ ధృవీకరించింది. 2005లో ఫరూఖాబాద్లోని కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఇతనిపై కిడ్నాప్ కేసు నమోదైంది. కాగా, 1984 నాటి హత్య కేసుకు సంబంధించి దిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రస్తుతం అతన్ని మరింత లోతుగా విచారిస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


