ఢిల్లీలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నిరసన కలకలం.. భారీగా పోలీసుల మోహరింపు

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ 'కాక్రోచ్ జనతా పార్టీ' శనివారం ఢిల్లీలో నిరసనకు పిలుపునిచ్చింది. ఎలాంటి అనుమతులు లేకపోవడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమై ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, జంతర్ మంతర్, సరిహద్దుల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Published on: Jun 6, 2026, 08:40:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఢిల్లీ వ్యాప్తంగా శనివారం పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. డిజిటల్ గ్రూప్ 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) నిరసన పిలుపునివ్వడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI), జంతర్ మంతర్, సరిహద్దు ప్రాంతాలతో పాటు కీలక కూడళ్ల వద్ద అదనపు బలగాలను మోహరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వెయ్యి మందికి పైగా పోలీసులను రంగంలోకి దించారు.

ఢిల్లీలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నిరసన కలకలం.. భారీగా పోలీసుల మోహరింపు (HT_PRINT)
ఢిల్లీలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నిరసన కలకలం.. భారీగా పోలీసుల మోహరింపు (HT_PRINT)

ఈ నిరసన కార్యక్రమానికి నిరసనకారులు ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోలేదని ఢిల్లీ పోలీస్ వర్గాలు స్పష్టం చేశాయి. "వారు అనుమతి కోరినప్పుడు ఆ విజ్ఞప్తిని పరిశీలిస్తాం" అని ఒక సీనియర్ పోలీస్ అధికారి పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు.

సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ప్రచారాన్ని బట్టి పోలీసులు ముందస్తు రక్షణ చర్యలు చేపట్టారు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వెలుపల బారికేడ్లను ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఢిల్లీకి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (IGI) విచిత్ర వీర్ నేతృత్వంలో ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ప్రజలకు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.

అసలు ఏమిటీ ‘కాక్రోచ్ జనతా పార్టీ’?

గత నెలలో ఒక కోర్టు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ పార్టీ పుట్టుకొచ్చింది. కొందరు వ్యక్తులను ఉద్దేశించి ఆయన 'బొద్దింకలు' (కాక్రోచెస్), 'పరాన్నజీవులు' (పారాసైట్స్) అని వ్యాఖ్యానించారు. దీనికి నిరసనగా, వ్యంగ్యంగా సోషల్ మీడియాలో ప్రారంభమైన ఈ డిజిటల్ ప్రచారం.. ప్రస్తుతం భారీ ఫాలోయింగ్‌తో ఒక వ్యవస్థీకృత ఉద్యమంగా మారింది.

నిరసన ఎందుకు? డిమాండ్లు ఏమిటి?

పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే డిమాండ్ చేశారు. జూన్ 6న విద్యార్థులు, మద్దతుదారులు ఢిల్లీకి తరలిరావాలని, విమానాశ్రయం, జంతర్ మంతర్ వద్ద నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ ఉద్యమానికి మద్దతుగా విద్యా సంస్కర్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కూడా రంగంలోకి దిగారు. జూన్ 5 లోగా కేంద్ర మంత్రి రాజీనామా చేయకపోతే తాను కూడా ఈ నిరసనలో పాల్గొంటానని ఆయన ముందే ప్రకటించారు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించేందుకు అభిజీత్ దిప్కే అమెరికా నుంచి భారత్‌కు వస్తున్నారు.

సోషల్ మీడియాలో సవాల్.. పొలిటికల్ లింకులపై నిఘా

పోలీసుల బందోబస్తుపై CJP తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో ఒక వీడియోను పంచుకుంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. "బొద్దింకలను అడ్డుకోవడానికి ఏర్పాట్లు పూర్తిగా కట్టుదిట్టం చేశారు, ఈ రోజే బారికేడ్లు కూడా వేశారు" అంటూ CJP పోస్ట్ చేసింది.

మరోవైపు, ఈ నిరసన వెనుక కొన్ని రాజకీయ శక్తుల మద్దతు ఉందనే అనుమానంతో ఇంటెలిజెన్స్ సంస్థలు రంగంలోకి దిగాయి. పలువురు రాజకీయ నాయకుల కదలికలపై నిఘా ఉంచారు. పరిస్థితిని బట్టి అదనపు బలగాలను రంగంలోకి దించేందుకు అన్ని జిల్లాల పోలీస్ యూనిట్లను స్టాండ్‌బైలో ఉంచారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More