వెంటిలేటర్ ఆలస్యమైందని డాక్టర్లపై బంధువుల దాడి.. రోగి మృతితో ఉద్రిక్తత
లక్నోలోని రామ్ మనోహర్ లోహియా ఇన్స్టిట్యూట్ (RMLIMS)లో వెంటిలేటర్ ఏర్పాటులో జాప్యం జరిగిందంటూ రోగి బంధువులు డాక్టర్లు, సిబ్బందిపై భౌతిక దాడికి దిగారు. చికిత్స పొందుతూ రోగి మరణించడంతో ఎమర్జెన్సీ వార్డును ధ్వంసం చేశారు. ఈ ఘటన ఆసుపత్రిలో పెను కలకలం రేపింది.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని గోమతీ నగర్లో ఉన్న ప్రతిష్టాత్మక రామ్ మనోహర్ లోహియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RMLIMS) మంగళవారం ఉదయం రణరంగాన్ని తలపించింది. శ్వాసకోస సమస్యతో చేరిన ఒక రోగి మరణించడంతో.. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఈ మృతి సంభవించిందని ఆరోపిస్తూ బంధువులు వీరంగం సృష్టించారు.

అసలేం జరిగింది?
గుడంబా ప్రాంతానికి చెందిన లాల్ బహదూర్ (45) తీవ్రమైన శ్వాస ఇబ్బందులతో ఆసుపత్రికి వచ్చారు. అయితే, ఆయనను చేర్చుకోవడంలో డాక్టర్లు జాప్యం చేశారని, పరిస్థితి విషమించాక వెంటిలేటర్ల కొరత ఉందంటూ కాలయాపన చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. "మేము సహాయం కోరితే డాక్టర్లు మమ్మల్ని ఎమర్జెన్సీ వార్డు నుంచి బయటకు నెట్టేశారు. మహిళా బంధువుల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించారు" అని మృతుడి బావ ప్రదీప్ కుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన బంధువులు అక్కడి వైద్యులు, సిబ్బందిపై దాడికి దిగారు. వార్డులోని వైద్య పరికరాలను, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దీంతో ఎమర్జెన్సీ వార్డులో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఆసుపత్రి యాజమాన్యం వివరణ
బంధువుల ఆరోపణలను ఆసుపత్రి యజమాన్యం ఖండించింది. నిమోనియా, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS) వల్ల రోగి పరిస్థితి అప్పటికే అత్యంత విషమంగా ఉందని, ఆక్సిజన్ స్థాయిలు పడిపోయాయని వివరించింది.
"తెల్లవారుజామున 3.30 గంటలకే మెకానికల్ వెంటిలేషన్ అవసరమని డాక్టర్లు సూచించారు. కానీ, బంధువులు ఆ ప్రక్రియకు అంగీకారం (Consent) తెలపడంలో దాదాపు రెండు గంటల సమయం వృధా చేశారు. ఈ జాప్యమే ప్రాణాంతకంగా మారింది" అని ఆసుపత్రి అధికారిక ప్రకటనలో పేర్కొంది.
పోలీసుల రంగప్రవేశం
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఉద్రిక్తంగా ఉన్న గుంపును శాంతింపజేశారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేస్తున్నట్లు సబ్ ఇన్స్పెక్టర్ మనీష్ కుష్వాహా తెలిపారు. ప్రస్తుతం లాల్ బహదూర్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు.
వైద్య సేవల్లో లోపాలు?
కాగా, రాత్రి వేళల్లో ఆసుపత్రి ఎమర్జెన్సీ సేవలు అస్తవ్యస్తంగా ఉంటున్నాయని, కంట్రోల్ రూమ్ సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆసుపత్రి వర్గాల నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెలలో RMLIMS లో ఇలాంటి ఘర్షణ జరగడం ఇది రెండోసారి. మార్చి 7న కూడా ఒక మహిళా డాక్టర్ రోగి బంధువుపై చేయి చేసుకున్నారనే ఆరోపణలు రాగా, కేసు నమోదైంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


