...
...
Next Story

ఇండియాలో ఈవీల హవా! 7 నెలల్లోనే 10 లక్షల 2 వీలర్​ సేల్స్- ఆటోమొబైల్ చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు..

భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 2026లో కేవలం 7 నెలల వ్యవధిలోనే 10 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. పెరిగిన ఛార్జింగ్ సదుపాయాలు, కొత్త మోడళ్లు ఈ రికార్డు అమ్మకాలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.

Published on: Aug 2, 2026, 15:30:09 IST
Advertisement

భారత వాహన రంగంలో ఎలక్ట్రిక్ విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు సరికొత్త రికార్డులను తిరగరాస్తున్నాయి. ఇందుకు నిదర్శనం తాజా సేల్స్​ డేటా! 2026 ఏడాది ప్రారంభమైన కేవలం ఏడు నెలల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా ఏకంగా 10 లక్షల ఈవీ టూవీలర్ల విక్రయాలు పూర్తయ్యాయి.

ఇండియలో దూసుకెళుతున్న ఎలక్ట్రిక్ 2 వీలర్ సేల్స్..
ఇండియలో దూసుకెళుతున్న ఎలక్ట్రిక్ 2 వీలర్ సేల్స్..

అధికారిక వాహన రిజిస్ట్రేషన్ల డేటా ప్రకారం.. జులై 6 నాటికే ఈవీ టూవీలర్ల రిటైల్ అమ్మకాలు 10 లక్షల మైలురాయిని దాటేశాయి. 2025లో ఈ స్థాయి మార్కును చేరుకోవడానికి చాలా సమయం పట్టగా, ఈసారి జులై నెల పూర్తికాకముందే ఈ ఘనత సాధించడం విశేషం. రోజురోజుకూ పెరుగుతున్న ఈవీల ఆదరణ, వేగంగా విస్తరిస్తున్న ఛార్జింగ్ నెట్‌వర్క్, గ్రామీణ ప్రాంతాల్లో సైతం పెరుగుతున్న అవగాహన ఈ ఆల్‌టైమ్ రికార్డుకు ప్రధాన కారణాలని ఆటోమొబైల్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ప్రత్యామ్నాయం కాదు.. నిత్య జీవితంలో భాగం!

ఒకప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే కేవలం ఒక ప్రత్యామ్నాయ ఎంపికగానే చూసేవారు. కానీ నేడు రోజువారీ ప్రయాణాలకు ప్రధాన వాహనంగా ఈవీలు మారిపోయాయి. మార్కెట్లో కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా అన్ని బడ్జెట్లలోనూ విభిన్న మోడళ్లు అందుబాటులోకి రావడం కలిసొచ్చింది. టీవీఎస్ మోటార్, బాజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ, హీరో మోటోకార్ప్ 'విడా', ఓలా ఎలక్ట్రిక్, హోండా వంటి ప్రముఖ సంస్థల మధ్య పోటీ పెరగడం కొనుగోలుదారులకు మరింత ప్రయోజనకరంగా మారింది.

గతంలో వేళ్లపైన లెక్కపెట్టే కొన్ని బ్రాండ్లు మాత్రమే ఈవీ రంగంలో ఉండేవి. కానీ ఇప్పుడు సాంప్రదాయ టూవీలర్ దిగ్గజాలు కూడా రంగంలోకి దిగి నాణ్యమైన మోడళ్లను తీసుకురావడంతో వినియోగదారుల్లో నమ్మకం రెట్టింపైంది. ఎంట్రీ లెవెల్ స్కూటర్ల నుంచి ప్రీమియం, కనెక్టెడ్ ఫీచర్లు ఉన్న స్మార్ట్ మోడళ్ల వరకు అన్నీ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.

ప్రభుత్వ ప్రోత్సాహం.. మెరుగైన మౌలిక వసతులు

ఇప్పటివరకు కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన ఈవీ విక్రయాలు, ఇప్పుడు టైర్-2, టైర్-3 నగరాలకు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి. పెట్రోల్ వాహనాలతో పోలిస్తే నిర్వహణ వ్యయం చాలా తక్కువ కావడం చిన్న నగరాల్లోని వారిని కూడా ఆకర్షిస్తోంది. దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, దిల్లీ రాష్ట్రాలు అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్న జాబితాలో అగ్రస్థానంలో నిలిచాయి.

సవాళ్లు లేకపోలేదు..

అమ్మకాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఈవీ పరిశ్రమ కొన్ని కీలక సవాళ్లను ఎదుర్కొంటోంది. ముడిసరుకుల ధరల హెచ్చుతగ్గులు, బ్యాటరీ విడిభాగాల వ్యయం పెరగడం, ప్రభుత్వం ఇచ్చే రాయితీలు క్రమంగా తగ్గడం తయారీదారులకు ప్రధాన సమస్యలుగా మారాయి. అలాగే చిన్న పట్టణాల్లో ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.

ఏదేమైనప్పటికీ, దేశంలో ఈవీ విక్రయాల వేగం చూస్తుంటే భవిష్యత్తు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలదేనని స్పష్టమవుతోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe