EPFO 3.0 : ఈపీఎఫ్​ఓ కొత్త విత్​డ్రా రూల్స్- పాత దానికి తేడాలు ఇవే..

How to Withdraw PF Money Online : ఈపీఎఫ్‌ఓ డిజిటల్ సంస్కరణల్లో భాగంగా పీఎఫ్ ఖాతాదారులు తమ డబ్బును యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి విత్‌డ్రా చేసుకునే సదుపాయం రాబోతోంది. దీనివల్ల ఎలాంటి పేపర్‌వర్క్, ఆలస్యం లేకుండా తక్షణమే క్లెయిమ్ సెటిల్‌మెంట్ అవుతుంది.

Published on: Jun 22, 2026, 06:43:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రైవేట్, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్​ఓ) ఒక అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈపీఎఫ్‌ఓ 3.0లో భాగంగా పీఎఫ్ సేవలను మరింత వేగంగా, సరళంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త సంస్కరణలను తీసుకువస్తోంది. ఇందులో భాగంగా భవిష్యత్తులో ఈపీఎఫ్ సభ్యులు తమ పీఎఫ్ డబ్బును యూపీఐ ద్వారా నేరుగా తమ బ్యాంక్ ఖాతాల్లోకి విత్‌డ్రా చేసుకునేలా సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు.

ఈపీఎఫ్​ఓ 3.0 అప్డేట్స్..
ఈపీఎఫ్​ఓ 3.0 అప్డేట్స్..

ఈ కొత్త నిర్ణయం వల్ల పీఎఫ్ డబ్బుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు. అలాగే కార్యాలయాల చుట్టూ తిరిగే పేపర్‌వర్క్, వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గుతుంది. అయితే ఈ కొత్త విధానం ఎలా పనిచేస్తుంది? ప్రస్తుతం ఉన్న పీఎఫ్ విత్‌డ్రా పద్ధతికి, రాబోయే విధానానికి ఉన్న తేడాలు ఏమిటనే దానిపై చాలా మంది చందాదారుల్లో ఇంకా స్పష్టత లేదు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఈపీఎఫ్‌ఓ 3.0 అంటే ఏంటి?

ఈపీఎఫ్‌ఓ 3.0 అనేది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ చేపట్టిన ఒక భారీ డిజిటల్ అప్‌గ్రేడ్ ప్రక్రియ. దీని ద్వారా పీఎఫ్ చందాదారులు తమ ఖాతాలోని సొమ్మును ఎలాంటి పేపర్లు, సంతకాలు లేకుండా తక్షణమే విత్‌డ్రా చేసుకోవచ్చు లేదా మరొక ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. యూపీఐ ఐడీలు, యూపీఐ ఆధారిత ఏటీఎంల ద్వారా నేరుగా పీఎఫ్ నిధులను పొందే అవకాశం కల్పించడం ద్వారా క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌లో జరిగే ఆలస్యాన్ని ఈ సరికొత్త సిస్టమ్ పూర్తిగా నివారిస్తుంది.

ప్రస్తుత పీఎఫ్ విత్‌డ్రా విధానం..

ప్రస్తుతం ఈపీఎఫ్ సభ్యులు తమ పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకోవాలంటే క్లెయిమ్ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఇది చాలా సమయంతో కూడుకున్న వ్యవహారం. ఆ ప్రాసెస్ ఇలా సాగుతుంది:

ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్ లేదా కార్యాలయంలో ఫామ్ 31 నింపి విత్‌డ్రా క్లెయిమ్ సమర్పించాలి.

ఆ తర్వాత కేవైసీ వెరిఫికేషన్ కోసం వేచి చూడాలి.

కంపెనీ యజమాని ఆమోదం కోసం ఎదురుచూడాలి.

ఒకవేళ పత్రాల్లో వివరాలు సరిపోలకపోతే ప్రక్రియ మరింత ఆలస్యమవుతుంది. ఒకవేళ మీరు కంపెనీ మారినట్లయితే వేచి ఉండే సమయం ఇంకా పెరుగుతుంది.

ఇవన్నీ పూర్తయిన తర్వాత కూడా బ్యాంకు ఖాతాలో డబ్బులు పడటానికి మరో 7 నుంచి 10 రోజుల సమయం పడుతుంది.

విత్‌డ్రా మొత్తం రూ. 1 లక్ష దాటితే వాటిని మాన్యువల్‌గా వెరిఫై చేయాల్సి ఉంటుంది.

ఎక్కడైనా డాక్యుమెంట్లు మిస్‌మ్యాచ్ అయితే మళ్లీ మొదటి నుంచి ప్రాసెస్ ప్రారంభించాలి.

రాబోయే ఈపీఎఫ్‌ఓ 3.0 విధానం..

ఉమాంగ్ (UMANG) యాప్ ద్వారా ఉద్యోగులు తమ లింక్డ్ బ్యాంక్ ఖాతాలకు ఎంత పీఎఫ్ డబ్బును నేరుగా బదిలీ చేసుకోవచ్చో చెక్ చేసుకోవచ్చు.

పీఎఫ్ డబ్బును సురక్షితంగా నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేయడానికి ఒక క్యూఆర్ కోడ్‌ను జనరేట్ చేయవచ్చు.

డబ్బులు బ్యాంక్ ఖాతాలోకి రాగానే, వాటిని డిజిటల్ పేమెంట్లకు వాడుకోవచ్చు లేదా డెబిట్ కార్డుల ద్వారా బ్యాంక్ ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఈ ఆటో-సెటిల్‌మెంట్ మోడ్ పరిమితిని ప్రభుత్వం ఇప్పటికే రూ. 1 లక్ష నుండి ఏకంగా రూ. 5 లక్షలకు పెంచింది.

ఇందులో కంపెనీ యజమానితో ఎలాంటి సంబంధం ఉండదు, వేచి చూడాల్సిన అవసరమూ లేదు.

యూపీఐ ఆధారిత ఏటీఎంలో కేవలం ఒక్క టాప్ చేయడం ద్వారా లేదా యూపీఐ ట్రాన్స్‌ఫర్ ద్వారా తక్షణమే డబ్బును పొందవచ్చు.

ఈపీఎఫ్‌ఓ 3.0 లాంచ్ ఎప్పుడు?

కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గత నెలలో మాట్లాడుతూ.. ఈ కొత్త సదుపాయానికి సంబంధించిన ట్రయల్స్ (టెస్టింగ్) విజయవంతంగా పూర్తయ్యాయని, త్వరలోనే ఈ సేవలను ప్రజ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. అయితే లాంచ్‌కు సంబంధించిన ఖచ్చితమైన తేదీని ఆయన ఇంకా వెల్లడించలేదు.

యూపీఐ పేమెంట్ గేట్‌వేని ఉపయోగించి సభ్యులు ఈపీఎఫ్ నిధులను విత్‌డ్రా చేసుకునే సదుపాయంపై మేము ఇప్పటికే టెస్టింగ్ పూర్తి చేశాము. విత్‌డ్రా చేసిన సొమ్ము నేరుగా ఆయా సభ్యుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది,” అని మంత్రి మన్సుఖ్ మాండవీయ వివరించారు.

అధికారిక గణాంకాల ప్రకారం.. ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరంలో 1.29 కోట్లకు పైగా కొత్త కార్మికులను పేరోల్‌ పరిధిలోకి తీసుకువచ్చింది. అలాగే దేశంలో నిరుద్యోగిత రేటు 2017–18లో 6 శాతంగా ఉండగా, అది 2023–24 నాటికి 3.2 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ దాదాపు రూ. 28 లక్షల కోట్ల నిధులను నిర్వహిస్తోంది. బలమైన వ్యవస్థ, భద్రత, పన్ను రహిత అధిక రాబడి (టాక్స్ ఫ్రీ రిటర్న్స్) అందిస్తుండటం వల్లే కోట్లాది మంది సభ్యులు ఈపీఎఫ్‌ఓను ఎంతగానో నమ్ముతున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More