FIFA World Cup 2026 : సౌతాఫ్రికాపై మెక్సికో విక్టరీ- మూడు రెడ్ కార్డ్‌లతో హై టెన్షన్!

Mexico vs South Africa score : ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీని ఆతిథ్య దేశం మెక్సికో ఘనంగా ప్రారంభించింది. జూలియన్ క్వినోన్స్, రౌల్ జిమెనెజ్ అద్భుత గోల్స్‌తో తొలి మ్యాచ్‌లోనే దక్షిణాఫ్రికాను 2-0 తేడాతో మట్టికరిపించింది. కాగా మ్యాచ్‌లో ఏకంగా మూడు రెడ్ కార్డ్‌లు రావడం సంచలనం సృష్టించింది.

Published on: Jun 12, 2026, 05:35:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫిఫా ప్రపంచకప్ 2026 మహా సమరం మైదానంలో హై వోల్టేజ్ డ్రామాతో షురూ అయింది. గురువారం రాత్రి జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లోనే కో-హోస్ట్ దేశమైన మెక్సికో సంచలన విజయాన్ని నమోదు చేసింది. జూలియన్ క్వినోన్స్, రౌల్ జిమెనెజ్ చెరో గోల్‌తో చెలరేగడంతో గ్రూప్-ఏలో జరిగిన ఈ పోరులో మెక్సికో 2-0 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది.

ఫిఫా వరల్డ్​ కప్ 2026- సౌతాఫ్రికాపై మెక్సికో విక్టరీ (AFP)
ఫిఫా వరల్డ్​ కప్ 2026- సౌతాఫ్రికాపై మెక్సికో విక్టరీ (AFP)

సుమారు 80,824 మంది ప్రేక్షకుల కేరింతల మధ్య చారిత్రాత్మక అజ్టెకా స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో 48 జట్లతో జరుగుతున్న ఈ ఫిఫా వరల్డ్​ కప్​ 2026కి ఇదొక అదిరిపోయే స్టార్ట్ అని చెప్పాలి. రెండు హాఫ్‌లలోనూ మెక్సికో ఒక్కో గోల్ కొట్టి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించగా, మైదానంలో ఆటగాళ్ల దూకుడు కారణంగా మూడు రెడ్ కార్డ్‌లు రావడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

ఈ సీజన్ సౌదీ లీగ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన మెక్సికో ఫార్వర్డ్ ప్లేయర్ జూలియన్ క్వినోన్స్ మ్యాచ్ ప్రారంభమైన 9వ నిమిషంలోనే మెరుపు గోల్ కొట్టి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఇక రెండో హాఫ్‌లో మెక్సికో ఆటగాళ్లు మరింత వ్యూహాత్మకంగా ఆడారు. మ్యాచ్ 66వ నిమిషంలో రౌల్ జిమెనెజ్ అద్భుతమైన హెడర్ ద్వారా బంతిని నెట్‌లోకి పంపి జట్టుకు 2-0 తో తిరుగులేని విజయాన్ని ఖాయం చేశాడు.

మైదానంలో రెడ్ కార్డ్‌ల కలకలం!

మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో, అంతే ఉద్రిక్తంగానూ మారింది! నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను దక్షిణాఫ్రికా ఆటగాళ్లు స్ఫెఫెలో సితూల్, థెంబా జ్వానేలకు అంపైర్ రెడ్ కార్డ్ (రెడ్ కార్డ్ చూపిస్తే ఆటగాడు మైదానం వీడాలి) చూపించారు. దీనితో దక్షిణాఫ్రికా జట్టు చివరికి, కేవలం 9 మంది ఆటగాళ్లతోనే మ్యాచ్‌ను ముగించాల్సి వచ్చింది. అయితే మ్యాచ్ ముగిసే ఇంజూరీ టైమ్‌లో మెక్సికో డిఫెండర్ సీజర్ మోంటెస్‌కు కూడా రెడ్ కార్డ్ రావడంతో ఆ జట్టు కూడా 10 మందితోనే ఆటను ముగించింది.

రికార్డు సృష్టించిన రౌల్ జిమెనెజ్..

ఫిఫా వరల్డ్​ కప్​ 2026 తొలి మ్యాచ్‌లో కొట్టిన గోల్‌తో మెక్సికో స్టార్ ప్లేయర్ రౌల్ జిమెనెజ్ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ కెరీర్‌లో ఇది అతనికి 46వ గోల్. మూడు ప్రపంచకప్‌ల్లో అతనికి ఇదే తొలి గోల్ కావడం విశేషం. ఈ గోల్‌తో మెక్సికో జాతీయ జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో జారెడ్ బోర్ గెట్టితో కలిసి జిమెనెజ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న జేవియర్ 'చిచారిటో' హెర్నాండెజ్ రికార్డుకు జిమెనెజ్ కేవలం ఆరు గోల్స్ దూరంలో ఉన్నాడు.

మరోవైపు కొలంబియాలో జన్మించి, మెక్సికో పౌరసత్వం తీసుకున్న 29 ఏళ్ల ఫార్వర్డ్ ప్లేయర్ క్వినోన్స్​తో పాటు మరో ఐదుగురు కీలక ఆటగాళ్లు ఈ మ్యాచ్ ద్వారా మెక్సికో జాతీయ జట్టు (ఎల్ ట్రి) తరఫున ప్రపంచకప్‌లో అరంగేట్రం చేశారు.

మెక్సికో తదుపరి పోరు ఎవరితో?

గత 2022 ఖతార్ ప్రపంచకప్‌లో మొదటి రౌండ్‌లోనే వెనుదిరిగి అభిమానులను నిరాశపరిచిన మెక్సికో.. ఈసారి మాత్రం విజయాంతర ఆరంభంతో టోర్నీలో 3 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. మెక్సికో తన తదుపరి మ్యాచ్‌ను వచ్చే గురువారం గ్వాడలజారా వేదికగా దక్షిణ కొరియాతో ఆడనుంది. అలాగే తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన దక్షిణాఫ్రికా జట్టు అదే రోజు అట్లాంటాలో చెక్ రిపబ్లిక్‌తో తలపడనుంది.

ఈ ఫిఫా ప్రపంచకప్ 2026లో చరిత్రలోనే రికార్డు స్థాయిలో 48 జట్లు పాల్గొంటుండగా.. మెక్సికో, కెనడా, అమెరికా దేశాలు సంయుక్తంగా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More