ఐపీఎల్లో పాకిస్థాన్ ప్లేయర్స్ ఆడేలా చూడండి.. ఆటల్లో రాజకీయాలను దూరంగా ఉంచండి: ఐసీసీకి స్ట్రాంగ్ మెసేజ్ పంపిన వసీం అక్రమ్
ఐపీఎల్లో పాకిస్థాన్ క్రికెటర్లను తీసుకోవాలన్న వాదనను ఆ దేశ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ మరోసారి తెరపైకి తెచ్చాడు. ఈసారి ఐసీసీకి కాస్త గట్టిగానే సందేశం పంపించాడు. ఆటల్లో రాజకీయాలు వద్దని అతడు స్పష్టం చేశాడు.
ఇండియా, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయన్న విషయం తెలుసు కదా. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆటలకు రాజకీయాలను దూరంగా ఉంచాలని, ప్రతి లీగ్ లో ప్రతి దేశానికి చెందిన ప్లేయర్ కు ప్రాతినిధ్యం ఉండేలా చూడాల్సిన బాధ్యత ఐసీసీదేనని అతడు స్పష్టం చేశాడు.

వసీం అక్రమ్ ఏమన్నాడంటే?
పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ ఐసీసీకి ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఈ విషయాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని అతడు కోరాడు. ఆల్-టైమ్ గ్రేటెస్ట్ లెఫ్ట్-ఆర్మ్ పేసర్గా ప్రశంసలు అందుకున్న అక్రమ్.. 'రాజకీయాలను క్రీడల నుండి దూరంగా ఉంచాలి' అని ఐసీసీకి గట్టి సందేశం పంపాడు. దీని ద్వారానే క్రికెట్కు సంబంధించి రెండు దేశాల మధ్య ఉన్న వైరానికి ముగింపు పలకొచ్చని అతడు అభిప్రాయపడ్డాడు.
పాకిస్థాన్ క్రికెటర్లు ఐపీఎల్ (IPL)లో ఆడాలని, అలాగే భారత క్రికెటర్లు కూడా ఇతర లీగుల్లో ఆడాలని ఆకాంక్షిస్తూ అక్రమ్ పాత అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చాడు. టీ20 లీగ్ లలో 'ప్రతి దేశం నుండి ఆటగాళ్లను' ఎంపిక చేయాలని అతడు నొక్కి చెప్పాడు.
విజ్డన్ క్రికెట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వసీం అక్రమ్ మాట్లాడుతూ... “నన్ను క్షమించండి. కానీ క్రికెట్లో నాకు నచ్చనిది రాజకీయం. సూటిగా చెప్పాలంటే, క్రీడలను రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలి. లీగ్ క్రికెట్లో ప్రతి దేశం నుండి ప్రతి ఆటగాడిని ఎంచుకోవాలి. ధైర్యంగా ఉండండి. గొప్పగా వ్యవహరించండి. కానీ దురదృష్టవశాత్తు అది జరగడం లేదు. ఐసీసీ ఇక్కడే జోక్యం చేసుకోవాలి. క్రికెట్ బోర్డులు ఇక్కడే ముందుకు రావాలి. లీగ్ను ఎవరు నిర్వహిస్తున్నారన్నది ముఖ్యం కాదు. టీమ్స్ ఎవరివి అన్నది ముఖ్యం కాదు. ప్రతి దేశం నుండి ప్రతి ఆటగాడిని ఎంపిక చేయాలి” అని అక్రమ్ అన్నాడు.
ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ సంబంధాలు ఇలా..
ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే భారత్, పాకిస్తాన్ల మధ్య సంబంధాలు అత్యంత కనిష్ట స్థాయిలో ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఈ రెండు దేశాల మధ్య పరిస్థితులు మరింత అదుపు తప్పాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సహజంగానే ఇది భారత్-పాకిస్తాన్ క్రికెట్పై స్పష్టమైన ప్రభావాన్ని చూపించింది.
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలోని రెండు మ్యాచ్లు రద్దు అయ్యాయి. ఇటీవల ముగిసిన ఆసియా కప్లో మూడు భారత్-పాక్ మ్యాచ్లు జరిగినా.. ఆటగాళ్ల మధ్య వాతావరణం స్నేహపూర్వకంగా లేదు. మ్యాచ్ అనంతరం హ్యాండ్ షేక్ చేసుకోకపోవడం, ఆసియా కప్ గెలిచిన భారత ట్రోఫీతో ఏసీసీ చీఫ్ మోసిన్ నఖ్వీ పారిపోవటం వంటి సంఘటనలు ఉద్రిక్తతలను మరింత పెంచాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


