Heavy rain alert in India : ‘24 గంటల పాటు జాగ్రత్తగా ఉండండి’- దేశవ్యాప్తంగా ఐఎండీ అలర్ట్స్..
IMD rain alert : భారీ వర్షాలతో దేశం వణికిపోతోంది. దేశ రాజధాని దిల్లీ, నోయిడా, గురుగ్రామ్లతో పాటు కేరళ, హిమాచల్, ఉత్తరాఖండ్లను దంచికొడుతున్న వానలతో జనజీవనం స్తంభించింది. పలు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్ ప్రకటించగా, పాఠశాలలు మూతపడ్డాయి.
దేశంలోని పలు ప్రాంతాలను జలదిగ్బంధం చేస్తూ నైరుతి రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చాయి! శుక్రవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాల ధాటికి దేశ రాజధాని దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో చెరువులను తలపించేలా వీధులు జలమయమయ్యాయి. తీవ్రమైన ట్రాఫిక్ జామ్లు, కొండచరియలు విరిగిపడటం, మట్టిచరియలు పడటం వంటి ప్రమాదాలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే 24 గంటల్లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.

వర్షభీభత్సంతో వణికిపోతున్న రాష్ట్రాలు..
దిల్లీ-ఎన్సీఆర్లో కుండపోత:
దిల్లీ సహా పరిసర ప్రాంతాలైన నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్లలో వర్షం దంచికొడుతోంది. ఆగస్టు నెలలోనే అత్యంత భారీ వర్షపాతం నమోదైన రోజుగా శుక్రవారం నిలిచింది. దీనితో ఐఎండీ.. దిల్లీకి 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన ఈ వానలు రాత్రి వరకు కొనసాగే అవకాశముందని అధికారులు తెలిపారు.
కేరళలో 7 జిల్లాలకు రెడ్ అలర్ట్:
దక్షిణాది రాష్ట్రమైన కేరళలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిసూర్, పాలక్కాడ్, కణ్ణూర్, కాసర్గోడ్ జిల్లాలకు ఐఎమ్డీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కాగా పత్తనంతిట్ట, ఇడుక్కి, మలప్పురం, కోజికోడ్, వయనాడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, తిరువనంతపురం, కొల్లాం జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ అయ్యాయి. కొచ్చి-సేలం జాతీయ రహదారిపై కుతీరన్ కవల టన్నెల్ సమీపంలో చిన్నపాటి మట్టిచరియలు విరిగిపడ్డాయి.
పాఠశాలలకు సెలవులు: ఎర్నాకుళం, త్రిసూర్, పత్తనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, వయనాడ్, కణ్ణూర్, కాసర్గోడ్ జిల్లాల్లోని విద్యాసంస్థలకు స్థానిక యంత్రాంగం సెలవు ప్రకటించింది.
హిమాచల్ ప్రదేశ్లో 145 రహదారులు బంద్..
వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడటంతో హిమాచల్ ప్రదేశ్లో తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. మండి, కులు, సిర్మౌర్, శిమ్లా, కాంగ్రా, కిన్నోర్, ఉనా జిల్లాల్లో దాదాపు 145 ప్రధాన రహదారులను మూసివేశారు. 224 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడమే కాకుండా 14 తాగునీటి పథకాలకు అంతరాయం ఏర్పడింది. జూన్ 30 నుంచి ఇప్పటివరకు కురిసిన వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో 64 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అత్యవసర కార్యకలాపాల కేంద్రం (ఎస్ఈఓసీ) తెలిపింది.
ఉత్తరాఖండ్లో పొంగిపొర్లుతున్న నదులు..
దేవభూమి ఉత్తరాఖండ్లో అలకనంద, భాగీరథి, మందాకిని, గంగా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. డెహ్రాడూన్, చమోలి, బాకేశ్వర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ కావడంతో 12వ తరగతి వరకు పాఠశాలలను మూసివేశారు. వర్షాలు, ల్యాండ్స్లైడ్స్ కారణంగా 4 జాతీయ రహదారులు సహా 132 రోడ్లు మూతపడ్డాయి. ఉత్తరకాశీ వద్ద యమునోత్రి నేషనల్ హైవే, రుద్రప్రయాగ్ వద్ద రిషికేష్-కేదార్నాథ్ హైవేలు నిలిచిపోయాయి.
ఐఎండీ హెచ్చరికలు:
ఒడిశా, కోస్టల్ కర్ణాటక, సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, తూర్పు మధ్యప్రదేశ్, ఈస్ట్ రాజస్థాన్, కేరళ ప్రాంతాల్లో రాబోయే 24 గంటల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎమ్డీ తెలిపింది.
అలాగే బీహార్, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


