Mutual Fund : మీ చిన్న పెట్టుబడిని కోట్ల రూపాయల సంపదగా మార్చే మంత్రం.. రూ. 2వేలతో రూ. 2కోట్లు!

Step Up investment : జీతం పెరిగే కొద్దీ మ్యూచువల్​ ఫండ్​ సిప్ మొత్తాన్ని కూడా పెంచాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. దీనినే స్టెప్​ అప్​ సిప్​ అని అంటారు. కేవలం 10 శాతం వార్షిక పెంపుతో మీ రిటైర్మెంట్ ఫండ్‌ను ఊహించని స్థాయిలో పెంచుకోవచ్చు. ఎలాగో ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

Published on: Apr 13, 2026, 10:45:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సాధారణంగా మ్యూచువల్​ ఫండ్ సిప్​ (సిస్టెమ్యాటిక్​ ఇన్వెస్ట్​మెంట్​ ప్లాన్) అనేది క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి మార్గం. ఇది భవిష్యత్తు అవసరాలకు, రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భరోసాకు ఎంతగానో తోడ్పడుతుంది. అయితే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే.. కెరీర్ ప్రారంభంలో ఎంత మొత్తంతో సిప్ మొదలుపెడతారో, చివరి వరకు అదే మొత్తాన్ని కొనసాగిస్తారు. ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) నితిన్ కౌశిక్ అభిప్రాయం ప్రకారం.. కేవలం స్థిరమైన సిప్ చేయడం వల్ల, ద్రవ్యోల్బణం కారణంగా, ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు.

మ్యూచువల్​ ఫండ్​ ఇన్వెస్ట్​మెంట్​ టిప్స్..
మ్యూచువల్​ ఫండ్​ ఇన్వెస్ట్​మెంట్​ టిప్స్..

మరి దీనికి పరిష్కారమేంటి? అని అడిగితే.. 'స్టెప్-అప్ సిప్​' అని అంటున్నారు నితిన్ కౌశిక్.

మ్యూచువల్​ ఫండ్​ ఇన్వెస్ట్​మెంట్​ : స్టెప్​అప్ సిప్​ అంటే ఏంటి?

మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో చేసే నెలవారీ పెట్టుబడిని ప్రతి సంవత్సరం ఒక నిర్ణీత శాతం (ఉదాహరణకు 10%) లేదా నిర్ణీత మొత్తాన్ని పెంచుకుంటూ పోవడాన్ని 'స్టెప్-అప్ సిప్' అంటారు. ఇది మీ వార్షిక జీతాల పెంపుకు అనుగుణంగా పెట్టుబడిని పెంచుకోవడానికి వీలు కల్పిస్తుంది.

సాధారణ సిప్ వర్సెస్ స్టెప్-అప్ సిప్​: తేడా ఏంటి?

నితిన్ కౌశిక్ అందించిన ఒక ఉదాహరణను పరిశీలిద్దాం:

పరిస్థితి 1 (సాధారణ సిప్): మీరు 25 ఏళ్ల వయసులో నెలకు రూ. 2,000 పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. 30 ఏళ్ల పాటు (55 ఏళ్ల వయసు వరకు) 12% వార్షిక రాబడి వస్తుందని అనుకుంటే, మీ చేతికి వచ్చే మొత్తం సుమారు రూ. 70.6 లక్షలు.

ట్విస్ట్: 6% ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, నేటి కొనుగోలు శక్తి ప్రకారం ఆ రూ. 70.6 లక్షల విలువ కేవలం రూ. 12.3 లక్షలు మాత్రమే!

ఇది మీ రిటైర్మెంట్‌కు ఏమాత్రం సరిపోదు.

పరిస్థితి 2 (స్టెప్-అప్ సిప్): అదే రూ. 2,000 పెట్టుబడిని ప్రతి సంవత్సరం కేవలం 10% పెంచుకుంటూ వెళ్లాలి. అప్పుడు మీ పెట్టుబడి విలువ ఏకంగా రూ. 2.17 కోట్లకు చేరుకుంటుంది. అంటే కేవలం చిన్న పెంపుతో మీ ఫండ్ దాదాపు మూడు రెట్లు పెరిగింది!

స్టెప్-అప్ ఎందుకు కీలకం?

ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడం: కాలక్రమేణా రూపాయి విలువ పడిపోతుంది. స్టెప్-అప్ ద్వారా మీరు ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా మీ నిధిని పెంచుకోవచ్చు.

కాంపౌండింగ్ శక్తి: అసలు మొత్తాన్ని పెంచడం వల్ల చక్రవడ్డీ ప్రభావం మీ పెట్టుబడిపై అద్భుతంగా పనిచేస్తుంది.

లైఫ్ స్టైల్ ఇన్​ఫ్లేషన్ కట్టడి: ఆదాయం పెరిగినప్పుడు అనవసర ఖర్చులు పెరగకుండా, ఆ పెరిగిన ఆదాయాన్ని పెట్టుబడిగా మార్చవచ్చు.

మ్యూచువల్​ ఫండ్​ ఇన్వెస్ట్​మెంట్- ఎవరు సిప్​ ప్రారంభించవచ్చు?

18 ఏళ్లు నిండిన వారు ఎవరైనా డీమ్యాట్ ఖాతా తెరిచి మ్యూచువల్​ ఫండ్ ఇన్వెస్ట్​మెంట్​ కోసం సిప్ మొదలుపెట్టవచ్చు. ముఖ్యంగా:

మార్కెట్ ఒడిదుడుకుల గురించి అవగాహన లేని కొత్త మదుపర్లు.

స్థిరమైన నెలవారీ ఆదాయం కలిగిన వారు.

దీర్ఘకాలిక లక్ష్యాల (పిల్లల చదువులు, రిటైర్మెంట్) కోసం ప్లాన్ చేసేవారు.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. స్టెప్-అప్ సిప్​ని మధ్యలో ఆపవచ్చా?

అవును, చాలా మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు స్టెప్-అప్ ఫీచర్‌ను ఎప్పుడైనా మార్చుకునే లేదా రద్దు చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తాయి.

2. కనీసం ఎంత శాతం పెంచాలి?

సాధారణంగా ప్రతి ఏటా 5% నుంచి 10% పెంచడం ఉత్తమం. ఇది మీ జీతాల పెంపు శాతంతో సమానంగా ఉంటే భారం అనిపించదు.

3. సిప్​లో రాబడి గ్యారెంటీగా ఉంటుందా?

సిప్​లు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. అయితే, దీర్ఘకాలంలో (10-15 ఏళ్లు) ఇవి ద్రవ్యోల్బణం కంటే మెరుగైన రాబడిని అందించే అవకాశం ఉంది.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థామ్​టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్​మెంట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More