వాట్సాప్ ఘోస్ట్ పేరింగ్‌పై కేంద్రం హెచ్చరిక: ఓటీపీ లేకపోయినా మీ అకౌంట్ మాయం..

వాట్సాప్‌లో 'ఘోస్ట్ పేరింగ్' (GhostPairing) పేరుతో జరుగుతున్న కొత్త రకం మోసంపై కేంద్ర ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. ఇందులో ఓటీపీ లేదా పాస్‌వర్డ్‌లు అవసరం లేకుండానే హ్యాకర్లు మీ అకౌంట్‌ను తమ ఆధీనంలోకి తీసుకునే ప్రమాదం ఉంది.

Published on: Dec 31, 2025, 14:25:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారులే లక్ష్యంగా కొత్త రకం సైబర్ దాడులు జరుగుతున్నాయి. దీనిని 'ఘోస్ట్ పేరింగ్' (GhostPairing) స్కామ్‌గా పిలుస్తున్నారు. ఈ ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) తాజాగా పౌరులకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. సాధారణంగా అకౌంట్ హ్యాక్ అవ్వాలంటే ఓటీపీ లేదా సిమ్ స్వ్యాపింగ్ వంటివి అవసరం అవుతాయి. కానీ, ఈ ఘోస్ట్ పేరింగ్ స్కామ్‌లో అవేమీ లేకుండానే హ్యాకర్లు మీ వాట్సాప్‌లోకి ప్రవేశించగలరు.

వాట్సాప్ ఘోస్ట్ పేరింగ్‌పై కేంద్రం హెచ్చరిక: ఓటీపీ లేకపోయినా మీ అకౌంట్ మాయం.. (REUTERS)
వాట్సాప్ ఘోస్ట్ పేరింగ్‌పై కేంద్రం హెచ్చరిక: ఓటీపీ లేకపోయినా మీ అకౌంట్ మాయం.. (REUTERS)

అసలు ఈ 'ఘోస్ట్ పేరింగ్' ఎలా జరుగుతుంది?

వాట్సాప్‌లో ఉన్న 'డివైజ్ లింకింగ్' (Device Linking) ఫీచర్‌ను హ్యాకర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ మోసం ఎలా జరుగుతుందో 'సర్ట్-ఇన్' (CERT-In) తన నివేదికలో వివరించింది:

నమ్మకమైన సందేశం: బాధితులకు తమకు తెలిసిన వ్యక్తుల నుంచే వచ్చినట్లుగా ఒక సందేశం వస్తుంది. అందులో "హాయ్, ఈ ఫోటో చూడు" (Hi, check this photo) అని ఉంటుంది. దీనికి ఫేస్‌బుక్ ప్రివ్యూ తరహాలో ఒక లింక్ కూడా జత చేసి ఉంటుంది.

నకిలీ వెరిఫికేషన్: వినియోగదారు ఆ లింక్‌ను క్లిక్ చేయగానే ఒక వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది. ఆ ఫోటో చూడాలంటే మీ ఐడెంటిటీని వెరిఫై చేయాలని అది అడుగుతుంది.

తెలియకుండానే అనుమతి: ఈ ప్రక్రియలో హ్యాకర్లు వాట్సాప్‌లోని “Link a device via phone number” అనే ఫీచర్‌ను యాక్టివేట్ చేస్తారు. వినియోగదారుడు ఏదో ఫోటో వస్తుందని భావించి అక్కడ క్లిక్ చేయగానే, హ్యాకర్ బ్రౌజర్ మీ వాట్సాప్ అకౌంట్‌కు 'ట్రస్టెడ్ డివైజ్'గా లింక్ అయిపోతుంది.

ఎందుకు ప్రమాదకరం?

ఈ స్కామ్‌లో మీకు ఎలాంటి ఓటీపీ రాదు, మీ పాస్‌వర్డ్‌ను ఎవరూ దొంగిలించరు. కేవలం ఒక లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు తెలియకుండానే హ్యాకర్‌కు మీ అకౌంట్‌ను వాడటానికి అనుమతి ఇచ్చినట్లు అవుతుంది. ఒక్కసారి లింక్ అయ్యాక, హ్యాకర్ మీ మెసేజ్‌లు చదవడం, మీ పేరుతో ఇతరులకు మెసేజ్‌లు పంపడం వంటివి సులభంగా చేయగలరు.

జాగ్రత్త పడటం ఎలా?

కేంద్ర ప్రభుత్వం, సైబర్ భద్రతా నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు:

లింక్‌లపై నిఘా: మీ స్నేహితులు లేదా బంధువుల నుంచి వచ్చినా సరే, అనుమానాస్పదంగా ఉండే లింక్‌లను క్లిక్ చేయకండి. ముఖ్యంగా "ఫోటోలు చూడటానికి వెరిఫై చేయండి" అనే వాటి పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి.

లింక్డ్ డివైజ్‌లను తనిఖీ చేయండి: మీ వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Linked Devices ఆప్షన్‌ను తరచూ చూస్తుండాలి. అక్కడ మీకు తెలియని డివైజ్ ఏదైనా కనిపిస్తే వెంటనే 'లాగౌట్' చేయండి.

టూ-స్టెప్ వెరిఫికేషన్: మీ వాట్సాప్ అకౌంట్‌కు టూ-స్టెప్ వెరిఫికేషన్‌ను తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోండి. ఇది అదనపు రక్షణ కవచంలా పనిచేస్తుంది.

ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. సైబర్ నేరగాళ్లు మన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని 'సోషల్ ఇంజనీరింగ్' పద్ధతులతో మోసం చేస్తున్నారు. సాంకేతికత ఎంత పెరిగినా, మన అప్రమత్తతే మనకు రక్ష.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More