హైదరాబాద్‌, వైజాగ్ హవా: 2030 నాటికి డేటా సెంటర్ల హబ్‌గా తెలుగు రాష్ట్రాలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ సేవల విప్లవంతో భారత్‌లో డేటా సెంటర్ల రంగానికి విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. 2030 నాటికి హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం వంటి నగరాలు ఈ రంగంలో అగ్రస్థానానికి చేరుకోనున్నాయని రియల్ ఎస్టేట్ సేవల సంస్థ 'కుష్‌మ్యాన్ & వేక్‌ఫీల్డ్' నివేదిక వెల్లడించింది.

Updated on: Sep 17, 2026, 16:10:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కృత్రిమ మేధ (AI), క్లౌడ్ కంప్యూటింగ్ విస్తరణ నేపథ్యంలో భారతదేశంలో డేటా సెంటర్ల రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు చెన్నై, బెంగళూరు వంటి మెట్రో నగరాలు ఈ రంగంలో ఆధిపత్యం చెలాయించగా, రాబోయే రోజుల్లో ఆ ముఖచిత్రం పూర్తిగా మారనుంది. హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, గుజరాత్‌లోని ధోలేరా వంటి కొత్త హబ్‌లు డేటా సెంటర్ల రేసులో దూసుకెళ్తున్నాయి.

కాలిఫోర్నియాలోని 33 మెగావాట్ డేటా సెంటర్
కాలిఫోర్నియాలోని 33 మెగావాట్ డేటా సెంటర్

ఆరు రెట్లు పెరగనున్న సామర్థ్యం

రియల్ ఎస్టేట్ సేవల సంస్థ 'కుష్‌మ్యాన్ & వేక్‌ఫీల్డ్' (Cushman & Wakefield) విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రస్తుతం భారత్‌లోని మొత్తం డేటా సెంటర్ల సామర్థ్యంలో హైదరాబాద్ సహా ఇతర కొత్త నగరాల వాటా 10 శాతం (178 మెగావాట్లు) మాత్రమే ఉంది. 2030 చివరి నాటికి ఇది దాదాపు ఆరు రెట్లు పెరిగి 1.1 గిగావాట్లకు (GW) చేరుకుంటుందని నివేదిక అంచనా వేసింది. దేశీయంగా అంచనా వేసిన మొత్తం 5.65 గిగావాట్ల సామర్థ్యంలో వీటి వాటా 20 శాతానికి చేరుకోనుంది. అంటే ఈ కొత్త కేంద్రాలు ఏటా 58 శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేయనున్నాయి.

మరోవైపు, ప్రస్తుతం 12 శాతం వాటాతో (215 మెగావాట్లు) రెండో స్థానంలో ఉన్న చెన్నై, రాబోయే రోజుల్లో తన మార్కెట్ వాటాను కోల్పోనుంది. 2030 నాటికి చెన్నై సామర్థ్యం 582 మెగావాట్లకు చేరినప్పటికీ, వృద్ధి రేటు మాత్రం 28 శాతానికి మందగిస్తుందని నివేదిక పేర్కొంది.

గ్లోబల్ దిగ్గజాల బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్లు

డేటా లోకలైజేషన్ నిబంధనలు, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు భారత్‌పై చూపిస్తున్న ఆసక్తే ఈ విస్తరణకు ప్రధాన కారణం. గత 12 నెలల్లోనే ఈ కంపెనీలు భారత్‌లో 250 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులను ప్రకటించాయి.

ఈ క్రమంలో విశాఖపట్నం, ధోలేరా(గుజరాత్) వంటి ప్రాంతాలు కొత్త డేటా సెంటర్ హబ్‌లుగా అవతరిస్తున్నాయి. రాబోయే నాలుగు ఏళ్లలోనే ఈ నూతన ప్రాంతాల్లో 232 మెగావాట్ల కొత్త సామర్థ్యం అందుబాటులోకి రానుంది. వైజాగ్‌లో గూగుల్ సంస్థ అదానీ గ్రూప్, భారతీ ఎయిర్‌టెల్‌లతో కలిసి 1 గిగావాట్ సామర్థ్యంతో భారీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తుండగా, మెటా ఇండియా సంస్థ సిఫీ టెక్నాలజీస్‌తో కలిసి 500 మెగావాట్ల ప్రాజెక్టును ప్లాన్ చేస్తోంది.

హైదరాబాద్‌కు ఎందుకింత క్రేజ్?

"హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున స్థలాలు లభ్యం కావడం, విద్యుత్, నీటి సరఫరా అవకాశాలు మెరుగ్గా ఉండటం, గ్లోబల్ కంపెనీల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో భాగ్యనగరం వేగంగా విస్తరిస్తోంది" అని టెక్నాలజీ కన్సల్టెన్సీ సంస్థ 'RPA2AI రిసెర్చ్' వ్యవస్థాపకుడు కాశ్యప్ కొంపెల్ల తెలిపారు.

ఐటీ వాతావరణం, తక్కువ నిర్వహణ వ్యయం హైదరాబాద్‌ను డేటా సెంటర్లకు ఆదర్శవంతంగా మార్చాయని పిడబ్ల్యుసి (PwC) పార్ట్‌నర్ వినీష్ బావా పేర్కొన్నారు.

ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా ఈ విస్తరణకు తోడ్పడుతున్నాయి. భారత్‌లో డేటా సెంటర్లను ఉపయోగించే విదేశీ క్లౌడ్ ఆపరేటర్లకు 2047 వరకు పన్ను మినహాయింపు (Tax Holiday) ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా 2016లోనే ప్రత్యేక డేటా సెంటర్ పాలసీని తీసుకువచ్చి ఈ రంగానికి ఊతాన్నిచ్చింది.

ప్రధాన సవాలు విద్యుత్ సరఫరాయే!

డేటా సెంటర్ల రంగం వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, విద్యుత్ మౌలిక వసతుల కొరత సవాలుగా మారింది. ట్రాన్స్‌మిషన్ లైన్లు, సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల వ్యవస్థ సరిపడా లేకపోవడం వల్ల విస్తరణకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ డేటా సెంటర్ల జోరు వల్ల డీజెల్ జనరేటర్ల తయారీ సంస్థలైన కమిన్స్ ఇండియా, కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్, స్టెర్లింగ్ గ్రీన్ పవర్ సొల్యూషన్స్‌కు కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడం విశేషం.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More