New Cars : హ్యుందాయ్ మెగా ప్లాన్! భారత మార్కెట్లోకి 26 కొత్త కార్లు- 7 సీటర్ ఎంపీవీ కూడా..
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ భారత మార్కెట్లో తన పట్టును మరింత పెంచుకునేందుకు సిద్ధమైంది. 2030 నాటికి 26 కొత్త కార్లను లాంచ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఒక పవర్ఫుల్ ఆఫ్రోడ్ ఎస్యూవీ, 7-సీటర్ ఎంపీవీ, మారుతీ సుజుకీ ఫ్రాంక్స్కు పోటీగా సరికొత్త క్రాసోవర్ ఉండటం విశేషం.
దక్షిణ కొరియాకు చెందిన కార్ల దిగ్గజం హ్యుందాయ్.. భారత వినియోగదారుల కోసం భారీ ప్రణాళికలను ప్రకటించింది. వేగంగా వృద్ధి చెందుతున్న మూడు ప్రధాన విభాగాల్లోకి అడుగుపెడుతున్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఇందులో భాగంగా ఒక సరికొత్త ఆఫ్రోడ్ ఎస్యూవీ, ఒక 7-సీటర్ ఎంపీవీ, మారుతీ సుజుకీ ఫ్రాంక్స్కు సవాల్ విసిరే విధంగా ఒక సబ్-4 మీటర్ క్రాసోవర్ను హ్యుందాయ్ తీసుకువస్తోంది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..
2030 నాటికి 26 కొత్త మోడళ్లు..!
హ్యుందాయ్ తన వ్యూహంలో భాగంగా 7 సరికొత్త బ్రాండ్ నేమ్స్తో పాటు మొత్తం 26 కార్లను 2030 నాటికి భారత్లో విడుదల చేయనుంది. వీటితో పాటు 2027లో నెక్ట్స్ జనరేషన్ క్రెటా ద్వారా తన మొదటి హైబ్రిడ్ వాహనాన్ని పరిచయం చేయనుంది. పాలిసేడ్ హైబ్రిడ్, మరో 7-సీటర్ హైబ్రిడ్ ఎస్యూవీ కూడా రేసులో ఉన్నాయి. టాటా నెక్సాన్ ఈవీకి పోటీగా ఒక కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీని కూడా కంపెనీ పరీక్షిస్తోంది.
బేయన్ క్రాసోవర్..
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్, టయోటా టైజర్లకు పోటీగా 'బేయన్' క్రాసోవర్ను హ్యుందాయ్ సిద్ధం చేస్తోంది. దీనిని ప్రస్తుతం కొరియా, యూరప్ దేశాల్లో పరీక్షిస్తున్నారు.
ఇంటీరియర్: ఇది వెన్యూ ఎస్యూవీ తరహాలోనే 12.3 ఇంచ్ భారీ టచ్స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేతో రానుంది.
ఇంజన్: ఇందులో 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్లు ఉంటాయి. అలాగే హైబ్రిడ్ టెక్నాలజీకి సపోర్ట్ చేసే కొత్త 1.2 లీటర్ టర్బో ఇంజన్పై కూడా కంపెనీ పని చేస్తోంది.
ఈ కొత్త లాంచులతో భారత ఆటోమొబైల్ మార్కెట్లో హ్యుందాయ్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది.
హ్యుందాయ్ 7-సీటర్ ఎంపీవీ..
ఇండోనేషియాలో విక్రయించే ‘స్టార్గేజర్’ ఆధారంగా హ్యుందాయ్ తన కొత్త 7 సీటర్ ఎంపీవీని రూపొందించే అవకాశం ఉంది. ఇది కియా క్యారెన్స్ ప్లాట్ఫారమ్ను పంచుకుంటుంది.
పోటీ- ధర: ఇది మారుతీ సుజుకీ ఎర్టిగా, కియా క్యారెన్స్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. దీని ధర సుమారు రూ. 12 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య ఉండవచ్చు.
ఇంజిన్: ఇండియా వెర్షన్లో 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్లు ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో దీనికి ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా తోడవ్వచ్చు.
ఫీచర్లు: లెవల్ 2 అడాస్, డ్యూయల్ స్క్రీన్ సెటప్, సన్రూఫ్, వెెంటిలేటెడ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉంటాయి.
హ్యుందాయ్ పవర్ఫుల్ ఆఫ్రోడ్ ఎస్యూవీ..
హ్యుందాయ్ నుంచి రాబోతున్న ఈ ఎస్యూవీ బాక్సీ, మజిల్ డిజైన్తో ఉండబోతోంది. ఇది కఠినమైన ఆఫ్రోడ్ ప్రయాణాలకు అనువుగా 4డబ్ల్యూడీ (ఫోర్ వీల్ డ్రైవ్) సెటప్తో రానుంది. ప్రస్తుతం హ్యుందాయ్ వద్ద సరైన 4x4 ఆఫ్-రోడర్ లేదు, కాబట్టి ఈ కొత్త మోడల్ ఆ లోటును తీర్చనుంది. చైనాలో విక్రయించే టక్సన్ ఏడబ్ల్యూడీ లేదా యూరప్ వెర్షన్ సాంటా ఎఫ్ఈ ఆధారంగా దీనిని రూపొందించే అవకాశం ఉంది. ఇందులో పవర్ఫుల్ టర్బో పెట్రోల్, హైబ్రిడ్ ఇంజన్లు ఉండనున్నాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు-
1. హ్యుందాయ్ నుంచి వచ్చే మొదటి హైబ్రిడ్ కారు ఏది?
హ్యుందాయ్ తన అత్యంత ప్రజాదరణ పొందిన క్రెటా మోడల్లో 2027 నాటికి మొదటి స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ను ప్రవేశపెట్టనుంది.
2. హ్యుందాయ్ కొత్త ఎంపీవీ ఏ కార్లకు పోటీగా రానుంది?
హ్యుందాయ్ నుంచి రాబోయే 7-సీటర్ ఎంపీవీ ప్రధానంగా మారుతీ సుజుకీ ఎర్టిగా, కియా క్యారెన్స్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


