2027 Cricket World Cup: వన్డే వరల్డ్ కప్ సమరం.. 24 ఏళ్ల తర్వాత అక్కడ.. 12 స్టేడియాలు.. కొత్తగా ‘సూపర్ 7’ ఫార్మాట్!
2027 Cricket World Cup: ఐసీసీ మెన్స్ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ కు సంబంధించి బిగ్ అప్ డేట్ వచ్చేసింది. ఈ మెగా టోర్నీ మ్యాచ్ లు జరిగే స్టేడియాల లిస్ట్ ను ఐసీసీ ప్రకటించేసింది. 24 ఏళ్ల తర్వాత ఆఫ్రికాలో వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగబోతున్నాయి. అలాగే సూపర్ 7 ఫార్మాట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.
2027 Cricket World Cup: ప్రపంచ క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2027 ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ (ICC Men's Cricket World Cup 2027) కి సంబంధించిన అత్యంత కీలకమైన అప్డేట్ వచ్చేసింది. సుదీర్ఘమైన 24 ఏళ్ల విరామం తర్వాత ఐసీసీ మెగా ఈవెంట్ మళ్లీ ఆఫ్రికా ఖండానికి తిరిగి రానుంది. ఈ టోర్నమెంట్ను దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు ఉమ్మడిగా నిర్వహించనున్నాయి.

2027 క్రికెట్ ప్రపంచకప్
2027 వన్డే వరల్డ్ కప్ లో భాగంగా మ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చే స్టేడియాల లిస్ట్ ను ఐసీసీ తాజాగా ప్రకటించింది. మొత్తం 12 మైదానాల్లో మ్యాచ్లు జరగనున్నట్లు జోహన్నెస్బర్గ్లో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో ఐసీసీ చైర్మన్ జై షా ప్రకటించారు.
ఈ వేడుకలో దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజాలు గ్రేమ్ స్మిత్, మఖాయా ఎన్తిని, హషీమ్ ఆమ్లా, తెంబా బావుమా, కాగిసో రబాడాతో పాటు జింబాబ్వే, నమీబియా మాజీ క్రీడాకారులు పాల్గొన్నారు. గతంలో 2003లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన్యా దేశాలు సంయుక్తంగా ప్రపంచకప్ను నిర్వహించగా, మళ్లీ ఆఫ్రికన్ సాయిల్పై ఈ స్థాయి క్రికెట్ పండగ జరగడం ఇదే తొలిసారి.
ఎక్కడెక్కడ మ్యాచ్లు?
ఈ 2027 వన్డే ప్రపంచకప్ టోర్నీలో భాగస్వామ్యమవుతున్న మూడు దేశాల్లోని ప్రధాన వేదికల వివరాలను ఐసీసీ ప్రకటించింది.
దక్షిణాఫ్రికా (8 వేదికలు): వాండరర్స్ స్టేడియం (జోహన్నెస్బర్గ్), సెంచూరియన్ (ట్వానే), న్యూలాండ్స్ (కేప్టౌన్), కింగ్స్మీడ్ (డర్బన్), సెయింట్ జార్జెస్ పార్క్ (గెబర్హా), మంగౌంగ్ ఓవల్ (బ్లూమ్ఫాంటెన్), బోలాండ్ పార్క్ (పాల్), బఫెలో పార్క్ (ఈస్ట్ లండన్).
జింబాబ్వే (3 వేదికలు): హరారే స్పోర్ట్స్ క్లబ్ (హరారే), క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ (బులవాయో), కొత్తగా నిర్మిస్తున్న ఫాలే మోసి-ఓ-తున్యా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (విక్టోరియా ఫాల్స్).
నమీబియా (1 వేదిక): నమీబియా క్రికెట్ గ్రౌండ్ (విండ్హోక్).
కొత్త టోర్నీ ఫార్మాట్ ‘సూపర్ 7’
క్రికెట్ ప్రేమికుల్లో ఆసక్తిని రెట్టింపు చేసేందుకు ఐసీసీ ఈసారి 57 మ్యాచ్లతో కూడిన సరికొత్త 'త్రీ-స్టేజ్' (Three-Stage) ఫార్మాట్ను అమల్లోకి తీసుకొస్తోంది. కేవలం రౌండ్-రాబిన్ పద్ధతికి భిన్నంగా ఈ టోర్నీ అత్యంత పోటీతత్వంతో సాగనుంది.
- సూపర్ సిరీస్ (మొదటి దశ): 12 నుండి 14వ ర్యాంకుల్లో ఉన్న మూడు జట్లు రౌండ్-రాబిన్ పద్ధతిలో పోటీపడతాయి. విజేత తదుపరి ప్రధాన దశకు అర్హత సాధిస్తుంది.
- గ్రూప్ స్టేజ్ (రెండో దశ): మొత్తం 12 జట్లు రెండు గ్రూప్లుగా (గ్రూప్నకు 6 జట్లు) విడిపోయి 30 మ్యాచ్లు ఆడతాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్-3 జట్లతో పాటు, రెండింట్లో కలిపి తదుపరి ఉత్తమ రన్ రేట్/పాయింట్లు ఉన్న మరొక జట్టు (మొత్తం 7 జట్లు) ముందంజ వేస్తాయి.
- సూపర్ 7 & సెమీస్ (ఆఖరి దశ): ఈ 'సూపర్ 7' దశలో 21 రౌండ్-రాబిన్ మ్యాచ్లు జరుగుతాయి. ఇందులో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్కు (1 వర్సెస్ 4, 2 వర్సెస్ 3) అర్హత సాధిస్తాయి.
14 జట్లకు
గత 2023 వన్డే ప్రపంచకప్లో 10 జట్ల సింగిల్ గ్రూప్ ఫార్మాట్ ఉండగా, ఈసారి 14 జట్లకు అవకాశం కల్పించడం ద్వారా అసోసియేట్ దేశాలకు (నమీబియా వంటివి) ప్రాతినిధ్యం పెరగడమే కాకుండా, ప్రసార హక్కుల పరంగా (Broadcasting Value) వ్యూయర్షిప్ను గ్లోబల్ లెవెల్లో గరిష్ట స్థాయికి తీసుకెళ్లేలా ఈ షెడ్యూల్ ప్లాన్ చేశారు.
"24 సంవత్సరాల తర్వాత క్రికెట్ పండగ ఆఫ్రికాకు రావడం ఒక చారిత్రాత్మక ఘట్టం. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలు సంయుక్తంగా అభిమానులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తాయన్న నమ్మకం ఉంది" అని ఐసీసీ చైర్మన్ జై షా ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


