IDBI Bank share price : 15శాతం క్రాష్ అయిన ఐడీబీఐ బ్యాంక్ స్టాక్! కారణం ఏంటి?
కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీ ఐడీబీఐ బ్యాంక్లోని తమ వాటాను విక్రయించే ప్రతిపాదనను రద్దు చేసినట్లు వచ్చిన వార్తలతో షేర్ ధర 15శాతం పడిపోయింది. బిడ్లు ప్రభుత్వం ఆశించిన కనీస ధర కంటే తక్కువగా రావడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ఉన్నప్పటికీ, ఐడీబీఐ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసిన వారు మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నారు! ఇందుకు కారణం ఐడీబీఐ బ్యాంక్ షేరులో కనిపిస్తున్న భారీ పతనం. ఉదయం ట్రేడింగ్ సెషన్ ఓపెన్ అవుతూనే ఈ ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్ షేర్లు ఏకంగా 15శాతం క్రాష్ అయ్యాయి.
ఈ బ్యాంక్లో మెజారిటీ వాటాను విక్రయించడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు రద్దయ్యే అవకాశం ఉందన్న నివేదికల మధ్య ఈ పతనం సంభవించింది.
ఉదయం ఓపెన్ అవుతూనే.. బీఎస్ఈలో ఐడీబీఐ బ్యాంక్ షేరు ధర 15.34% తగ్గి రూ. 78.05కి చేరుకుంది. ఇది 52 వీక్-లో స్థాయి అయిన రూ. 72.04 కి చేరువలో ఉంది. ట్రేడింగ్ వాల్యూమ్స్ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయి.
ఇక ఉదయం 10 గంటల 20 నిమిషాల ప్రాంతంలో ఈ స్టాక్ 14.95శాతం నష్టాలతో 78.40 వద్దకు చేరింది.
ఐడీబీఐ బ్యాంక్ షేరు ధర ఎందుకు పడిపోతోంది?
అనేక మీడియా నివేదికల ప్రకారం.. వచ్చిన ఆఫర్లు ఆశించిన ధర కంటే తక్కువగా ఉండటంతో, వాటా విక్రయ ప్రణాళికలను ప్రభుత్వం రద్దు చేసింది. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. భారత ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. 2022లో ఈ రుణదాతలోని 60.7% వాటాను విక్రయించే ప్రక్రియను ప్రారంభించాయి.
"వచ్చిన బిడ్లు రిజర్వ్ ప్రైస్ లేదా అమ్మకం కోసం నిర్ణయించిన కనిష్ట విక్రయ ధర కంటే తక్కువగా ఉన్నందున, ప్రస్తుత విక్రయ ప్రక్రియ రద్దు అవుతుంది," అని ఈ విషయం తెలిసిన వ్యక్తులు రాయిటర్స్తో చెప్పారు. ఈ నివేదికను హిందుస్థాన్ టైమ్స్, మింట్ స్వతంత్రంగా ధృవీకరించలేకపోయింది.
అయితే ప్రస్తుతం వీటిల్లో దేనినీ ప్రభుత్వం ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.
కెనడియన్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ ఫెయిర్ఫాక్స్ ఫైనాన్షియల్, ఎమిరేట్స్ ఎన్బీడీ నుంచి ఐడీబీఐ బ్యాంక్ వాటా ఉపసంహరణ కోసం బిడ్లు వచ్చినట్లు మునుపటి నివేదికలు సూచించాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం నాటికి, ఐడీబీఐ బ్యాంక్లో ప్రభుత్వం, ఎల్ఐసీ వరుసగా 45.48%- 49.24% వాటాలను కలిగి ఉన్నాయి. దీని ఫలితంగా మొత్తం ప్రమోటర్ వాటా 94.71% గా ఉంది.
ఐడీబీఐ బ్యాంక్ ఆదాయాలు..
ఈ బ్యాంక్ ఇటీవలి సంవత్సరాలలో లాభాల్లోకి వచ్చింది. Q3 FY26 కోసం, నికర లాభం గత ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ. 1908 కోట్లతో పోలిస్తే రూ. 1935 కోట్లకు మెరుగుపడింది. ఇదే సమయంలో, నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 24% తగ్గి, గత ఏడాది ఉన్న రూ. 4,228.2 కోట్లతో పోలిస్తే డిసెంబర్ త్రైమాసికంలో రూ. 3209.5 కోట్లుగా నమోదైంది.
ఆస్తి నాణ్యత మెరుగుపడింది. గ్రాస్ ఎన్పీఏ నిష్పత్తి FY26 మూడవ త్రైమాసికంలో 2.57% గా నమోదైంది, ఇది ఏడాది క్రితం ఉన్న 3.57% తో పోలిస్తే 100 బేసిస్ పాయింట్లు తగ్గింది. నికర ఎన్పీఏ నిష్పత్తి 0.18% వద్ద స్థిరంగా ఉంది.
ఐడీబీఐ బ్యాంక్ షేర్ ప్రైజ్ హిస్టరీ..
ఐడీబీఐ బ్యాంక్ స్టాక్ గత 5 ట్రేడింగ్ సెషన్స్లో ఏకంగా 20.2శాతం పడిపోయింది. నెలరోజుల్లో 28.7శాతం, ఆరు నెలల్లో 14.5శాతం పతనాన్ని చూసింది. ఈ స్టాక్ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 23.15 శాతం డౌన్ అయ్యింది. కానీ ఏడాది కాలంలో మాత్రం 9.3శాతం లాభాల్లో ఉంది.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించడం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


