ఐఐటీ మద్రాస్ గుడ్ న్యూస్- ఏరోనాటిక్స్​లో​ సరికొత్త డిగ్రీ.. ఇక ఆన్‌లైన్‌లోనే చదువుకోవచ్చు!

ఐఐటీ మద్రాస్ ఏరోనాటిక్స్, స్పేస్ టెక్నాలజీలో కొత్తగా ఆన్‌లైన్ బీఎస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇంటర్ లేదా డిప్లొమా పూర్తి చేసిన వారు ఈ కోర్సు ద్వారా అనేక దిగ్గజ సంస్థల్లో ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు.

Published on: Feb 10, 2026 6:00 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భవిష్యత్తు అంతా అంతరిక్షం, విమానయాన రంగాలదేనని ఐఐటీ మద్రాస్ మరోసారి నిరూపించింది. సాంకేతిక విద్యను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో, ఏరోనాటిక్స్, స్పేస్ టెక్నాలజీలో ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ బీఎస్ (బ్యాచిలర్​ ఆఫ్​ సైన్స్​) ప్రోగ్రామ్‌ను సంస్థ తాజాగా ప్రారంభించింది. నేటి యువతకు విమానయానం, అంతరిక్ష పరిశోధన రంగాల్లో ఉన్న ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ కోర్స్ ఒక చక్కని వేదిక కానుంది.

చెన్నైలోని ఐఐటీ మద్రాస్​..
చెన్నైలోని ఐఐటీ మద్రాస్​..

కోర్సును ఎవరు ప్రారంభించారు?

ఐఐటీ మద్రాస్ ప్రాంగణంలో ఇటీవలే జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి ఈ ప్రోగ్రామ్‌ను అధికారికంగా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్​ఏఎల్​) సీఎండీ డాక్టర్ డీకే సునీల్, ఇండిగో ఎయిర్‌లైన్స్ మాజీ చైర్మన్ డాక్టర్ వీ సుమంత్రన్ వంటి ప్రముఖులు వర్చువల్‌గా పాల్గొనడం విశేషం.

ఎవరెవరు అర్హులు?

ఈ కోర్సును అత్యంత సరళంగా, అందరికీ అందుబాటులో ఉండేలా రూపొందించారు.

పన్నెండో తరగతి (ఇంటర్మీడియట్) లేదా దానికి సమానమైన విద్యను పూర్తి చేసిన వారు దీనికి అర్హులు.

డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు కూడా ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

కోర్సు ప్రత్యేకతలు ఇవే..

కేవలం థియరీ మాత్రమే కాకుండా, విద్యార్థులకు క్షేత్రస్థాయి అనుభవం వచ్చేలా ఈ ఐఐటీ మద్రాస్​ బీఎస్​ ప్రోగ్రామ్ ఉంటుంది. ఏరోస్పేస్, ఆటోమోటివ్, విండ్ పవర్ వంటి రంగాల్లో పరిశోధనలు చేసేలా విద్యార్థులను తీర్చిదిద్దుతారు.

బోధన పద్ధతి: నిపుణులైన ఫ్యాకల్టీ నుంచి రికార్డ్ చేసిన వీడియో పాఠాలు అందుబాటులో ఉంటాయి.

లైవ్ సెషన్స్: సందేహాల నివృత్తి కోసం ఎప్పటికప్పుడు లైవ్ ఇంటరాక్టివ్ సెషన్స్, ఆన్‌లైన్ డిస్కషన్ ఫోరమ్‌లు ఉంటాయి.

"ఏరోనాటిక్స్, అంతరిక్ష రంగాలు ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ రంగాలకు ప్రత్యేక నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఎంతో అవసరం. ఆ అవకాశాలను సామాన్యులకు కూడా అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతోనే ఐఐటీ మద్రాస్ ఈ బీఎస్ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది," అని ప్రొఫెసర్ వీ కామకోటి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మరి ఉద్యోగ అవకాశాల పరిస్థితేంటి?

ఈ ఆన్​లైన్​ కోర్సు పూర్తి చేసిన వారికి ఐఐటీ మద్రాస్ 'సెంటర్ ఫర్ అవుట్‌రీచ్ అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్' (సీఓడీఈ) ద్వారా ప్లేస్‌మెంట్, ఇంటర్న్‌షిప్ సహాయం అందుతుంది. దీనివల్ల విద్యార్థులు కేవలం చదువుకోవడమే కాకుండా, కెరీర్‌లో స్థిరపడటానికి అవసరమైన తోడ్పాటును కూడా పొందుతారు.

ముఖ్యంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్​ఏఎల్​), భారత్ డైనమిక్స్, మిశ్ర ధాతు నిగమ్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు.. బోయింగ్, ఎయిర్ బస్, జీఈ ఏరోస్పేస్, రోల్స్ రాయిస్ వంటి అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉంటుంది. అలాగే ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి గేట్ పరీక్షకు సిద్ధమవడానికి, ఐఐటీలు, ఐఐఎస్సీలో ప్రవేశాలకు ఇది బలమైన పునాదిగా మారుతుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More