Vaibhav Sooryavanshi : వైభవ్​ సూర్యవంశీ ఊచకోత- 29 బంతుల్లోనే 94.. జస్ట్​లో సెంచరీ మిస్!

India A vs Sri lanka A live : 15ఏళ్ల వైభవ్​ సూర్యవంశీ మరోసారి విజృంభించాడు. శ్రీలంక ఏతో జరుగుతున్న ట్రై నేషన్​ ఏ సిరీస్ ఫైనల్​ మ్యాచ్​లో ఆకాశమే హద్దుగా చెలరేగి.. 29 బంతుల్లోనే 94 రన్స్ చేశాడు. ఇందులో 88 రన్స్​ బౌండరీ రూపంలో రావడం విశేషం!

Published on: Jun 21, 2026, 10:51:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

యంగ్ గన్ వైభవ్​ సూర్యవంశీ మరోసారి సంచలనం సృష్టించాడు! శ్రీలంక ఏ టీమ్​తో ఇండియా ఏ జట్టు ఆడుతున్న ట్రై నేషన్ ఏ సిరీస్ ఫైనల్​ మ్యాచ్​లో కేవలం 29 బంతుల్లోనే 94 చేశాడు.

వైభవ్​ సూర్యవంశీ హిట్టింగ్.. (SLC)
వైభవ్​ సూర్యవంశీ హిట్టింగ్.. (SLC)

డంబుల్లా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో టాస్ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న శ్రీలంక ఏ జట్టు బౌలర్లకు సూర్యవంశీ మొదటి నుంచి చుక్కలు చూపిస్తూనే ఉన్నాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిన అతను కేవలం 11 బంతుల్లోనే హాఫ్​ సెంచరీ కొట్టేశాడు. ఆ తర్వాత కూడా సూర్యవంశీ జోరు కొనసాగింది. 94 రన్స్​లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉండటం విశేషం. అంటే బౌండరీ రూపంలోనే అతను 88 పరుగులు సాధించినట్టు!

కానీ.. శ్రీలంక ఏ బౌలర సహన్ అరచ్చిగే బౌలింగ్​లో ఔట్​ అయ్యి, తృటిలో సెంచరీ మిస్​ చేసుకుని నిరాశతో వెనుదిరిగాడు.

వైభవ్​ సూర్యవంశీ ఊచకోత కారణంగా భారత్​ ఏ స్కోరు 9 ఓవర్లకే 130 దాటేసింది. మరో ఓపెనర్​ ప్రియాన్ష్ ఆర్య 35 రన్స్​తో క్రీజులో ఉన్నాడు.

సూర్యవంశీపై కెప్టెన్ కామెంట్స్..

క్రికెట్ మైదానంలో దూకుడు సహజమే అయినా, ఒక్కోసారి అది శృతిమించి వివాదాలకు దారితీస్తుంది. భారత్ ఏ, శ్రీలంక ఏ జట్ల మధ్య ఇటీవలే జరిగిన రౌండ్-రాబిన్ మ్యాచ్‌లో సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్‌ సూపర్ ఓవర్​లో భారత్ ఓడిపోయింది. అయితే, మ్యాచ్ సమయంలో భారత యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. శ్రీలంక ఆటగాడు విషెన్ హలంబాగేతో తీవ్రమైన ఆన్‌ఫీల్డ్ గొడవ దిగాడు. ఈ నేపథ్యంలో సూర్యవంశీ ప్రవర్తన, దూకుడుపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అయితే, శ్రీలంకతో జరగుతున్న ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ తిలక్ వర్మ ఈ వివాదంపై స్పందించాడు. యువ ఆటగాడికి పూర్తి మద్దతు ప్రకటించాడు.

సూర్యవంశీ తన శైలిని మార్చుకోవాల్సిన అవసరం లేదని, మైదానంలో పూర్తి స్వేచ్ఛతో ఆడాలని తిలక్ వర్మ సూచించాడు. అతడిపై వస్తున్న విమర్శలను కొట్టిపారేస్తూ కెప్టెన్ తిలక్ వర్మ మాట్లాడాడు.

“వైభవ్‌ను తన సహజసిద్ధమైన ఆట ఆడమని, ఒత్తిడి తీసుకోకుండా ఆటను ఆస్వాదించమని నేను చెప్పాను. ఈ వయసులో కొత్త విషయాలు నేర్చుకుంటూ, తన ప్రతిభను ప్రపంచానికి చూపించడమే అతడు చేయాల్సిన పని. ఇప్పటివరకు అతడు సాధించిన విజయాలన్నీ కూడా సానుకూల దృక్పథంతో, దూకుడుగా ఆడటం వల్లే వచ్చాయి. కాబట్టి తన ఆట తీరును మార్చుకోవాల్సిన అవసరం అస్సలు లేదు,” అని తిలక్ వర్మ స్పష్టం చేశాడు.

“ఒక కెప్టెన్‌గా నేను అతడికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని భరోసా ఇచ్చాను. కొత్త విషయాలు నేర్చుకుంటూ, నీ బలాన్ని నువ్వు నమ్ముకో అని చెప్పాను. జట్టు మొత్తం అతడికి అండగా ఉంది. ఫైనల్లో అతడు భారీ ఇన్నింగ్స్ ఆడతాడని ఆశిస్తున్నాము. ఒక్కసారి సూర్యవంశీ క్రీజులో సెట్ అయితే.. అతడు ఎంతటి విధ్వంసం సృష్టించగలడో మనందరికీ తెలుసు. ఫైనల్లోనూ అతడు అదే జోరు చూపిస్తాడని భావిస్తున్నాను,” అని తిలక్ వర్మ జోడించారు.

కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న 15ఏళ్ల వైభవ్​ సూర్యవంశీ.. కీలక మ్యాచ్​లో అదరగొట్టాడు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More