Ind vs Zim: సెమీస్ ఆశలు సజీవం.. జింబాబ్వేను చిత్తుగా ఓడించిన టీమిండియా.. చెలరేగిన హార్దిక్, తిలక్, అర్ష్దీప్
టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ ఆశలను టీమిండియా సజీవంగా ఉంచుకుంది. జింబాబ్వేతో (Ind vs Zim) జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో 72 పరుగులతో గెలిచిన ఇండియన్ టీమ్.. చివరి మ్యాచ్ లో వెస్టిండీస్ పై గెలిస్తే సెమీఫైనల్లో అడుగుపెడుతుంది.
టీ20 వరల్డ్ కప్ లో చెన్నైలోని చెపాక్ స్టేడియం సాక్షిగా టీమ్ ఇండియా బ్యాటర్లు పరుగుల వరద పారించారు. సౌతాఫ్రికాతో జరిగిన మొదటి సూపర్-8 మ్యాచ్లో ఎదురైన పరాజయం నుంచి కోలుకున్న భారత్.. జింబాబ్వేపై సర్వశక్తులూ ఒడ్డి భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇది టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే భారత్కు అత్యధిక స్కోరు కావడం విశేషం. 72 పరుగులతో తేడాతో గెలిచి సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
భారత బ్యాటర్ల విధ్వంసం
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్ అభిషేక్ శర్మ (55) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. గత కొన్ని మ్యాచ్లుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న అభిషేక్.. ఈ మ్యాచ్లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతనికి తోడుగా ఇషాన్ కిషన్ (38), సూర్యకుమార్ యాదవ్ (33) వేగంగా పరుగులు సాధించారు.
ఇక ఆఖర్లో హార్దిక్ పాండ్యా (50 నాటౌట్ 23 బంతుల్లోనే..), తిలక్ వర్మ (44 నాటౌట్) ఆఖరి 5 ఓవర్లలో 80 పరుగులు జోడించి స్కోరును 250 దాటించారు. 20 ఓవర్లలో ఇండియన్ టీమ్ 4 వికెట్లకు 256 రన్స్ చేసింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోరు.
పోరాడి ఓడిన జింబాబ్వే
257 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేను భారత బౌలర్లు ఆది నుంచే కట్టడి చేశారు. అయితే జింబాబ్వే బ్యాటర్ బ్రియాన్ బెన్నెట్ (59 బంతుల్లో 97 నాటౌట్) అద్భుత పోరాటంతో భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. సెంచరీకి కేవలం మూడు పరుగుల దూరంలో నిలిచిపోయిన బెన్నెట్.. జింబాబ్వేను గెలిపించలేకపోయినా తన పోరాటంతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. చివరకు జింబాబ్వే 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. ఈ ఓటమితో టీ20 వరల్డ్ కప్ సెమీస్ రేసు నుంచి జింబాబ్వే తప్పుకుంది.
రికార్డు సృష్టించిన అర్ష్దీప్
భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 24 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరపున అత్యధిక వికెట్లు (35) తీసిన బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా (33) రికార్డును అర్ష్దీప్ అధిగమించాడు. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి కూడా కీలక వికెట్లు తీసి విజయంలో పాలుపంచుకున్నారు.
ఈ విజయంతో భారత్ సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. తర్వాతి మ్యాచ్లో వెస్టిండీస్తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఆదివారం (మార్చి 1) జరగనుంది. ఆ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వాళ్లు సెమీస్ చేరతారు. ఇప్పటికే సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీస్ బెర్తులను ఖాయం చేసుకున్నాయి.

E-Paper












