...
...
Next Story

BS VII emission norms: 2030 నుంచి బీఎస్-7 కాలుష్య నిబంధనలు: పెరగనున్న వాహనాల ధరలు

BS VII emission norms: దేశంలో వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. 2030 నాటికి సరికొత్త 'భారత్ స్టేజ్-7' (BS VII) నిబంధనలను అమలు చేయాలని యోచిస్తోంది. దీనివల్ల వాహనాల తయారీ వ్యయం పెరిగి, కార్లు, బైక్‌ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.

Published on: Jun 10, 2026, 14:08:07 IST
Advertisement

న్యూఢిల్లీ: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న వాహన కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక నిర్ణయానికి సిద్ధమైంది. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా సరికొత్త ‘భారత్ స్టేజ్-7’ (BS VII) కాలుష్య నియంత్రణ నిబంధనలను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసి, 2030 నాటికి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) భావిస్తోంది.

BS VII emission norms: 2030 నుంచి బీఎస్-7 కాలుష్య నిబంధనలు: పెరగనున్న వాహనాల ధరలు
BS VII emission norms: 2030 నుంచి బీఎస్-7 కాలుష్య నిబంధనలు: పెరగనున్న వాహనాల ధరలు

గతంలో 2020లో కేంద్రం బీఎస్-6 నిబంధనలను తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అంతకంటే కఠినమైన ఉద్గార పరిమితులు, రియల్ టైమ్ ఎమిషన్ మానిటరింగ్, అధునాతన డయాగ్నోస్టిక్స్ సిస్టమ్స్‌తో బీఎస్-7ను తీసుకురానున్నారు.

వాహనాల ధరలు ఎంత పెరగొచ్చు?

ఈ కొత్త నిబంధనల వల్ల వాహన తయారీ సంస్థలు తమ ఇంజన్ టెక్నాలజీ, ఎమిషన్ కంట్రోల్ సిస్టమ్స్‌ను భారీగా అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా వాహనాల తయారీ వ్యయం ఒక్కో వాహనానికి 30,000 నుంచి 1,00,000 వరకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ అదనపు భారం చివరికి వినియోగదారులపైనే పడనుంది. ధరలు విపరీతంగా పెరిగితే, కొన్ని పాత మోడళ్లను కంపెనీలు పూర్తిగా నిలిపివేసే అవకాశం కూడా ఉంది.

గ్లోబల్ స్టాండర్డ్స్ వైపు భారత్ అడుగులు

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా ఉన్న భారత్‌లో గత ఆర్థిక సంవత్సరంలో (FY26) దాదాపు 2.83 కోట్లకు పైగా కొత్త వాహనాలు అమ్ముడయ్యాయి. దిల్లీ, ముంబై లాంటి నగరాల్లో వాయు కాలుష్యం తీవ్రమవుతున్న తరుణంలో ఈ నిర్ణయం అత్యంత కీలకంగా మారింది. ఐరోపా సమాఖ్య (EU) 2026 నవంబర్ నుంచి అమలు చేయనున్న 'యూరో 7' (Euro 7) ప్రమాణాల ఆధారంగానే భారత రోడ్డు పరిస్థితులకు, ఇంధన నాణ్యతకు తగినట్లుగా బీఎస్-7 నిబంధనలను రూపొందిస్తున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం గతంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే భారత ఆటోమొబైల్ నిబంధనలు ఉంటాయని స్పష్టం చేశారు.

పరిశ్రమ వర్గాల డిమాండ్

"గతంలో తెచ్చిన బీఎస్-6 నిబంధనలు కాలుష్యాన్ని తగ్గించడంలో మంచి ఫలితాలను ఇచ్చాయి. ఇప్పుడు రాబోయే బీఎస్-7 వాహనాల జీవితకాలం మొత్తంలో నిజ సమయ కాలుష్య ఉద్గారాలను (Real-world emissions) పర్యవేక్షించనుంది. పెరిగిపోతున్న వాహనాల రద్దీ దృష్ట్యా ఇది చాలా అవసరం" అని గ్రాంట్ థోర్న్టన్ భారత్ భాగస్వామి సాకేత్ మెహ్రా విశ్లేషించారు.

ఇంధన విషయానికి వస్తే, గతంలో బీఎస్-4 నుంచి బీఎస్-6 మారినప్పుడు చమురు శుద్ధి కర్మాగారాలను (Refineries) భారీగా అప్‌గ్రేడ్ చేయాల్సి వచ్చింది. కానీ, ఈసారి ఇంధన మౌలిక వసతుల్లో పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం ఉండదని నిపుణులు చెప్తున్నారు. భారత్ ఇప్పటికే విజయవంతంగా ఈ20 (E20) పెట్రోల్ ఇంధనాన్ని వినియోగిస్తోంది. ఈ కొత్త నిబంధనల వల్ల వినియోగదారులు హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ వాహనాల (EV) వైపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో కూడా బ్రేక్ ప్యాడ్స్, టైర్ల అరుగుదల వల్ల వచ్చే మైక్రోపార్టికల్స్ కాలుష్యాన్ని తగ్గించేలా, బ్యాటరీల లైఫ్ పెంచేలా ఈ నిబంధనలు ఉండనున్నాయి.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe