బ్యాటింగ్ లో అదుర్స్.. ఇక బౌలర్లపైనే భారం.. ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా భారీ స్కోరు.. మెరిసిన షెఫాలి, దీప్తి
ప్రపంచకప్ కలను నిజం చేసుకోవాలనే కల దిశగా ఆఖరి పోరాటంలో సగం విజయవంతమైంది టీమిండియా. ఇవాళ సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్లో భారత మహిళల జట్టు ఫస్ట్ బ్యాటింగ్ లో భారీ స్కోరు సాధించింది.
మహిళల వన్డే ప్రపంచకప్ లో టీమిండియా జోరు కొనసాగించింది. తొలిసారి విశ్వ విజేతగా నిలిచేందుకు అడుగు దూరంలో ఉన్న భారత మహిళల జట్టు బ్యాటింగ్ లో అద్భుత ప్రదర్శన చేసింది. ఆదివారం (నవంబర్ 2) నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్లో బ్యాటింగ్ లో అదరగొట్టింది ఇండియా. 50 ఓవర్లో 7 వికెట్లకు 298 పరుగులు చేసింది భారత్. షెఫాలి వర్మ (78 బంతుల్లో 87; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), దీప్తి శర్మ (58 బంతుల్లో 58; 3 ఫోర్లు, ఓ సిక్సర్) రాణించారు.

వర్షంతో ఆలస్యం
భారత క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్న ప్రపంచకప్ ఫైనల్ ను వరుణుడు కాస్త ఆలస్యం చేశాడు. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్ కు దిగింది. ఈ టోర్నీలో అసలు తుది జట్టులో ఉంటుందో లేదో అనుకున్న షెఫాలి కీలక ఫైనల్లో అదరగొట్టింది.
అదిరే ఓపెనింగ్
సూపర్ ఫామ్ లో ఉన్న స్మృతి మంధాన (45), షెఫాలి కలిసి ఇన్నింగ్స్ ఆరంభించారు. ప్రతీక గాయం కారణంగా సెమీస్ లో టీమ్ లోకి వచ్చిన షెఫాలి ఫైనల్లో సత్తాచాటింది. మంధాన, షెఫాలి కలిసి ఇండియాకు అదిరే ఆరంభాన్నిచ్చారు. ఫస్ట్ వికెట్ కు 104 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఆ వెంటనే మంధాన ఔటైపోయింది.
జెమీమా ఇలా
సెమీస్ లో ఆస్ట్రేలియా సంచలన సెంచరీతో టీమ్ ను ఫైనల్ కు చేర్చిన జెమీమా రోడ్రిగ్స్ ఈ పోరులో నిలబడలేకపోయింది. 24 పరుగులే చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ 20 పరుగులకే పెవిలియన్ చేరిపోయింది. అంతకంటే ముందే సెంచరీ చేస్తుందనిపించిన షెఫాలి ఔటైపోయింది. అమన్ జోత్ (12) ఫెయిల్ అయింది.
దీప్తి పోరాటం
మిడిలార్డర్ లో కాస్త కుదుపునకు గురైన టీమిండియా భారీ స్కోరు చేసిందంటే అందుకు కారణం దీప్తి శర్మ. జట్టుకు భారీ స్కోరు అందించేలా ఆమె అద్భుతంగా పోరాడింది. ఆ ఆల్ రౌండర్ చక్కని బ్యాటింగ్ లో అలరించింది. రిచా ఘోష్ (24 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సపోర్ట్ తో టీమ్ ను నడిపించింది దీప్తి.
ఆఖర్లో మెరుపులు
టీమిండియా బ్యాటింగ్ ఆఖర్లో రెచ్చిపోయింది. అందుకు కారణం రిచా ఘోష్. ఈ పవర్ హిట్టర్ భారీ షాట్లు ఆడింది. దీప్తి కూడా బౌండరీలు రాబట్టింది. దీంతో ఇండియా స్కోరు 300కు చేరువైంది. సౌతాఫ్రికా బౌలర్లలో అయబొంగా ఖాకా 3 వికెట్లు తీసింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


