గాయపడిన ఆటగాళ్లతో మినీ క్రికెట్ టీమే తయారు చేయొచ్చు! టీమిండియాను వేధిస్తున్నఫిట్‌నెస్ సంక్షోభం..

Indian cricket injury crisis : టీమిండియా ఆటగాళ్లను గాయాలు వేధిస్తున్నాయి. సీనియర్ల నుంచి జూనియర్ల వరకు చాలా మంది ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. వీరితో ఏకంగా ఒక జట్టే తయారు చేయవచ్చు! ఈ నేపథ్యంలో బీసీసీఐ చర్యలు చేపడుతోంది.

Published on: Aug 9, 2026, 09:10:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వరుస గాయాలతో టీమిండియా వణుకుతోంది! ఏకంగా ఒక ప్లేయింగ్ ఎలెవెన్ జట్టు సరిపడా ఆటగాళ్లు ఇప్పుడు ఫిట్‌నెస్ సమస్యలతో దూరమవ్వడంతో బీసీసీఐ అలర్ట్ అయింది.

స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా
స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా

"గాయాల సమస్య ఇప్పుడు ఏకంగా జట్టు కూర్పునే దెబ్బతీస్తోంది" అని బోర్డు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రధాన ఆటగాళ్లందరూ ఒక్కసారిగా గాయాల బారిన పడ్డారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ హయాంలో ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన టీమిండియాలో ఇప్పుడు ఆటగాళ్ల గాయాల వార్త అందరిని ఆశ్చర్యపరుస్తోంది . ఈ సంక్షోభంపై చర్చించేందుకు బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా నేరుగా రంగంలోకి దిగారు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో (సీఓఈ) రిహాబిలిటేషన్ మేనేజ్‌మెంట్‌పై హెడ్ ఆఫ్ క్రికెట్ వీవీఎస్ లక్ష్మణ్‌తో ఆయన అత్యవసరంగా భేటీ కానున్నారు.

మరోవైపు ఆటగాళ్ల రికవరీ సమయాలపై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు, సెలక్షన్ కమిటీకి మధ్య సరైన సమన్వయం కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎలాంటి పూర్తి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు రాకుండానే కొందరు ఆటగాళ్లను ముందస్తుగా విడుదల చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

గాయాలే.. గాయాలు..

పీటీఐ నివేదిక ప్రకారం.. మోకాలి వాపుతో బాధపడుతున్న జస్ప్రీత్ బుమ్రా, ఎడమ కాలి వేలి గాయంతో సాయి సుదర్శన్ జట్టుకు దూరమయ్యారు. అలాగే హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ హ్యామ్‌స్ట్రింగ్, క్వాడ్రిసెప్స్ సమస్యలతో సతమతమవుతున్నారు. బెంగాల్ రంజీ ట్రోఫీ ఆడినప్పటి నుంచి ఆకాశ్ దీప్ లోయర్ బ్యాక్ స్ట్రెస్ ఫ్రాక్చర్‌తో చాలా కాలంగా ఆటకు దూరంగా ఉంటున్నారు.

వైట్ బాల్ స్పెషలిస్టులు హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్ కూడా ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోనే చికిత్స తీసుకుంటున్నారు.

బుమ్రా, సాయి సుదర్శన్‌లను ఫిట్‌నెస్‌కు లోబడి జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ, భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సీఓఈ నిపుణులు తొందరపడకూడదని నిర్ణయించారు.

"సీఓఈ పరిస్థితిని సమీక్షించేందుకు కార్యదర్శి సైకియా బెంగళూరు వస్తున్నారు. లక్ష్మణ్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతారు," అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ లేదా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈ భేటీకి ఆన్‌లైన్‌లో హాజరవుతారా లేదా అనే దానిపై స్పష్టత లేదు.

తప్పు ఎక్కడ జరుగుతోంది?

హర్షిత్ రాణా తగిన బరువు కంటే ఎక్కువగా ఉండటంపై సెలక్షన్ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బుమ్రా, సాయి సుదర్శన్‌లు కనీసం ఒక టెస్ట్ మ్యాచ్‌డైనా ఆడతారని సెలెక్టర్లు భావించారు. కానీ వాస్తవ పరిస్థితి వేరుగా ఉంది.

గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా మోకాళ్లలో వాపు (వాటర్ రిటెన్షన్) సమస్య తలెత్తినట్లు తేలింది. దీని నుంచి కోలుకోవడానికి మరింత సమయం పట్టనుంది. ఇక సాయి సుదర్శన్ విషయానికి వస్తే, నెట్​లో గంటకు పైగా బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ కాలి వేలి నొప్పి ఇంకా తగ్గలేదు. మరోవైపు నితీశ్ రెడ్డి తన బౌలింగ్ వేగాన్ని గంటకు 7 నుంచి 8 కి.మీ పెంచే ప్రయత్నంలో తన కండరాలపై అదనపు భారం వేసుకుని గాయపడ్డాడు!

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More