ఒక్క జూమ్​ కాల్​లో 900 మంది ఉద్యోగులను లేఆఫ్ చేసిన సీఈఓ జాబ్ కట్!

జూమ్ కాల్‌లో 900 మంది ఉద్యోగులను తొలగించి వార్తల్లో నిలిచిన బెటర్.కామ్ వ్యవస్థాపకుడు విశాల్ గార్గ్ తన ఉద్యోగాన్ని కోల్పోయారు. కానీ ఆయన తన సీఈఓ పదవి కోసం పట్టుబడుతున్నారు. బోర్డు తనను అన్యాయంగా తొలగించిందని ఆయన ఆరోపిస్తున్నారు.

Published on: Aug 16, 2026, 09:59:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఒకే ఒక్క జూమ్ కాల్ ద్వారా ఏకంగా 900 మందికి పైగా ఉద్యోగులను తొలగించి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇండియన్-అమెరికన్ పారిశ్రామికవేత్త విశాల్ గార్గ్.. తన ఉద్యోగాన్ని కోల్పోయారు! 'బెటర్ హోమ్ అండ్ ఫైనాన్స్' సంస్థ.. గార్గ్​ని సీఈఓ పదవి నుంచి తప్పించింది. అయితే, ఆయన ఇప్పుడు తన ఉద్యోగం కోసం పట్టుబడుతున్నారు.

Vishal Garg challenged his removal as Better CEO. (Instagram/betterdotcom)
Vishal Garg challenged his removal as Better CEO. (Instagram/betterdotcom)

తన స్థానంలో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన డేనియల్ లూయిస్ తనను మోసం చేశారని గార్గ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

"అతను నన్ను నమ్మించి మోసం చేశాడు. కంపెనీ వ్యూహాలు చాలా బాగుందని ప్రశంసిస్తూ అందరిని మంచి చేసుకున్నాడు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మమ్మల్ని పొగిడి, బోర్డులోకి వచ్చి మా విశ్వాసాన్ని పొందాడు," అని సీఎన్‌ఎన్‌తో మాట్లాడిన సందర్భంగా విశాల్ గార్గ్ పేర్కొన్నారు.

జులై 27న బోర్డులో చేరిన డేనియల్ లూయిస్‌ను.. కేవలం వారంలోనే, అంటే ఆగస్టు 3న బెటర్ సంస్థ తాత్కాలిక సీఈఓగా నియమించింది. మొదట ఈ మార్పు పరస్పర అంగీకారంతో జరిగిందని కంపెనీ ప్రకటించినప్పటికీ, తర్వాత బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా గార్గ్‌ను తొలగించినట్లు స్పష్టం చేశారు. ఆయన ప్రవర్తన, నిర్ణయాలు, విశ్వసనీయతపై ఆందోళనలు ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది.

కోలుకుంటున్న సమయంలోనే దెబ్బ తగిలింది: గార్గ్

సంవత్సరాలుగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బెటర్ కంపెనీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, సరిగ్గా ఈ తరుణంలోనే తనను తొలగించారని గార్గ్ ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్ కాలంలో రీఫైనాన్సింగ్ బూమ్ సమయంలో 8 బిలియన్ డాలర్ల విలువైన ఈ సంస్థ, వడ్డీ రేట్లు పెరగడంతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీనివల్ల మెయిన్ రీఫైనాన్సింగ్ వ్యాపారం కుప్పకూలింది.

"2021లో 1.5 బిలియన్ డాలర్లుగా ఉన్న వార్షిక విక్రయాలు 2023 నాటికి 70 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. అయితే ఈ ఏడాది మా సంస్థ సుమారు 200 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించే మార్గంలో ఉంది," అని గార్గ్ చెప్పారు. ఏఐ ఆధారిత మోర్గేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఇతర భాగస్వామ్యాల వల్లే వ్యాపారం మళ్లీ పుంజుకుందని ఆయన వివరించారు.

విశాల్ గార్గ్ బెటర్.కామ్ వ్యవస్థాపకుడిగా ఉండటమే కాకుండా, మరో సంస్థకు కూడా ఫౌండింగ్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తున్నారు.

"మేము విజయం సాధిస్తున్నాం. లోన్ వాల్యూమ్ మూడు రెట్లు పెరిగింది. లాభాల బాట పట్టేందుకు చాలా దగ్గరగా ఉన్నాం," అని గార్గ్ ధీమా వ్యక్తం చేశారు.

"ఇది నా ఒక్కడి గురించి కాదు"

కంపెనీ బోర్డులో చేరడానికి ముందు నెలల తరబడి ఖర్చుల తగ్గింపు, లాభాల సాధనపై లూయిస్ తనకు సలహాలు ఇచ్చారని గార్గ్ తెలిపారు. అయితే లూయిస్ మనసులో వేరే ఆలోచనలు ఉన్నాయని ఇప్పుడు గ్రహించినట్లు చెప్పారు. "అతను మొదటి నుంచీ సీఈఓ కావాలని భావించాడని అనుమానిస్తున్నాను. బోర్డు పెద్ద తప్పు చేసింది," అని గార్గ్ అభిప్రాయపడ్డారు.

అయినా తన గురించి తాను ఆలోచించడం లేదని, ప్రజలకు మేలు చేయడం, అమెరికన్ డ్రీమ్‌ను సాకారం చేయడంలోనే తన దృష్టి ఉందని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం బోర్డులో కొనసాగుతున్న గార్గ్, తనను మళ్లీ సీఈఓగా నియమించాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది అలెక్స్ స్పిరోను ఆశ్రయించారు. బెటర్ కంపెనీ లాభాల్లోకి వచ్చే వరకు కేవలం ఏడాదికి ఒక్క డాలర్ జీతంతో పని చేయడానికి కూడా సిద్ధమని ఆయన బోర్డుకు ఆఫర్ చేశారు. గత పదేళ్లుగా తాను సంస్థ కోసం కష్టపడ్డానని, భవిష్యత్తులో బెటర్ సంస్థకు మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నట్లు గార్గ్ పేర్కొన్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More