...
...
Next Story

కెనడా ఆసుపత్రిలో 8 గంటల నరకయాతన.. ఎమర్జెన్సీ వార్డులో భారత సంతతి వ్యక్తి మృతి

తీవ్రమైన గుండెనొప్పితో ఆస్పత్రికి వెళ్లిన భారత సంతతి వ్యక్తి ప్రశాంత్ శ్రీకుమార్, కెనడాలోని ఎడ్మంటన్ ఆస్పత్రిలో 8 గంటల పాటు నిరీక్షించి ప్రాణాలు కోల్పోయారు. వైద్యుల నిర్లక్ష్యం, వ్యవస్థ వైఫల్యంపై బాధితుడి కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Published on: Dec 25, 2025, 16:22:53 IST
Advertisement

కెనడాలోని వైద్య వ్యవస్థలో ఉన్న లోపాలు మరో నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. తీవ్రమైన గుండెనొప్పితో విలవిలలాడుతూ ఆస్పత్రికి వెళ్లిన ఒక భారత సంతతి వ్యక్తిని వైద్యులు పట్టించుకోకపోవడంతో, ఎనిమిది గంటల పాటు ఎమర్జెన్సీ వార్డులో నరకయాతన అనుభవించి ఆయన ప్రాణాలు విడిచారు. ఈ విషాద ఘటన ఎడ్మంటన్‌లోని 'గ్రే నన్స్ కమ్యూనిటీ హాస్పిటల్'లో చోటుచేసుకుంది.

8 గంటల పాటు మృత్యువుతో పోరాటం

కెనడా ఆసుపత్రిలో 8 గంటల నరకయాతన.. ఎమర్జెన్సీ వార్డులో భారత సంతతి వ్యక్తి మృతి (X/@yegwave)
కెనడా ఆసుపత్రిలో 8 గంటల నరకయాతన.. ఎమర్జెన్సీ వార్డులో భారత సంతతి వ్యక్తి మృతి (X/@yegwave)

మృతుడిని 44 ఏళ్ల ప్రశాంత్ శ్రీకుమార్‌గా గుర్తించారు. వృత్తిరీత్యా అకౌంటెంట్ అయిన ప్రశాంత్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత సోమవారం ఆఫీసులో ఉన్న సమయంలో ఆయనకు అకస్మాత్తుగా గుండెలో తీవ్రమైన నొప్పి రావడంతో, ఒక క్లయింట్ ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రికి వెళ్లిన వెంటనే అక్కడ ప్రాథమిక పరీక్షలు చేసి, ఎమర్జెన్సీ వార్డులో వేచి ఉండమని సిబ్బంది చెప్పారు.

అయితే గంటలు గడుస్తున్నా వైద్యులు ఆయన్ని పట్టించుకోలేదు. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ప్రశాంత్‌కు కేవలం 'టైలెనాల్' (Tylenol) మాత్ర ఇచ్చి సరిపెట్టారని ఆయన భార్య ఆవేదన వ్యక్తం చేశారు. వేచి ఉన్న సమయంలోనే ఆయన రక్తపోటు (బిపి) 210కి చేరినప్పటికీ, సిబ్బంది నుంచి ఎలాంటి స్పందన లేదని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఆమె రోదిస్తూ చెప్పారు.

'నాన్నా.. నొప్పి భరించలేకపోతున్నాను'

ప్రశాంత్ తన తండ్రి కుమార్ శ్రీకుమార్‌తో మాట్లాడిన చివరి మాటలు గుండెల్ని పిండేస్తున్నాయి. "నాన్నా, నేను ఈ నొప్పిని అస్సలు భరించలేకపోతున్నాను" అని తన కొడుకు పదేపదే ఫోన్ లో రోదించాడని కుమార్ వివరించారు. ఈ లోపు ఈసీజీ తీసిన సిబ్బంది.. "ఏమీ పర్వాలేదు, ప్రమాదకరమైనది ఏమీ లేదు.. కొంచెం సేపు ఆగండి" అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.

ప్రశాంత్ మృతితో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 3, 10, 14 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలు తండ్రి లేని వారయ్యారు. "తీవ్రమైన గుండెనొప్పితో వచ్చిన పేషెంట్‌ను వైద్యుడి వద్దకు తీసుకెళ్లకుండా ఎనిమిది గంటల పాటు ఎలా కూర్చోబెడతారు?" అని కుటుంబ స్నేహితుడు వరీందర్ భుల్లర్ ప్రశ్నించారు. ఇది ఘోరమైన వైఫల్యమని, వైద్య వ్యవస్థపై నమ్మకం పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై ఆస్పత్రి యాజమాన్య సంస్థ 'కోవనెంట్ హెల్త్' స్పందిస్తూ.. గోప్యత కారణాల దృష్ట్యా బాధితుడి కేసు గురించి పూర్తి వివరాలు వెల్లడించలేమని పేర్కొంది. అయితే, ఈ కేసును 'చీఫ్ మెడికల్ ఎగ్జామినర్' కార్యాలయానికి అప్పగించామని, బాధిత కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపింది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe