అమెరికాలో కోటి రూపాయల జీతం.. కానీ మనశ్శాంతి సున్నా! ఐటీ ఉద్యోగిని తన్వీ పిసల్ ఆవేదన
పూణేలో రూ. 3.5 లక్షల జీతంతో కెరీర్ ప్రారంభించి, నేడు అమెరికాలో కోటి రూపాయలకు పైగా ప్యాకేజీ అందుకుంటున్న తన్వీ పిసల్ ప్రయాణం పూల బాట ఏమీ కాదు. వరుస లేఆఫ్స్, వీసా కష్టాలు, ఒంటరితనంతో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు అమెరికా కల వెనుక ఉన్న చేదు నిజాలను కళ్లకు కడుతున్నాయి.
ఒకప్పుడు 'అమెరికా కల' అంటే విలాసవంతమైన జీవితం, డాలర్ల వర్షం. కానీ నేడు పరిస్థితి తలకిందులైంది. లక్షల్లో జీతాలు ఉన్నా.. రేపు ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియని సందిగ్ధంలో వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు కాలం వెళ్లదీస్తున్నారు. పూణేకు చెందిన 29 ఏళ్ల తన్వీ పిసల్ కథ ఇందుకు ఒక నిదర్శనం. ప్రస్తుతం సిలికాన్ వ్యాలీలోని యాపిల్ (Apple) కార్యాలయంలో యూఎక్స్ (UX) డిజైనర్గా పనిచేస్తూ ఏడాదికి రూ. 1.10 కోట్లకు పైగా ($130,000) సంపాదిస్తున్నా.. ఆమె మాటల్లో సంతోషం కంటే భయాందోళనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

పూణే నుండి సిలికాన్ వ్యాలీ వరకు..
తన్వీ తన కెరీర్ను పూణేలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ప్రారంభించారు. అప్పట్లో ఆమె వార్షిక ఆదాయం కేవలం రూ. 3.5 లక్షలు. అయితే సృజనాత్మకతపై ఉన్న ఆసక్తితో ఆమె తన రంగాన్ని డిజైనింగ్లోకి మార్చుకున్నారు. 2021లో కరోనా కష్టాల మధ్య అమెరికాలో మాస్టర్స్ చేయడానికి వెళ్లిన ఆమెకు అక్కడ అడుగుపెట్టగానే చేదు అనుభవాలు ఎదురయ్యాయి. క్యాంపస్లో చిన్న చిన్న పార్ట్ టైమ్ ఉద్యోగాలు దొరకడమే గగనమైపోయింది. ఎట్టకేలకు చదువు పూర్తి చేసి మే 2023లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నెలకు సుమారు రూ. 5 లక్షల ($70,000) జీతంతో ఉద్యోగంలో చేరారు.
12 రోజుల్లోనే ఉద్యోగం ఊడింది
అమెరికా జాబ్ మార్కెట్ ఎంత దారుణంగా ఉందో తన్వీ ఎదుర్కొన్న అనుభవాలు వింటే అర్థమవుతుంది. 2025 అక్టోబర్లో ఆమె మొదటిసారి లేఆఫ్ (Layoff)కు గురయ్యారు. ఆ తర్వాత 10 రౌండ్ల ఇంటర్వ్యూలు దాటుకుని న్యూయార్క్లోని ఒక స్టార్టప్లో చేరారు. కేవలం రెండు వారాల్లోనే కాలిఫోర్నియా నుంచి న్యూయార్క్కు మకాం మార్చారు. కానీ అక్కడ చేరిన కేవలం 12 రోజుల్లోనే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. కారణం ఏంటో తెలుసా? ఆమె రాత్రి 9 గంటల తర్వాత ఆఫీసులో ఉండటం లేదట. ఆ కంపెనీ వర్క్ కల్చర్ తన పద్ధతికి సరిపోలేదని సాకు చెప్పి ఆమెను రోడ్డున పడేశారు.
తెల్లవారుజామున 4 గంటల నుంచే వేట
చేతిలో వీసా గడువు కేవలం 60 రోజులు మాత్రమే ఉంది. అప్పటిలోగా ఉద్యోగం దొరక్కపోతే మళ్లీ ఇండియాకు వచ్చేయాలి. ఆ క్లిష్ట సమయంలో తన్వీ ఒక యుద్ధమే చేశారు. ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి లింక్డ్ఇన్ (LinkedIn)లో ఉద్యోగాలకు అప్లై చేసేవారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు కంపెనీల వెబ్సైట్లకు వెళ్లి నేరుగా దరఖాస్తులు పంపేవారు. ఈ పట్టుదలే ఆమెకు యాపిల్ కంపెనీలో కాంట్రాక్ట్ ఉద్యోగం వచ్చేలా చేసింది.
అంతా బతుకు పోరాటమే.. ఆనందం ఎక్కడ?
కోటి రూపాయల జీతం వస్తున్నా తన్వీ ఇప్పటికీ 'సర్వైవల్ మోడ్'లోనే ఉన్నారు. "ఇక్కడ ఎవరూ హాయిగా బతకడం లేదు.. కేవలం మనుగడ కోసం పోరాడుతున్నారు. అందరికీ ఉద్యోగ భద్రత కావాలి, కానీ అది ఎక్కడా కనిపించడం లేదు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఇన్ స్టాగ్రామ్ లో చూసే ఫోటోలు, వీడియోలు చూసి అమెరికా కలలు కనవద్దని, ఇక్కడి ఒంటరితనం, పని ఒత్తిడిని భరించే ధైర్యం ఉంటేనే రావాలని ఆమె హెచ్చరిస్తున్నారు. వీసా సమస్యలు, లేఆఫ్స్ మధ్య అమెరికాలో భారతీయుల పరిస్థితి ఒక గోల్డెన్ కేజ్ (బంగారు పంజరం) లాంటిదని ఆమె మాటలు స్పష్టం చేస్తున్నాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs):
తన్వీ పిసల్ ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారు?
ఆమె ప్రస్తుతం కాలిఫోర్నియాలోని శాన్ జోస్లో ఉన్న యాపిల్ (Apple) కార్యాలయంలో యూఎక్స్ (UX) డిజైనర్గా పనిచేస్తున్నారు.
అమెరికాలో ఆమె ఎదుర్కొన్న ప్రధాన సవాళ్లు ఏమిటి?
వరుస లేఆఫ్స్, ఓపీటీ (OPT) వీసా నిబంధనల వల్ల గడువు లోపు ఉద్యోగం వెతుక్కోవాల్సి రావడం, అత్యంత ఒత్తిడితో కూడిన పని సంస్కృతి ఆమె ఎదుర్కొన్న ప్రధాన ఇబ్బందులు.
అమెరికాలో ఆమె జీతం ఎంత?
ప్రస్తుతం ఆమె వార్షిక ఆదాయం సుమారు 1.20 లక్షల డాలర్ల నుండి 1.30 లక్షల డాలర్ల వరకు (భారత కరెన్సీలో కోటి రూపాయలకు పైగా) ఉంది.
కొత్తగా అమెరికా వెళ్లాలనుకునే వారికి ఆమె ఇచ్చే సలహా ఏమిటి?
అక్కడ కనిపించే గ్లామర్ వెనుక భయంకరమైన కష్టం, ఒంటరితనం ఉంటాయని, అన్నింటికీ సిద్ధపడితేనే రావాలని ఆమె సూచిస్తున్నారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


