Indians in US : 'ఆ చిన్న తప్పు చేస్తే మీ కెరీర్ నాశనమే!'- అమెరికా వెళ్లే వారికి భారత మహిళ వార్నింగ్..

Indian students in US : ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థులు పార్ట్-టైమ్ ఉద్యోగాల విషయంలో చేసే ఒక పెద్ద పొరపాటుపై అమెరికాలో ఉంటున్న సోనామి అనే భారతీయ మహిళ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు. ఆ వివరాలు..

Published on: Jul 19, 2026, 10:54:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పెద్ద పెద్ద కలలు, కెరీర్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే బలమైన ఆకాంక్షతో ప్రతి ఏటా లక్షలాది మంది భారతీయ విద్యార్థులు విదేశాల బాట పడుతున్నారు. ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో స్థిరపడాలని ఎంతో కష్టపడుతుంటారు. అయితే, అక్కడికి వెళ్లిన తర్వాత చాలా మంది విద్యార్థులు తెలియకుండానే ఒక పెద్ద కెరీర్ పొరపాటు చేస్తుంటారని, అది వారి భవిష్యత్తును దెబ్బతీస్తుందని అమెరికాలో నివసిస్తున్న సోనామి అనే భారతీయ మహిళా నెటిజన్ హెచ్చరిస్తున్నారు.

అమెరికా వెళుతున్న భారతీయులకు మహిళ హెచ్చరిక.. (Instagram/dillitonyc)
అమెరికా వెళుతున్న భారతీయులకు మహిళ హెచ్చరిక.. (Instagram/dillitonyc)

విదేశాల్లో చదువుకునే సమయంలో ఖర్చుల కోసం చేసే తాత్కాలిక లేదా పార్ట్-టైమ్ ఉద్యోగాలను, చదువు పూర్తయ్యాక కూడా శాశ్వత కెరీర్‌గా మార్చుకోవద్దని ఆమె అంతర్జాతీయ విద్యార్థులకు చెప్పారు. విద్యార్థులు విదేశాలకు వెళ్లేటప్పుడు ఎంతో ఉత్సాహంతో వెళ్తారని, కానీ కాలక్రమేణా అక్కడ లభించే చిన్న ఉద్యోగాల వల్ల వచ్చే ‘కంఫర్ట్ జోన్’లో చిక్కుకుపోతారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఆ కంఫర్ట్ జోనే కెరీర్‌కు పెద్ద శాపం!

"విదేశాల్లో నివసించే వారి జీవితాల్లో అన్నింటికంటే ప్రమాదకరమైన విషయం ఏంటో తెలుసా? కంఫర్ట్ జోన్. ఎందుకంటే, భారతదేశం నుంచి విద్యార్థులు విదేశాలకు వచ్చేటప్పుడు ఎంతో ఉత్సాహంగా, పట్టుదలగా ఉంటారు. కనీసం రూమ్ రెంట్, రోజువారీ ఖర్చులకైనా డబ్బులు వస్తాయి కదా అని చదువుకుంటూనే ఏదో ఒక చిన్న పార్ట్-టైమ్ ఉద్యోగంలో చేరిపోతారు. చదువుతో పాటు దాన్ని మేనేజ్ చేస్తారు," అని సోనామి ఆ వీడియోలో వివరించారు.

అయితే అసలైన సమస్య చదువు పూర్తయిన తర్వాతే మొదలవుతుందని ఆమె పేర్కొన్నారు.

“చదువు ముగిసిన వెంటనే, అంతవరకు తాత్కాలికంగా చేసిన ఆ చిన్న ఉద్యోగాలనే చాలా మంది ఫుల్-టైమ్ కెరీర్‌గా మార్చేసుకుంటారు. అక్కడి వాతావరణానికి అలవాటు పడటం, తోటి ఉద్యోగులతో స్నేహాలు కుదరడంతో జీవితం హాయిగా సాగిపోతోందనే భ్రమలో ఉండిపోతారు. దీనివల్ల తాము అసలు ఏ లక్ష్యంతో విదేశాలకు వచ్చామో, ఏ రంగంలో స్థిరపడాలనుకున్నామో ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తారు,” అని సోనామి ఆవేదన వ్యక్తం చేశారు.

మీ సొంత రంగంలో ప్రయత్నాలు ఆపకండి!

విద్యార్థులు తమ చదువుకు, ఆసక్తులకు తగిన కార్పొరేట్ ఉద్యోగాల కోసం నిరంతరం అన్వేషించాలని సోనామి హితవు పలికారు. ప్రస్తుత జీవితం స్థిరంగా ఉందని సంతృప్తి పడిపోకుండా, మంచి అవకాశాల కోసం నిరంతరం దరఖాస్తు చేస్తూనే ఉండాలని సూచించారు.

"ఆ చిన్న ఉద్యోగాలతోనే సరిపెట్టుకోవద్దు. మీ సొంత విద్యార్హతకు తగిన రంగంలో మంచి కార్పొరేట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూనే ఉండండి, నిరంతరం అప్లై చేయండి. పట్టు వదలకుండా ప్రయత్నిస్తే ఖచ్చితంగా మంచి ఉద్యోగం లభిస్తుంది," అని ఆమె విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపారు.

కేవలం ఉద్యోగాలనే కాకుండా, సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన ఉన్నవారు కూడా ప్రస్తుత తాత్కాలిక జీవితానికి అలవాటు పడి తమ వ్యాపార కలలను వదిలేయవద్దని ఆమె కోరారు. జీవితంలో పెద్దగా ఎదగాలి అంటే అలవాటైన సుఖాల నుంచి బయటకు రావాలని, రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడాలని స్పష్టం చేశారు. రిస్క్ తీసుకుంటేనే దానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని ఆమె ముగించారు.

సోనామి మాటలతో ఏకీభవిస్తున్న నెటిజన్లు..

ఈ వీడియోపై సోషల్ మీడియాలో భారీగా స్పందన వస్తోంది. విదేశాల్లో ఉంటున్న చాలా మంది భారతీయ యువకులు ఆమె చెప్పిన మాటలు నూటికి నూరు పాళ్లు నిజమని కామెంట్లు పెడుతున్నారు.

"మీరు చెప్పింది అక్షర సత్యం, విదేశాల్లో చాలా మంది విద్యార్థులు ఈ ట్రాప్‌లోనే పడిపోతున్నారు," అని ఒక నెటిజన్ రాయగా.. "నేను మీ మాటలను పూర్తిగా సమర్థిస్తున్నాను," అని మరొకరు పేర్కొన్నారు.

తాత్కాలిక అవసరాల కోసం చేసే పనులను కెరీర్‌గా మార్చుకుని జీవితంలో ఎదగలేకపోతున్న ఎంతో మందికి ఈ వీడియో కళ్లు తెరిపించేలా ఉందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More