కువైట్, బహ్రెయిన్లపై ఇరాన్ దాడి.. శాంతి చర్చల వేళ మళ్లీ రగులుతున్న యుద్ధం
మధ్యప్రాచ్యంలో శాంతి చర్చలు సాగుతున్న వేళ అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధ జ్వాలలు ఎగిసిపడ్డాయి. బహ్రెయిన్లోని అమెరికా నౌకాదళ స్థావరం, కువైట్లోని సైనిక విమానాశ్రయం లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్న తరుణంలోనే మంగళవారం అర్ధరాత్రి ఇరు దేశాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. కువైట్, బహ్రెయిన్లలోని అమెరికా సైనిక స్థావరాలు, శతృ నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. తమ ఆయిల్ ట్యాంకర్పై అమెరికా జరిపిన దాడికి ప్రతీకారంగానే ఈ చర్యలు తీసుకున్నామని, ఇది అమెరికాకు ఒక గుణపాఠమని ఇరాన్ ప్రకటించింది.
ఇరాన్ ట్యాంకర్పై దాడి.. ప్రతీకారంగా క్షిపణులు
హార్ముజ్ జలసంధి సమీపంలో ఉన్న ఇరాన్ ఆయిల్ ట్యాంకర్ ఇంజిన్ రూమ్పై అమెరికా సైన్యం క్షిపణి దాడి చేసి నష్టం కలిగించిందని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ 'ప్రెస్ టీవీ' వెల్లడించింది. ఈ దాడికి నిరసనగా ఇరాన్ నౌకాదళం రంగంలోకి దిగింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ 'పనాయా' అనే అమెరికా-జియోనిస్ట్ శతృ నౌకను తాము క్షిపణులతో టార్గెట్ చేశామని ఐఆర్జీసీ స్పష్టం చేసింది.
"ఏదైనా దురాక్రమణకు పాల్పడితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని గతంలోనే హెచ్చరించాం. దానికి అనుగుణంగానే ఈ చర్య తీసుకున్నాం. ఈ దాడులు అమెరికాకు ఒక పాఠం కావాలి. హార్ముజ్ జలసంధి భద్రతకు ముప్పు కలిగిస్తే అమెరికా సైన్యం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు" అని ఇరాన్ సైన్యం హెచ్చరించింది.
దాడులను తిప్పికొట్టామన్న అమెరికా
బహ్రెయిన్లోని అమెరికా ఐదో నౌకాదళ (5th Fleet) ప్రధాన కార్యాలయంపై, కువైట్లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ధృవీకరించింది. అయితే, కువైట్ వైపు దూసుకొచ్చిన ఇరాన్ డ్రోన్లు మార్గమధ్యంలోనే కూలిపోయాయని, బహ్రెయిన్ లక్ష్యంగా వచ్చిన క్షిపణులను అమెరికా, బహ్రెయిన్ దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయని స్పష్టం చేసింది. ఈ దాడులకు ప్రతిచర్యగా హార్ముజ్ జలసంధిలోని ఖేష్మ్ ద్వీపంలో ఉన్న ఇరాన్ సైనిక కంట్రోల్ స్టేషన్పై అమెరికా దళాలు ఎదురుదాడులు జరిపాయి.
శాంతి చర్చల పరిస్థితి ఏంటి?
అమెరికా, ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు జరుగుతున్న చర్చల నుండి ఇరాన్ తప్పుకుందని స్థానిక వార్తా సంస్థలు ఫార్స్, తస్నిమ్ నివేదించాయి. లెబనాన్లో కాల్పుల విరమణను పూర్తిగా అమలు చేస్తేనే తాము చర్చల్లో పాల్గొంటామని ఇరాన్ షరతు పెట్టినట్లు మధ్యవర్తులు తెలిపారు. మంగళవారం నుండి ఇరాన్ వైపు నుండి ఎటువంటి స్పందన రాలేదని సమాచారం.
అయితే, చర్చలు నిలిచిపోయాయన్న వార్తలను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. అవన్నీ అవాస్తవాలని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
"మా మధ్య చర్చలు నిరంతరాయంగా సాగుతున్నాయి. నిన్న, మొన్న, అంతకుముందు కూడా మాట్లాడాం. ఈ చర్చలు ఎక్కడికి దారితీస్తాయో ఎవరికీ తెలియదు. కానీ, ఇరాన్తో నేను ఒకటే చెప్తున్నా.. ఏదో ఒక మార్గంలో ఒప్పందం చేసుకోవడానికి ఇదే సరైన సమయం" అని ట్రంప్ స్పష్టం చేశారు.
రెండు రోజుల క్రితం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మాట్లాడుతూ.. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్ సహా అన్ని రంగాలకు వర్తిస్తుందని తెలిపారు. ఏ ఒక్క చోట నిబంధనలు ఉల్లంఘించినా, అది మొత్తం ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లేనని, దానికి అమెరికా, ఇజ్రాయెల్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


