ప్రియుడితో కలిసి ఉన్న సమయంలో చూశాడన్న ఆక్రోశంతో ఒక 13 ఏళ్ల బాలిక, తన ప్రేమికుడితో కలిసి తన సొంత తాతను అతికిరాతకంగా హత్య చేసింది. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లా చిర్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో ఈ ఘోరం జరిగింది. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని బావిలో పడేసి ఏమీ తెలియనట్లు నటించారు. దహన సంస్కారాలు పూర్తయిన రెండు రోజుల తర్వాత ఇంట్లో రక్తపు మరకలు ఉన్న దుస్తులు దొరకడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే?

బాధితుడు రామ్దీన్ (65) కు కుమారులు లేరు. ఆయన తన భార్య, 9వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల మనవరాలితో కలిసి నివసిస్తున్నారు. సెప్టెంబర్ 12న రామ్దీన్ భార్య పనికి వెళ్లడంతో, ఇంట్లో ఆయన మనవరాలితో కలిసి ఉన్నాడు. ఆ సాయంత్రం నుంచి రామ్దీన్ హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. మరుసటి రోజు సమీపంలోని బావిలో ఆయన మృతదేహం లభ్యమైంది. మద్యం సేవించి ప్రమాదవశాత్తు బావిలో పడిపోయి ఉంటాడని భావించి, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే దహన సంస్కారాలు పూర్తి చేశారు.
రక్తపు దుస్తులతో వెలుగులోకి నిజం
మంగళవారం రాత్రి ఇల్లు శుభ్రం చేస్తున్న సమయంలో కుటుంబ సభ్యులకు రామ్దీన్, ఆయన మనవరాలికి చెందిన రక్తపు మరకలున్న దుస్తులు లభించాయి. దీంతో కుటుంబ సభ్యులకు బాలికపై అనుమానం వచ్చి నిలదీశారు. పోలీసుల విచారణలో తన ప్రియుడితో కలిసి తాతను హత్య చేసినట్లు బాలిక ఒప్పుకుంది. రుబ్బురాయితో తలపై తీవ్రంగా కొట్టి హత్య చేశామని, అనంతరం మృతదేహాన్ని బావిలో పడేసినట్లు వివరించింది.
నిందితుల అరెస్ట్, జువైనల్ కోర్టుకు తరలింపు
మృతుడి అల్లుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్పీ (రూరల్) డాక్టర్ అరవింద్ కుమార్ తెలిపారు. "సంఘటనా స్థలం నుంచి రక్తపు మరకలున్న దుస్తులు, ఇతర సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నాం" అని ఆయన వెల్లడించారు. బుధవారం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని జువైనల్ కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు స్పష్టం చేశారు.