కర్ణాటకలో సీఎం మార్పు? ఢిల్లీలో హైకమాండ్ కీలక భేటీ.. సిద్దరామయ్య గద్దె దిగుతారా?
కర్ణాటక రాజకీయాల్లో మరోసారి నాయకత్వ మార్పు అంశం తెరపైకి వచ్చింది. మంగళవారం ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జరిపే భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీ తర్వాత కర్ణాటకలో ‘కుర్చీ’ లాటపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో గత కొద్ది రోజులుగా నివురు గప్పిన నిప్పులా ఉన్న 'నాయకత్వ మార్పు' అంశం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ వీధులకు చేరింది. మంగళవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో సీఎం సిద్దరామయ్య కీలక భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా కూడా హాజరుకానుండటంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

ఢిల్లీకి చేరిన ‘బెంగళూరు’ రాజకీయం
ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారమే ఢిల్లీ చేరుకోగా, వెనువెంటనే ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా అక్కడకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కుదిరినట్లుగా భావిస్తున్న ‘అధికార పంపిణీ’ ఒప్పందం (Power Sharing Agreement) ప్రకారం.. రెండున్నరేళ్ల తర్వాత డీకే శివకుమార్కు సీఎం పీఠం అప్పగించాలనే డిమాండ్ ఆయన వర్గం నుంచి బలంగా వినిపిస్తోంది. అయితే, అధిష్టానం పిలుపు మేరకే తాను వచ్చానని, చర్చాంశం ఏంటో తనకు తెలియదని డీకే శివకుమార్ మీడియాకు తెలిపారు.
బరిలో దళిత నేత పేరు?
ఒకవేళ సిద్దరామయ్యను పదవి నుంచి తప్పుకోవాలని హైకమాండ్ సూచిస్తే, ఆయన తన వారసుడిగా హోం మంత్రి జి.పరమేశ్వర పేరును ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దళిత సామాజిక వర్గానికి చెందిన పరమేశ్వరను సీఎంగా చేయడం ద్వారా రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకును కాపాడుకోవచ్చని సిద్దరామయ్య భావిస్తున్నారు. మరోవైపు, సిద్దరామయ్యను జాతీయ రాజకీయాల్లోకి తీసుకువచ్చి, రాజ్యసభకు పంపే ఆలోచన కూడా అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కేబినెట్ విస్తరణా? మార్పులా?
నాయకత్వ మార్పుతో పాటు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (Cabinet Reshuffle) కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చకు రానుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కేబినెట్ మార్పుల ద్వారా అసంతృప్త నేతలను చల్లబరచాలని పార్టీ భావిస్తోంది. అలాగే, త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై కూడా ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
అధిష్టానం వ్యూహం ఏమిటి?
కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ పటిష్టంగా ఉన్నప్పటికీ, అంతర్గత విభేదాలు పాలనపై ప్రభావం చూపకుండా చూడటం ఖర్గే, రాహుల్ గాంధీలకు సవాలుగా మారింది. వెనుకబడిన వర్గాల ప్రతినిధిగా, సుదీర్ఘ కాలం సీఎంగా పనిచేసిన రికార్డు ఉన్న సిద్దరామయ్యను కాదని డీకే శివకుమార్కు పట్టం కడితే వచ్చే పరిణామాలను పార్టీ బేరీజు వేస్తోంది. వచ్చే 2-3 రోజుల్లో కర్ణాటక కొత్త సీఎం ఎవరనే దానిపై లేదా ప్రస్తుత వ్యవస్థే కొనసాగుతుందా అనే దానిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


