...
...
Next Story

ట్విన్స్ వెడ్డింగ్ ధమాకా! కవల సోదరులను పెళ్లాడిన కవల అక్కాచెల్లెళ్లు- ఫాదర్లు, అసిస్టెంట్లు కూడా కవలలే!

Kerala twin wedding : కేరళలో ఒక వినూత్న వివాహం చోటుచేసుకుంది. కవల సోదరులు, కవల సోదరీమణులను పెళ్లి చేసుకున్నారు. అంతేకాకుండా ఈ శుభకార్యాన్ని జరిపించిన ఫాదర్లు, అసిస్టెంట్లు కూడా కవలలు కావడం విశేషం. అసలేం జరిగిందంటే..

Published on: Aug 1, 2026, 12:20:48 IST
Advertisement

కేరళలోని చంగనస్సేరిలో జరిగిన ఒక పెళ్లి.. చాలా భిన్నంగా, ప్రపంచంలో ఎక్కడా చూడని అరుదైన సన్నివేశంతో వార్తల్లో నిలిచింది. ఈ వివాహ వేడుకలోని ప్రధాన పాత్రలన్నీ కవలలే కావడం విశేషం. అంటే.. వధూవరులు ట్విన్సే, పెళ్లి జరిపించిన వారు ట్విన్సే!

కేరళలో విచిత్ర సంఘటన..
కేరళలో విచిత్ర సంఘటన..

గురువారం నాడు చంగనస్సేరి మెట్రోపాలిటన్ చర్చీలో ఈ విచిత్రమైన సన్నివేశం ఆవిష్కృతమైంది. వరుడు అఖిల్ కే. థామస్ చెయ్యి పట్టుకుని వధువు మ్యాగి మేరీ థామస్ నిలబడగా.. అఖిల్ కవల సోదరుడు నిఖిల్ కే. థామస్ పక్కన, మ్యాగి కవల సోదరి మరియా మేరీ థామస్ నిలబడింది.

ఇక ఈ పెళ్లి వేడుకను జరిపించిన ఫాదర్లు (పురోహితులు) కూడా కవల సోదరులే కావడం, వారికి సహాయకులుగా (అల్తార్ బాయ్స్) వ్యవహరించిన ఇద్దరు బాలురు కూడా కవలలు కావడంతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు.

ఇలా.. రెండు కుటుంబాలకు ఇది కేవలం పెళ్లి మాత్రమే కాదు.. ఎన్నో ఏళ్లుగా తాము కంటున్న ఒక అందమైన కల నెరవేరిన క్షణం.

ఎవరు ఎక్కడి వారు?

వరులైన అఖిల్, నిఖిల్‌లు.. చంగనస్సేరి వెట్టుపరంబిల్ నివాసితులైన కుంజుమోన్ థామస్, జోమోల్ దంపతుల కవల పిల్లలు. ఇక వధువులైన మ్యాగి, మరియాలు పతనంతిట్ట జిల్లా కులత్తూర్‌కు చెందిన తోమిచన్, మేరీకుట్టి దంపతుల కవల కుమార్తెలు.

ఇక ఈ పెళ్లి తంతును నడిపించేందుకు కంజిరపల్లి డయోసిస్‌కు చెందిన (కవల) ఫాదర్లు ఆంటో పెజుంకట్టిల్, అజో పెజుంకట్టిల్ ప్రత్యేకంగా విచ్చేశారు. వారికి సహాయకులుగా.. కవల సోదరులు జెరాన్ జేమ్స్, జోహన్ జేమ్స్‌లు వ్యవహరించారు.

పక్కా ప్లాన్​తో..

పెళ్లిలో అన్ని ముఖ్యమైన పాత్రల్లోనూ కవలలే ఉండాలనే ఆలోచన అనుకోకుండా వచ్చిందేమీ కాదు! చిన్నప్పటి నుంచే తమ పెళ్లి వేడుక కవలల సమక్షంలోనే అట్టహాసంగా జరగాలని ఆ అక్కాచెల్లెళ్లు కలలు కన్నారు.

ఈ అరుదైన పెళ్లి గురించి ఫాదర్లు మాట్లాడుతూ.. “కవలల పెళ్లి జరిపించడం మా జీవితంలో మర్చిపోలేని అనుభూతి. ఇది మాకు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం. ఒకేసారి జన్మించిన వారు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు, అలాగే మేము కూడా ఒకేసారి దైవ సేవలోకి అడుగుపెట్టాం. ఇది ఎంతో అందమైన అనుభవం,” అని పేర్కొన్నారు.

మర్చంట్ నేవీలో పనిచేస్తున్న నిఖిల్, అఖిల్‌లు.. ఐటీ రంగంలో స్థిరపడిన మ్యాగి, మరియాల చేయందుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు వచ్చిన బంధుమిత్రులకు ఇది ఒక మర్చిపోలేని తీపి అనుభవంగా మిగిలిపోయింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe