పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలు కల్లోలంలో పడ్డాయి. ఈ నేపథ్యంలో భారతదేశానికి, ముఖ్యంగా కర్ణాటక ప్రాంతానికి ఒక శుభవార్త అందింది. భారీ ఎత్తున వంటగ్యాస్ (LPG) నిల్వలతో కూడిన ‘అపోలో ఓషన్’ అనే నౌక బుధవారం రాత్రి 8 గంటల సమయంలో మంగళూరు పోర్టుకు చేరుకుంది.
16,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ సరఫరా

న్యూ మంగళూరు పోర్టుకు చేరుకున్న ఈ నౌకలో సుమారు 16,000 మెట్రిక్ టన్నుల ఎల్పిజి గ్యాస్ ఉంది. నౌక పోర్టుకు చేరుకున్న వెంటనే అన్-లోడింగ్ ప్రక్రియను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఇంధన కొరత ఏర్పడుతుందనే ప్రచారం జరుగుతున్న తరుణంలో, ఈ స్థాయి నిల్వలు అందుబాటులోకి రావడం స్థానిక మార్కెట్లో గ్యాస్ సరఫరాను స్థిరంగా ఉంచేందుకు దోహదపడనుంది.
సరఫరా మార్గంలో సవాళ్లు.. మార్పులు
నిజానికి ఈ గ్యాస్ సరఫరా వెనుక ఒక చిన్న చిక్కుముడి ఉంది. మొదట ‘శివాలిక్’ అనే నౌక హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించి ఈ గ్యాస్ను నేరుగా మంగళూరుకు చేరవేయాల్సి ఉంది. కానీ, భద్రతా కారణాల దృష్ట్యా ఆ నౌక గుజరాత్ పోర్టుకు మళ్లించబడింది. అక్కడ గ్యాస్ను అన్-లోడ్ చేసిన తర్వాత, తిరిగి ‘అపోలో ఓషన్’ ద్వారా కర్ణాటకకు తరలించాల్సి వచ్చింది. భారత్కు చెందిన మరో రెండు ఎల్పిజి నౌకలు కూడా హోర్ముజ్ జలసంధిని దాటుకుని సురక్షితంగా స్వదేశానికి చేరుకోవడం గమనార్హం.
ఇది తీవ్రమైన ఇంధన సంక్షోభం: ప్రధాని మోదీ
మరోవైపు, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల ఏర్పడిన పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేశారు.
"మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు ఎరువుల సరఫరాపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది" అని ప్రధాని పేర్కొన్నారు.
{{/usCountry}}"మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు ఎరువుల సరఫరాపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది" అని ప్రధాని పేర్కొన్నారు.
{{/usCountry}}ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వంటి కీలక సముద్ర మార్గాలను అడ్డుకోవాలని ఇరాన్ చేసే ప్రయత్నాలు ఏమాత్రం ‘అంగీకరించలేనివి’ అని ఆయన స్పష్టం చేశారు. భారత నౌకలు సురక్షితంగా బయటపడేలా దౌత్యపరమైన చర్యలు తీసుకుంటున్నామని సభకు వివరించారు.
కోటి మంది భారతీయుల భద్రతే ముఖ్యం
కేవలం ఇంధనమే కాకుండా, గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న సుమారు ఒక కోటి మంది భారతీయుల భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని ప్రధాని గుర్తుచేశారు. యుద్ధం వల్ల వారి జీవనోపాధి దెబ్బతినకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని భరోసా ఇచ్చారు.
రేపు ప్రధాన మంత్రి వర్చువల్ సమావేశం
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో మన అవసరాలపై సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ముఖ్యమంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారని, విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ నివేదించింది. అయితే, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం లేదు.
ఈ చర్చ ‘టీమ్ ఇండియా’ స్ఫూర్తితో సమన్వయ చర్యలు చేపట్టడం, ఏకీకృత విధానాన్ని పెంపొందించడంపై దృష్టి సారించే అవకాశం ఉంది.