...
...
Next Story

ప్రధాని మోదీపై ఖర్గే సంచలన వ్యాఖ్యలు: అన్నాడీఎంకే పొత్తుపై తీవ్ర విమర్శలు

ప్రధాని మోదీని 'టెర్రరిస్ట్' అని సంబోధిస్తూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అన్నాడీఎంకే-బీజేపీ పొత్తుపై మండిపడటంతో పాటు ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఆయన చేసిన ఆరోపణల వివరాలు ఇక్కడ చూడండి.

Published on: Apr 21, 2026, 18:11:56 IST
Advertisement

దేశ రాజకీయాల్లో మంగళవారం ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు పెను సంచలనానికి దారితీశాయి. ప్రధానిని ఉద్దేశించి ఆయన 'టెర్రరిస్ట్' అనే పదాన్ని వాడటంతో పాటు, తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీ బీజేపీతో జతకట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీశాయి.

అన్నాడీఎంకేపై విమర్శల జడివాన

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (@kharge)
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (@kharge)

తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే తీరును ఖర్గే ఎండగట్టారు. "అన్నాదురై వంటి గొప్ప నేతల ఫోటోలను పెట్టుకునే అన్నాడీఎంకే నేతలు మోదీతో ఎలా కలుస్తారు? ఆయన ఒక ఉగ్రవాది. ఆయన పార్టీకి సమానత్వం, న్యాయంపై అస్సలు నమ్మకం లేదు. అటువంటి వారితో చేతులు కలపడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే" అని ఖర్గే నిప్పులు చెరిగారు. తమిళనాడు ప్రయోజనాలను కాపాడటంలో అన్నాడీఎంకే విఫలమైందని, ఆ పార్టీ ఇప్పుడు బీజేపీకి ఒక మూగ బానిసగా మారిపోయిందని ఆయన ఘాటుగా విమర్శించారు. బీజేపీ ముందు తలవంచకుండా పోరాడే నాయకత్వం ఒక్క ఎంకే స్టాలిన్‌కే ఉందని ఆయన కొనియాడారు.

తన వ్యాఖ్యలపై వివరణ

మోదీని టెర్రరిస్ట్ అని పిలవడంపై సర్వత్రా విమర్శలు రావడంతో ఖర్గే వెంటనే స్పందిస్తూ వివరణ ఇచ్చారు. తాను ప్రధానిని నేరుగా ఉగ్రవాది అని అనలేదని, ఆయన ఎప్పుడూ ప్రజలను, విపక్షాలను భయపెడతారనే ఉద్దేశంతో ఆ పదాన్ని వాడానని చెప్పుకొచ్చారు. "మోదీ ఎప్పుడూ బెదిరింపులకు పాల్పడుతుంటారు. ఈడీ, ఐటీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలన్నీ ఆయన కనుసన్నల్లోనే పనిచేస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనను కూడా తన చేతుల్లోకి తీసుకోవాలని ఆయన చూస్తున్నారు. ఇవన్నీ భయపెట్టే చర్యలే కదా" అని ఖర్గే ప్రశ్నించారు.

ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఆరోపణలు

ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. 2023లోనే కాంగ్రెస్ ఈ బిల్లుకు పూర్తి మద్దతు ఇచ్చిందని, కానీ జనాభా గణన పూర్తి కాలేదనే సాకుతో మోదీ ప్రభుత్వం దానిని అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆయన గుర్తు చేశారు.

బీజేపీ ఎదురుదాడి

ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానిని దూషించడం ఇదే మొదటిసారి కాదని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు సుమారు 175 సార్లు మోదీని కాంగ్రెస్ నేతలు దూషించారని పూనావాలా మండిపడ్డారు. "జిహాదీలకు క్లీన్ చిట్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీకి, దేశం కోసం పనిచేసే ప్రధాని ఉగ్రవాదిలా కనిపిస్తున్నారా? ఇది వారి ద్వేషపూరిత రాజకీయాలకు నిదర్శనం" అని ఆయన విమర్శించారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe