Bengal Assembly Dissolved : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో గురువారం (మే 7) నాడు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుత శాసనసభ పదవీకాలం ముగియడంతో గవర్నర్ ఆర్.ఎన్. రవి అసెంబ్లీని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగంలోని అధికరణ 174(2)(బి) ప్రకారం తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగిస్తూ గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రకటన వెలువడిన క్షణం నుంచి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి హోదాను కోల్పోయారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) 80 స్థానాలకే పరిమితం కాగా… భారతీయ జనతా పార్టీ (BJP) 207 స్థానాల్లో ఘనవిజయం సాధించి మెజారిటీని దక్కించుకుంది. అయితే ఈ ఫలితాలను అంగీకరించని మమతా బెనర్జీ తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని గతంలోనే భీష్మించారు.
"మేము ప్రజల తీర్పు వల్ల ఓడిపోలేదు.. కుట్రల వల్ల ఓడిపోయాము" అని ఆమె మండిపడ్డారు. తనను కావాలంటే డిస్మిస్ చేయాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినా సిద్ధమేనని… సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని బుధవారం జరిగిన అంతర్గత సమావేశంలో ఆమె స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
గవర్నర్ తాజా ఉత్తర్వులతో……. మే 2021లో మూడోసారి మమతా బెనర్జీ నేతృత్వంలో ఏర్పాటైన అసెంబ్లీ పదవీకాలం నేటితో (మే 7) ముగిసింది. మరోవైపు ఎన్నికల కమిషన్ బీజేపీ విజయాన్ని అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో….. రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా గవర్నర్ నేరుగా అసెంబ్లీని రద్దు చేస్తూ లోక్ భవన్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేశారు.
తాజా పరిణామాలతో బెంగాల్లో టీఎంసీ పాలన శకం తాత్కాలికంగా ముగిసింది. ఘనవిజయం సాధించిన బీజేపీ త్వరలోనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.