...
...
Next Story

Man kills wife : భార్యను గర్ల్​ఫ్రెండ్​ రూమ్​కి తీసుకెళ్లి చంపేసిన భర్త! పెళ్లైన 3 నెలలకే..

పుణె రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తరుణంలోనే.. హరియాణాలోని గురుగ్రామ్‌లో అలాంటిదే మరో ఘోరం వెలుగుచూసింది. తన మూడేళ్ల ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించడానికి, పెళ్లయిన కేవలం మూడు నెలలకే ప్రియురాలితో కలిసి భార్యను కాల్చి చంపాడు ఓ కిరాతక భర్త.

Published on: Jul 6, 2026, 10:30:43 IST
Advertisement

దేశంలో వివాహేతర సంబంధాలు, క్షణికావేశాలు ఎంతటి దారుణాలకు దారితీస్తున్నాయో చెప్పడానికి గురుగ్రామ్ పరిధిలోని మానేసర్‌లో జరిగిన ఒక ఘటనే నిదర్శనం. పుణెకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్‌ను అతని కాబోయే భార్య సియా గోయల్ తన ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిన ఉదంతం సృష్టించిన కలకలం ఇంకా చల్లబడక ముందే.. హరియాణాలో మరో కుట్ర బయటపడింది. పెళ్లయిన మూడు నెలలకే భార్యను అడ్డు తొలగించుకోవాలని చూసిన భర్త, తన ప్రియురాలితో కలిసి ఆమెను తుపాకీతో కాల్చి చంపేశాడు.

మూడు నెలలకే అదృశ్యం.. ఆపై శవమైంది!

భార్యను గర్ల్​ఫ్రెండ్​ రూమ్​కి తీసుకెళ్లి చంపేసిన భర్త! (Representational Photo/PTI)
భార్యను గర్ల్​ఫ్రెండ్​ రూమ్​కి తీసుకెళ్లి చంపేసిన భర్త! (Representational Photo/PTI)

మానేసర్‌కు చెందిన 22 ఏళ్ల యువతికి, అదే ప్రాంతానికి చెందిన అంకిత్ (25) అనే యువకుడితో ఫిబ్రవరిలో వివాహమైంది. అయితే, మే 21న ఆ యువతి అకస్మాత్తుగా అదృశ్యమైంది. ఆమె కుటుంబ సభ్యులు అన్ని చోట్లా వెతికినా ఫలితం లేకపోవడంతో, అల్లుడిపై అనుమానంతో మే 22న మానేసర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అదే రోజు మానేసర్‌లోని ఒక గదిలో సదరు యువతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఆమెను తుపాకీతో కాల్చి చంపినట్లు తేలడంతో, పోలీసులు దీనిని హత్య కేసుగా నమోదు చేసి విచారణను వేగవంతం చేశారు.

విచారణలో షాకింగ్ నిజాలు: మూడేళ్ల అఫైర్!

ఈ ఘోర హత్యకు పాల్పడిన నిందితుడు, మృతురాలి భర్త అంకిత్‌తో పాటు అతని ప్రియురాలైన రజినీ దేవి (38) అనే మహిళను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మానేసర్‌లో పొగాకు దుకాణం నడిపే అంకిత్‌కు, అదే ప్రాంతంలోని ఒక బ్యూటీ పార్లర్‌లో పనిచేసే రజినీ దేవి గత మూడేళ్లుగా రిలేషన్​లో ఉన్నారు. కానీ ఇంట్లో బలవంతం చేయడంతో ఫిబ్రవరిలో అంకిత్ వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడు.

రజినీ దేవి అద్దెకు ఉంటున్న గదిలోనే ఈ హత్యకు వ్యూహం పన్నారు. హత్య చేయడానికి రెండు నెలల ముందే ఉత్తరప్రదేశ్ నుంచి ఒక అక్రమ ఆయుధాన్ని (తుపాకీ) కొనుగోలు చేశారు. ప్లాన్ ప్రకారం మే 21న అంకిత్ తన భార్యను రజినీ దేవి గదికి తీసుకువెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి ఆమెపై కాల్పులు జరిపి ప్రాణాలు తీశారు.

నేపాల్‌కు పారిపోయిన నిందితులు..

హత్య చేసిన అనంతరం దొరకకుండా ఉండేందుకు అంకిత్, రజినీ దేవి ఇద్దరూ కలిసి హరిద్వార్ మీదుగా దేశ సరిహద్దులు దాటి నేపాల్‌కు పారిపోయారు. దాదాపు నెల రోజులకు పైగా పరారీలో ఉన్న ఈ నిందితులు.. జూన్ 30న తిరిగి భారతదేశంలోకి అడుగుపెట్టారు.

అప్పటికే నిఘా పెట్టిన క్రైమ్ బ్రాంచ్ బృందం.. సరిగ్గా వారు మానేసర్‌కు చేరుకోగానే పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకుంది. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం వారికి ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకునేందుకు, మరిన్ని ఆధారాలు సేకరించేందుకు పోలీసులు నిందితులను ప్రశ్నిస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks