Maruti Suzuki Dzire : ‘నీ దూకుడు.. సాటెవ్వడు’- 30లక్షల సేల్స్ దాటిన సెడాన్ ఇది..
Best selling car in India : ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ కారుగా దూసుకెళుతున్న మారుతీ సుజుకీ డిజైర్ సరికొత్త మైలురాయికి చేరుకుంది. డిజైర్కి చెందిన 30లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయని సంస్థ వెల్లడించింది.
భారత ఆటోమొబైల్ రంగంలో మారుతీ సుజుకీ ‘డిజైర్’ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. భారత్లో ఈ కారు అమ్మకాలు 30 లక్షల (3 మిలియన్ల) యూనిట్ల మార్కును దాటాయి. దేశీయ మార్కెట్లో అత్యంత విజయవంతమైన సెడాన్ కార్లలో ఒకటిగా తన స్థానాన్ని డిజైర్ మరోసారి సుస్థిరం చేసుకుంది.

2025లో నంబర్ వన్ కారుగా..
మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2025 క్యాలెండర్ ఇయర్ లో 2,14,488 యూనిట్ల అమ్మకాలతో దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా డిజైర్ అగ్రస్థానంలో నిలిచింది. సెడాన్ సెగ్మెంట్లో దశాబ్ద కాలానికి పైగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ, బలమైన కస్టమర్ బేస్ను ఈ కారు సొంతం చేసుకుంది.
యువతను ఆకట్టుకుంటున్న కొత్త మోడల్..
డిజైర్ 30లక్షల సేల్స్ మార్కుపై మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) పార్థో బెనర్జీ స్పందిస్తూ, వినియోగదారులు తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. నాలుగో తరం డిజైర్ తన ఆకర్షణీయమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్లతో సెడాన్ సెగ్మెంట్లో మళ్లీ కొత్త ఉత్సాహాన్ని నింపిందని ఆయన పేర్కొన్నారు.
విశేషం ఏంటంటే.. డిజైర్ కొనుగోలుదారులలో దాదాపు 50 శాతం మంది యువత, మొదటిసారి కారు కొంటున్నవారే ఉండటం గమనార్హం.
నాలుగు తరాల ప్రయాణం: 2008 నుంచి నేటి వరకు..
2008లో తొలిసారిగా పరిచయమైన మారుతీ సుజుకీ డిజైర్, నాలుగు తరాలుగా మారుతూ వస్తోంది:
మొదటి తరం: ఏబీఎస్, క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లను తన సెగ్మెంట్లో పరిచయం చేసింది.
రెండవ తరం: ఏజీఎస్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్తో వచ్చింది.
మూడొవ తరం: ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, స్మార్ట్ప్లే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లను జోడించింది.
నాలుగొవ తరం (ప్రస్తుత మోడల్): కొత్త 'జెడ్' సిరీస్ ఇంజిన్, అత్యాధునిక టెక్నాలజీతో పాటు 5-స్టార్ సేఫ్టీ టెస్ట్ రేటింగ్తో అత్యంత సురక్షితమైన కారుగా నిలిచింది.
మారుతీ సుజుకీ డిజైర్- లగ్జరీ ఫీచర్లు.. అదిరిపోయే మైలేజ్
ప్రస్తుత మారుతీ సుజుకీ డిజైర్లో ప్రీమియం ఫీచర్లకు కొదవ లేదు:
ఫీచర్లు: ఎలక్ట్రిక్ సన్రూఫ్, 360 డిగ్రీల కెమెరా, 9- ఇంచ్ స్మార్ట్ప్లే ప్రో+ ఇన్ఫోటైన్మెంట్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ ప్లే.
సేఫ్టీ: 6 ఎయిర్బ్యాగులు, హిల్ హోల్డ్ అసిస్ట్తో కూడిన ఈఎస్పీ, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్. భారత్ ఎన్సీఏపీ, గ్లోబల్ ఎన్సీఏపీ నుంచి 5-స్టార్ రేటింగ్ పొందింది.
మైలేజ్: పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 24.79 కి.మీ, ఎస్-సీఎన్జీ మోడ్ కిలోకు 33.73 కి.మీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది.
తరచుగా అడిగే ప్రశ్నలు-
1. మారుతీ సుజుకీ సంస్థ ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది?
మారుతీ సుజుకీ ప్రయాణం 1981లో భారత ప్రభుత్వం 'మారుతి ఉద్యోగ్ లిమిటెడ్'ను స్థాపించడంతో మొదలైంది. మధ్యతరగతి భారతీయులకు సరసమైన ధరలో కారును అందించాలనే లక్ష్యంతో, 1982లో జపాన్కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్తో చేతులు కలిపింది. ఇది భారత పారిశ్రామిక రంగంలోనే ఒక విప్లవాత్మకమైన జాయింట్ వెంచర్గా నిలిచింది.
2. భారత్లో మారుతీ సుజుకీ విడుదల చేసిన మొట్టమొదటి కారు ఏది
మారుతి సుజుకి విడుదల చేసిన తొలి కారు మారుతీ 800. ఇది డిసెంబర్ 14, 1983న మార్కెట్లోకి వచ్చింది. మొదటి కారు తాళాలను అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ స్వయంగా దిల్లీకి చెందిన హర్పాల్ సింగ్కు అందజేశారు. ఈ కారు భారతీయ రోడ్లపై విప్లవానికి నాంది పలికింది.
3. 'మారుతి ఉద్యోగ్' పేరు 'మారుతీ సుజుకీ'గా ఎప్పుడు మారింది
ప్రారంభంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ సంస్థలో సుజుకీ క్రమంగా తన వాటాను పెంచుకుంటూ వచ్చింది. 2002లో సుజుకి మెజారిటీ వాటాను సొంతం చేసుకోగా, 2007లో భారత ప్రభుత్వం తన మిగిలిన వాటాను కూడా విక్రయించింది. దీనితో అదే ఏడాది (2007 సెప్టెంబర్ 17న) సంస్థ పేరు అధికారికంగా మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్గా మారింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


