పండుగ సీజన్లో కస్టమర్లకు షాకిచ్చిన Maruti Suzuki! కార్ల ధరల పెంపు- ఎంతంటే..
పండుగ సీజన్ ముంగిట కారు కొనాలనుకునే వారికి మారుతీ సుజుకీ గట్టి షాక్ ఇచ్చింది. పెరిగిన ముడిసరుకుల వ్యయం, ద్రవ్యోల్బణ భారాన్ని తట్టుకునేందుకు సెప్టెంబర్ నెల నుంచి ఎంపిక చేసిన మోడళ్ల ధరలను రూ.20,000 వరకు పెంచుతున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది.
దేశీయ ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తున్న ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా, కస్టమర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. వినాయక చవితి, దసరా, దీపావళి వంటి అతిపెద్ద పండుగల సీజన్ ప్రారంభమవుతున్న సమయంలోనే కంపెనీ ఈ ప్రైజ్ హైక్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఎంపిక చేసిన కొన్ని మోడళ్లపై సెప్టెంబర్ నెల నుంచే రూ.20,000 వరకు ధరలను పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ స్పష్టం చేసింది. ఈ మేరకు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ స్టాక్ ఎక్స్ఛేంజీలకు దాఖలు చేసిన సమాచారంలో ఈ వివరాలను వెల్లడించింది.
గడిచిన మే నెల నుంచి చూస్తే కంపెనీ కార్ల ధరలను సవరించడం ఇది వరుసగా మూడోసారి!.
మారుతీ సుజుకీ ధరల పెంపునకు గల కారణాలేంటి?
కార్ల తయారీకి అయ్యే ముడిసరుకుల ఖర్చులు రోజురోజుకూ అమాంతం పెరిగిపోతుండటమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని మారుతీ సుజుకీ తెలిపింది. ద్రవ్యోల్బణం తీవ్రస్థాయిలో ఉండటం, ఉత్పత్తి వ్యయం భారీగా పెరగడంతో ఈ భారాన్ని కొంతమేర వినియోగదారులపై వేయక తప్పడం లేదని పేర్కొంది.
"ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకునేందుకు అంతర్గతంగా ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ, నిరంతరం పెరుగుతున్న వ్యయ భారం వల్ల అనివార్యంగా ధరలను సవరించాల్సి వస్తోంది. అయితే, వినియోగదారులపై వీలైనంత తక్కువ ప్రభావం పడేలా జాగ్రత్తలు తీసుకున్నాం," అని మారుతీ సుజుకీ తన ప్రకటనలో వివరణ ఇచ్చింది.
ఒకే సంవత్సరంలో మూడోసారి పెంపు!
ఈ ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకీ కార్ల ధరలు పెరగడం ఇది మూడోసారి.
మొదటి పెంపు (జూన్): ముడిసరుకుల రవాణా, తయారీ ఖర్చులు పెరిగాయనే సాకుతో జూన్ నెలలో మోడల్ను బట్టి రూ.30,000 వరకు పెంచారు.
రెండో పెంపు (ఆగస్టు): ప్రయాణికుల వాహనాల పోర్ట్ఫోలియో మొత్తానికి వర్తించేలా ఆగస్టులోనూ రూ.30,000 వరకు ధరలను పెంచారు.
తాజా పెంపు (సెప్టెంబర్): ఇప్పుడు సెప్టెంబర్ నుంచి ఎంపిక చేసిన మోడళ్లపై గరిష్టంగా రూ.20,000 వరకు అదనపు భారం పడనుంది.
ఈ పెంపు మారుతీ సుజుకీ శ్రేణిలోని ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, డిజైర్, బలేనో, ఫ్రాంక్స్, బ్రెజ్జా, ఎర్టిగా, గ్రాండ్ విటారా, జిమ్నీ, ఇన్విక్టో, విక్టోరిస్ వంటి అనేక మోడళ్లపై ప్రభావం చూపనుంది. అయితే, వేరియంట్ను బట్టి పెరిగే రేటు మారుతుంటుంది.
కొనుగోలుదారులపై పడే ప్రభావం ఎంత?
ఆటోమొబైల్ రంగానికి దసరా, దీపావళి పండుగల సీజన్ అత్యంత కీలకమైన సమయం. సాధారణంగా ఈ సమయంలో డిమాండ్ చాలా బలంగా ఉంటుంది. మారుతీ సుజుకీ ఆగస్టు నెలలోనే రికార్డు స్థాయిలో, సగానికి పైగా మార్కెట్ వాటాతో అమ్మకాల్లో దూసుకెళ్లింది. కానీ, వరుసగా పెరిగిన ఈ ధరల వల్ల కార్ల ఆన్-రోడ్ ధరలు మరింత ప్రియం కానున్నాయి. ఎక్స్-షోరూమ్ ధర పెరిగినప్పుడు దానికి అనుగుణంగా రోడ్ టాక్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా పెరుగుతాయి కాబట్టి మధ్యతరగతి కొనుగోలుదారుల బడ్జెట్పై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది.
బలెనో ఫేస్లిఫ్ట్ ఆవిష్కరణ..
ఒకవైపు ధరల పెంపు నిర్ణయాన్ని వెల్లడిస్తూనే, మరోవైపు తన పాపులర్ ప్రీమియం హ్యాచ్బ్యాక్ '2026 బలెనో ఫేస్లిఫ్ట్' మోడల్ను మారుతీ భారత మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించింది. ఆధునిక ఫీచర్లు, కాస్మెటిక్ మార్పులతో రూ.6.10 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో దీనిని తీసుకొచ్చింది. సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లుగా లెవెల్-2 అడాస్, వెంటిలేటెడ్ సీట్లను ఇందులో అందించడం విశేషం. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


