SUV : ఆల్టో స్థానంలో మారుతీ సుజుకీ నుంచి కొత్త మైక్రో ఎస్యూవీ- టాటా పంచ్కి పోటీగా..
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ.. టాటా పంచ్ హవాకు అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమవుతోంది. తన ఐకానిక్ మోడల్ ఆల్టో స్థానంలో సరికొత్త మైక్రో ఎస్యూవీని తీసుకురానుంది. అదిరిపోయే ఫీచర్లు, మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్లతో రానున్న ఈ కారు విశేషాలు ఇక్కడ చూడండి..
భారతీయ కార్ల మార్కెట్లో రారాజుగా వెలుగుతున్న మారుతీ సుజుకీ ఇప్పుడు తన వ్యూహాన్ని మారుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ‘టాటా పంచ్’ సృష్టిస్తున్న ప్రభంజనాన్ని తట్టుకునేందుకు మారుతీ ఒక పక్కా ప్రణాళికతో వస్తోంది. కంపెనీకి దశాబ్దాలుగా వెన్నెముకగా నిలిచిన ఆల్టో/ మారుతీ 800 స్థానంలో ఒక కొత్త 'ఎంట్రీ లెవల్' ఎస్యూవీని పరిచయం చేసేందుకు కసరత్తు చేస్తోంది.

ఎస్యూవీ క్రేజ్ వైపు మారుతీ అడుగులు..
ప్రస్తుతం కస్టమర్ల అభిరుచి వేగంగా మారుతోంది. చిన్న కార్ల కంటే ఎస్యూవీ తరహా డిజైన్ ఉన్న వాహనాలకే మొగ్గు చూపుతున్నారు. మారుతీ సుజుకీ తన ఎస్యూవీ మార్కెట్ వాటా 2026 ఆర్థిక సంవత్సరంలో 16.8 శాతం నుంచి 19.6 శాతానికి పెరగడాన్ని గమనించింది. అందుకే, సంప్రదాయ హ్యాచ్బ్యాక్ శైలిని పక్కన పెట్టి, ఎత్తుగా ఉండే అప్రైట్ ఎస్యూవీ స్టైలింగ్తో ఈ కొత్త కారును రూపొందిస్తోంది.
ఈ కొత్త మోడల్ కేవలం పెట్రోల్కే పరిమితం కాకుండా.. మైల్డ్-హైబ్రిడ్, సీబీజీ/ సీఎన్జీ, ఎలక్ట్రిక్ (ఈవీ) వేరియంట్లలో కూడా అందుబాటులోకి రానుంది. బాలెనో, ఫ్రాంక్స్ ఎలాగైతే కలిసి మార్కెట్లో కొనసాగుతున్నాయో.. అదే విధంగా స్విఫ్ట్ హ్యాచ్బ్యాక్ ఉండగానే, దానికి సమాంతరంగా ఈ కొత్త మైక్రో ఎస్యూవీని మారుతీ సుజుకీ విక్రయించనుంది.
టాటా పంచ్ విజయం.. మారుతీకి హెచ్చరిక!
2021లో టాటా పంచ్ విడుదలైనప్పటి నుంచి సాధిస్తున్న అద్భుతమైన విజయం గురించి అందరికి తెలిసిందే. ఇది మారుతీ సుజుకీని ఆలోచనలో పడేసింది. నేటితరం తొలిసారి కారు కొనేవారు బడ్జెట్ కంటే కూడా లుక్, ఫీచర్లు, సేఫ్టీకి ప్రాధాన్యత ఇస్తున్నారు! టాటా పంచ్ ఫేస్లిఫ్ట్ మోడల్ ఇప్పుడు షార్పర్ డిజైన్, సరికొత్త ఫీచర్లు, ఐసిఈ, ఈవీ ఆప్షన్లతో దూసుకుపోతోంది. రూ. 10 లక్షలలోపు సెగ్మెంట్పై పట్టు కోల్పోకుండా ఉండాలంటే పంచ్కు గట్టి పోటీ ఇవ్వడం మారుతీకి ఇప్పుడు అనివార్యంగా మారింది.
ధర ఎలా ఉండబోతోంది?
ప్రస్తుతం మార్కెట్లో టాటా పంచ్ పెట్రోల్ వేరియంట్లు రూ. 5.60 లక్షల నుంచి రూ. 10.50 లక్షల మధ్య ఉన్నాయి. పంచ్ ఈవీ ధర రూ. 9.69 లక్షల నుంచి రూ. 12.59 లక్షల వరకు ఉంది (ఎక్స్-షోరూమ్).
మారుతీ సుజుకీ గనుక ఈ ధరల కంటే కనీసం రూ. 30,000 నుంచి రూ. 40,000 తక్కువకే తన కొత్త కారును తీసుకువస్తే, మార్కెట్లో మళ్లీ తిరుగులేని పట్టు సాధించే అవకాశం ఉంది. ఈ కొత్త కారును భారతదేశంలోనే తయారు చేసి, విదేశాలకు కూడా ఎగుమతి చేయాలని సుజుకీ యోచిస్తోంది.
మొత్తానికి, ఆల్టో స్థానాన్ని భర్తీ చేస్తూ రాబోయే ఈ కొత్త మైక్రో ఎస్యూవీ మధ్యతరగతి వాహనదారులకు ఒక గొప్ప ఆప్షన్గా మారనుంది. ఫీచర్లు, మైలేజీ, ఎస్యూవీ లుక్ కలగలిసిన ఈ కారుతో టాటా పంచ్కు మారుతీ గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ మోడల్పై రానున్న రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తరచూ అడిగే ప్రశ్నలు-
1. మారుతీ సుజుకీ కొత్త మైక్రో ఎస్యూవీ ధర ఎంత ఉండవచ్చు?
మారుతీ తన కొత్త మోడల్ను ప్రధానంగా టాటా పంచ్కు పోటీగా నిలబెట్టాలని చూస్తోంది. ప్రస్తుతం పంచ్ ప్రారంభ ధర రూ. 5.60 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ఉంది. మారుతీ సుజుకీ తన పాత వ్యూహం ప్రకారం, పంచ్ కంటే రూ. 30,000 నుంచి రూ. 40,000 తక్కువ ధరకే, అంటే సుమారు రూ. 5.20 లక్షల ప్రారంభ ధరతో ఈ కారును లాంచ్ చేసే అవకాశం ఉంది.
2. ఈ కొత్త కారు వచ్చిన తర్వాత ఆల్టో, స్విఫ్ట్ కార్ల పరిస్థితి ఏంటి?
ఈ కొత్త ఎస్యూవీ స్టైలిష్ మోడల్ రాకతో పాత ఆల్టో/మారుతీ 800 స్థానాన్ని భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే, మారుతీకి అత్యంత ఆదరణ ఉన్న 'స్విఫ్ట్' బ్రాండ్ మాత్రం యథాతథంగా కొనసాగుతుంది. బాలెనో, ఫ్రాంక్స్ కార్లు ఒకే విభాగంలో ఎలాగైతే కలిసి విక్రయిస్తున్నారో, స్విఫ్ట్ హ్యాచ్బ్యాక్, ఈ కొత్త మైక్రో ఎస్యూవీ కూడా పక్కపక్కనే మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


