...
...
Next Story

మారుతీ సుజుకీ క్యూ1 ఫలితాలు: రికార్డు విక్రయాలు.. కానీ నికర లాభం 9% డౌన్

ప్రయాణీకుల వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ జూన్ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో విక్రయాలు సాధించింది. రాబడి 36 శాతం పెరిగినప్పటికీ, ముడిసరుకుల ధరలు భారం కావడంతో నికర లాభం 9.1 శాతం తగ్గి రూ.3,446 కోట్లకు పరిమితమైంది.

Published on: Jul 31, 2026, 18:44:28 IST
Advertisement

ప్రసిద్ధ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ 2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1 FY27) ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. వాహన విక్రయాలు, రాబడి గణనీయంగా పెరిగినప్పటికీ, ముడిసరుకుల వ్యయం మితిమీరడంతో కంపెనీ నికర లాభంలో క్షీణత నమోదైంది.

మారుతీ సుజుకీ ఇటీవలే తన పాపులర్ మోడల్ బ్రెజా ఫేస్ లిఫ్ట్ తీసుకొచ్చింది (Deepak Salvi)
మారుతీ సుజుకీ ఇటీవలే తన పాపులర్ మోడల్ బ్రెజా ఫేస్ లిఫ్ట్ తీసుకొచ్చింది (Deepak Salvi)

జూన్ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం (Consolidated PAT) వార్షిక ప్రాతిపదికన 9.1 శాతం తగ్గి రూ.3,446 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.3,792 కోట్లుగా నమోదు కాగా, మార్చి త్రైమాసికం (Q4 FY26) తో పోలిస్తే 5.8 శాతం క్షీణించింది. అయితే కార్యకలాపాల ద్వారా వచ్చిన రాబడి మాత్రం వార్షిక ప్రాతిపదికన 35.9 శాతం వృద్ధి చెంది రూ.52,469 కోట్లకు చేరింది. ఎబిటా (EBITDA) మార్జిన్ 11.6 శాతం నుంచి 8.9 శాతానికి పడిపోయింది.

ఎగబాకిన వ్యయాలు.. కార్ల ధరల పెంపు

కంపెనీ మొత్తం ఖర్చులు వార్షికంగా 40.5 శాతం పెరిగి రూ.50,000 కోట్లకు చేరుకోవడమే లాభాల కోతకు ప్రధాన కారణంగా నిలిచింది. రాబడి కంటే ఖర్చుల వృద్ధి రేటే వేగంగా పెరిగింది.

ముడిసరుకుల వ్యయం ఏకంగా 45.9 శాతం పెరిగి రూ.32,013 కోట్లకు ఎగబాకింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల వల్ల తయారీ ఖర్చులు ఊహించని రీతిలో పెరిగాయి. ఈ పెరిగిన వ్యయ భారంలో కొంత భాగాన్ని వినియోగదారులపై వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇందులో భాగంగానే ఆగస్టు 2026 నుంచి తమ వాహనాల మోడళ్లను బట్టి రూ.30,000 వరకు ధరలను పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ ఇదివరకే ప్రకటించింది.

రికార్డు స్థాయిలో విక్రయాలు.. పెరిగిన మార్కెట్ వాటా

ఈ విక్రయాల జోరుతో భారత ప్యాసింజర్ వాహన మార్కెట్లో మారుతీ సుజుకీ తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంది. కంపెనీ మార్కెట్ వాటా 2.3 శాతం పెరిగి ఏకంగా 41.2 శాతానికి చేరింది. హర్యానాలోని ఖార్‌ఖోడా (Kharkhoda) వద్ద రెండవ తయారీ ప్లాంట్‌ను ప్రారంభించడంతో ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం డీలర్ల వద్ద నిల్వలు (Inventory) 13 రోజుల స్థాయిలోనే ఉంటూ ఆరోగ్యకరంగా ఉన్నట్లు సంస్థ స్పష్టం చేసింది.

(గమనిక: నిపుణులు, బ్రోకరేజ్ సంస్థల అభిప్రాయాలు వారి వ్యక్తిగతం. ఇన్వెస్టర్లు ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేముందైనా గుర్తింపు పొందిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం శ్రేయస్కరం.)

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe