రూ.25 లక్షల ప్యాకేజీ ఉద్యోగం వదిలేసి ఓలా క్యాబ్ డ్రైవర్‌గా.. ఇప్పుడు నెలకు రూ.1.5 లక్షల సంపాదన

ఉన్నత చదువులు, కార్పొరేట్ ఉద్యోగాలే విజయానికి కొలమానం అనుకునే ఈ రోజుల్లో ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ భిన్నమైన బాట పట్టారు. రూ.25 లక్షల వార్షిక ప్యాకేజీ (LPA) ఆఫర్‌ను వదులుకుని, ఓలా క్యాబ్ నడపడం ప్రారంభించి, నేడు ఐదు కార్ల యజమానిగా మారిన ఒక యువకుడి సక్సెస్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Published on: Jun 1, 2026, 15:55:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సాధారణంగా ఒక మంచి కాలేజీలో ఎంబీఏ (MBA) పూర్తి చేసి, చేతిలో రూ.25 లక్షల భారీ ప్యాకేజీతో ఉద్యోగం ఉందంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ, ఆ యువకుడికి మాత్రం ఆ కార్పొరేట్ లైఫ్ సంతృప్తిని ఇవ్వలేదు. అందరిలా కాకుండా పాత మూస పద్ధతులకు భిన్నంగా ఆలోచించి, సొంతంగా ఎదగాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ ఉద్యోగాన్ని వదులుకుని 'ఓలా' (Ola) క్యాబ్ డ్రైవర్‌గా మారాడు. శశి సచన్ అనే ఒక ఎక్స్ (ట్విట్టర్) యూజర్ తన సోదరుడికి సంబంధించిన ఈ ఆసక్తికరమైన ప్రయాణాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

రూ.25 లక్షల ప్యాకేజీ ఉద్యోగం వదిలేసి ఓలా క్యాబ్ డ్రైవర్‌గా.. నెలకు రూ.1.5 లక్షలు (Representational image/Unsplash)
రూ.25 లక్షల ప్యాకేజీ ఉద్యోగం వదిలేసి ఓలా క్యాబ్ డ్రైవర్‌గా.. నెలకు రూ.1.5 లక్షలు (Representational image/Unsplash)

"నా సోదరుడు ఒక టైర్-2 కాలేజీలో ఎంబీఏ పూర్తి చేశాడు. అతడి చేతిలో రూ.25 LPA ఉద్యోగం ఉన్నప్పటికీ, అతడు ఎప్పుడూ దాంతో సంతృప్తి చెందలేదు. ఒకరోజు హఠాత్తుగా ఉద్యోగం మానేయాలని నిర్ణయించుకుని, ఓలా టాక్సీ డ్రైవర్‌గా మారాడు" అని శశి సచన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

సమాజం హేళన చేసినా.. వ్యాపార సామ్రాజ్యంగా మార్చి..

సహజంగానే ఈ నిర్ణయంపై కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సమాజం కూడా అతడిని తక్కువ చేసి చూసింది. "చదువంతా వృథా చేశాడు", "ఏం చదివావు.. ఏం అయ్యావు.." అంటూ బంధువులు ఎగతాళి చేశారు. కానీ, ఆ యువకుడు ఎంబీఏలో తాను నేర్చుకున్న వ్యాపార సూత్రాలను ఇక్కడ అప్లై చేశాడు.

కేవలం ఒక కారుతో డ్రైవర్‌గా ప్రయాణం ప్రారంభించిన అతడు, క్రమంగా వ్యాపారాన్ని విస్తరించాడు. మూడేళ్ల కష్టానికి ఫలితంగా ప్రస్తుతం అతడు ఐదు ఓలా కార్లకు యజమాని అయ్యాడు. వాటి ద్వారా నెలకు దాదాపు రూ.1.5 లక్షల నికర ఆదాయాన్ని (Income) ఆర్జిస్తున్నాడు. "కొన్నిసార్లు మనకు కింది స్థాయికి పడిపోయినట్లు కనిపించే మార్గమే.. భవిష్యత్తులో నిజమైన అప్‌గ్రేడ్‌గా మారుతుంది" అంటూ శశి తన పోస్ట్‌ను ముగించారు.

నెటిజన్లలో మిశ్రమ స్పందన

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. కొందరు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం ఇది తప్పుడు నిర్ణయమని వాదిస్తున్నారు.

మద్దతుగా: "నేను కూడా ఒకప్పుడు నచ్చని ఉద్యోగంలో రోజుకు 8 గంటలు పనిచేసేవాడిని, ఆ తర్వాత ట్రేడింగ్ వైపు వచ్చి సక్సెస్ అయ్యాను. మనకు నచ్చిన పని చేయడంలోనే అసలైన తృప్తి ఉంటుంది" అని ఒక యూజర్ మద్దతు తెలిపారు.

వ్యతిరేకంగా: "మూడేళ్లపాటు అదే కార్పొరేట్ ఉద్యోగంలో కొనసాగి ఉంటే, అతడి ప్యాకేజీ రూ.25 లక్షల నుంచి సులభంగా రూ.30-35 లక్షలకు చేరేది. ఐదు కార్లు మెయింటెయిన్ చేస్తూ నెలకు రూ.1.5 లక్షలు సంపాదించడం కంటే ఐదేళ్ల క్రితమే రూ. 25 లక్షల ప్యాకేజీ ఉండటం చాలా బెటర్," అని మరొకరు కామెంట్ చేశారు.

(గమనిక: ఈ కథనం సోషల్ మీడియాలో యూజర్ షేర్ చేసిన సమాచారం ఆధారంగా రాసినది. దీనిని స్వతంత్రంగా ధృవీకరించలేదు.)

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More