Financial changes : సెప్టెంబర్ 1 నుంచి మీ జేబుపై ప్రభావం చూపే ఆర్థిక మార్పులు..

సెప్టెంబర్ 1 నుంచి మీ జేబుపై ప్రభావం చూపే పలు కీలక ఆర్థిక నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. ఐటీఆర్ ఫైలింగ్ చివరి తేదీ, ఎల్పీజీ ఈ-కేవైసీ, గ్యాస్ సిలిండర్ ధరల సవరణతో పాటు బ్యాంకింగ్ రంగంలో వస్తున్న మార్పుల సమగ్ర వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 30, 2026, 05:33:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ కుటుంబం, పన్ను చెల్లింపుదారులు జాగ్రత్తగా గమనించాల్సిన సమయమిది! కొత్త నెల సెప్టెంబర్‌లోకి అడుగుపెడుతున్న వేళ, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వం, ఆర్బీఐ, చమురు సంస్థలు పలు మార్పులను అమల్లోకి తెస్తున్నాయి. ఈ మార్పులు మీ నెలవారీ బడ్జెట్, పొదుపు పథకాలు, పన్ను ప్రణాళికలపై నేరుగా ప్రభావం చూపుతాయి. గడువులు దాటిపోతే జరిమానాలు పడే అవకాశం ఉన్నందున ముందస్తుగా అప్రమత్తమవ్వడం శ్రేయస్కరం.

సెప్టెంబర్ 1 నుంచి మీ జేబుపై ప్రభావం చూపే ఆర్థిక మార్పులు..
సెప్టెంబర్ 1 నుంచి మీ జేబుపై ప్రభావం చూపే ఆర్థిక మార్పులు..

ఐటీఆర్ ఫైలింగ్: ఆగస్టు 31 ఆఖరు తేదీ

ఫైనాన్స్ యాక్ట్ 2026 ద్వారా ఆదాయపు పన్ను చట్టంలో ప్రతిపాదించిన కొత్త మార్పుల ప్రకారం నాన్-ఆడిట్ వ్యాపారులు, నిపుణులు తమ ఐటీఆర్ దాఖలు చేయడానికి ఆగస్టు 31 ఆఖరు తేదీ. ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయనివారు సెప్టెంబర్ 1 వరకు వేచి చూడకుండా వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేయడం మంచిది.

ఒకవేళ ఈ గడువు తప్పితే, అసెస్‌మెంట్ ఇయర్ 2026-27కి సంబంధించి డిసెంబర్ 31, 2026 వరకు ఆలస్యపు రిటర్న్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. అయితే దీనికి ఆలస్య రుసుము చెల్లించాల్సి వస్తుంది. వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉన్నవారికి రూ. 1,000, రూ. 5 లక్షలు దాటిన వారికి రూ. 5,000 వరకు పెనాల్టీ పడుతుంది.

ఎల్పీజీ ఈ-కేవైసీ పూర్తి చేయాల్సిందే

గ్యాస్ కనెక్షన్ ఉన్న వినియోగదారులు ఆగస్టు 31 నాటికి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం సంస్థలు కోరాయి. సెప్టెంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ డెలివరీలో గానీ, సబ్సిడీ పొందడంలో గానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి లేదా మొబైల్ యాప్ ద్వారా వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి.

ఎఫ్‌డీ నిబంధనల్లో మార్పులు..

బ్యాంకుల్లో ఫిక్స్​డ్​ డిపాజిట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సవరించిన నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త రూల్ ప్రకారం, రూ. 3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో చేసే బల్క్ డిపాజిట్లపై వర్తించే వడ్డీ రేట్లను బ్యాంకులు ప్రతి రోజూ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పారదర్శకంగా ప్రచురించాలి. దేశవ్యాప్తంగా ఉన్న తమ అన్ని బ్రాంచుల్లోనూ ఒకే రకమైన వడ్డీ రేటును అమల్లో ఉంచాలి. సాధారణ రీటైల్ డిపాజిటర్లకు ఈ నిబంధన వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు.

గ్యాస్ ధరలు, ఏటీఎం ఛార్జీల సమీక్ష..

ప్రతి నెల మొదటి రోజు జరుగుతున్నట్టుగానే.. సెప్టెంబర్ 1న కూడా గృహ వినియోగ, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను చమురు సంస్థలు సమీక్షిస్తాయి. అంతర్జాతీయ చమురు మార్కెట్ ట్రెండ్ ఆధారంగా ధరలు మారవచ్చు. దీనితో పాటు విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరల ఆధారంగా విమాన ప్రయాణ చార్జీలు మారే అవకాశం ఉంది.

అలాగే కొన్ని బ్యాంకులు తమ సేవా రుసుములు, ఏటీఎం విత్‌డ్రావల్ చార్జీలను సవరించే అవకాశం ఉన్నందున ఖాతాదారులు ఒకసారి సరిచూసుకోవడం అవసరం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More