Mumbai rains : ముంబైలో వానల బీభత్సం- 13మంది మృతి! వణికిస్తున్న ఐఎండీ అలర్ట్స్..
IMD rain alert : మహారాష్ట్రను వరుణుడు వణికిస్తున్నాడు. ఆదివారం ముంబై నగరాన్ని, దాని పరిసర ప్రాంతాలను ముంచెత్తిన భారీ వర్షాలు, ఈదురు గాలులు జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేశాయి. ఫలితంగా వేరువేరు ఘటనల్లో 13మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.
మహారాష్ట్ర రాజధాని ముంబైతో పాటు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) పరిధిలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు తీవ్ర తలక్రిందులు చేశాయి. ఇళ్ల కూలిపోవడం, చెట్లు విరిగిపడటం, విద్యుదాఘాతం, వరదల్లో కొట్టుకుపోవడం వంటి వేర్వేరు ప్రమాదాల్లో కనీసం 13 మంది ఆదివారం ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు సోమవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ హెచ్చరికలు ముంబైవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాతావరణ శాఖ 'రెడ్ అలర్ట్' ప్రకటించడంతో సోమవారం ముంబై యూనివర్సిటీ పరీక్షలతో పాటు విద్యాసంస్థలను అధికారులు రద్దు చేశారు.

మన్ఖుర్ద్లో ఇళ్లు కూలి ఆరుగురు దుర్మరణం!
అత్యంత ఘోరమైన ప్రమాదం ముంబైలోని మన్ఖుర్ద్ పరిధిలో ఉన్న జనతా నగర్ మురికివాడలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి 8:30 గంటల సమయంలో భారీ వర్షాల ధాటికి రెండు, మూడు అంతస్తుల రేకుల ఇళ్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకుని ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులలో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్లు శతాబ్ది ఆసుపత్రి అధికారులు వెల్లడించగా, మరొకరు రాజావాడి ఆసుపత్రిలో మరణించినట్లు ప్రకటించారు. అర్ధరాత్రి దాటినప్పటికీ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
విరిగిపడిన వృక్షాలు.. ఇద్దరి బలి!
నగరంలో గంటకు 75 కిలోమీటర్లకు పైగా వేగంతో వీచిన గాలుల కారణంగా 250 కి పైగా చెట్లు వేర్వేరు చోట్ల కూలిపోయాయి. ఆరే కాలనీలో తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో బైక్పై వెళ్తున్న హసన్ సయ్యద్ (18) తలపై చెట్టు కొమ్మ విరిగిపడటంతో అక్కడికక్కడే మరణించాడు.
మరో ఘటనలో, కుర్లా వెస్ట్లో తన కుమారులు బహుమతిగా ఇచ్చిన కొత్త హార్డ్వేర్ షాప్ ప్రారంభోత్సవ ఏర్పాట్ల కోసం వచ్చిన వ్యాపారవేత్త యూనస్ కుందా వాలా (63) పై సప్తపర్ణి చెట్టు కొమ్మ విరిగిపడింది. ఆసుపత్రికి తరలించే లోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై స్పందించిన మేయర్ రీతూ తావ్డే మృతుడి కుటుంబానికి రూ. 5 లక్షల తక్షణ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. మాటుంగా ప్రాంతంలో ఏకంగా 200 ఏళ్ల నాటి భారీ వృక్షం కూలి రోడ్డు పక్కన పార్క్ చేసిన కారుపై పడింది.
పరిసర జిల్లాల్లోనూ విషాదాలు..
ముంబై శివార్లలోనూ వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది:
వాశి: ఒక పాత నాలుగు అంతస్తుల భవనం బాల్కనీ కూలి రోడ్డుపై పడటంతో, అక్కడ వంట మనిషిగా పనిచేసే రాజేష్ శెట్టి (35) అనే వ్యక్తిపై ఇనుప రాడ్లు గుచ్చుకుని మరణించాడు.
వసాయ్-విరార్: వసాయ్ ఈస్ట్లో నీట మునిగిన రోడ్డు దాటుతూ సుమీర్ కుమార్ మండల్ అనే 20 ఏళ్ల యువకుడు తెరిచి ఉన్న డ్రైనేజీ కాలువలో పడి ప్రాణాలు కోల్పోయాడు. అలాగే నలసోపరాలో నివాసముండే మరో యువకుడు ఇనుప నిచ్చెన ఎక్కుతుండగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.
భివాండీ: కమ్వారీ నది ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో పీతలు పట్టడానికి వెళ్లిన మహ్మద్ (17) అనే బాలుడు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు.
అంబర్నాథ్: చిఖ్లోలీ డ్యామ్లో సరదాగా ఈతకు వెళ్లి గత మూడు రోజులుగా గల్లంతైన విశ్వనాథ్ కాంబ్లే (21) అనే దర్జీ మృతదేహం ఆదివారం ఉదయం లభ్యమైంది.
ముంబైకి 'రెడ్ అలర్ట్'.. పరీక్షలు, స్కూళ్లు బంద్!
సోమవారం కూడా ముంబై, పరిసర జిల్లాల్లో అత్యంత తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. గాలి వేగం గంటకు 60-70 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో ముంబై విశ్వవిద్యాలయం సోమవారం జరగాల్సిన అన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ముంబై, థాణే, పాల్ఘర్, రాయగఢ్ జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
మరోవైపు ముంబైలో ప్రసిద్ధి చెందిన 'డబ్బావాలా' లంచ్ బాక్స్ సర్వీసులను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు.
రైల్వే ట్రాక్లపై నీరు చేరడంతో వసాయ్ రోడ్ - విరార్ స్టేషన్ల మధ్య లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు ముందస్తు ప్రణాళికతో బయలుదేరాలని సెంట్రల్ రైల్వే సూచించింది.
సోమవారం మధ్యాహ్నం 3:56 గంటలకు సముద్రంలో 4.08 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
నిండిన జలాశయాలు..
ఈ భారీ వర్షాల కారణంగా ముంబై నగరానికి తాగునీరు అందించే ఏడు ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లోనే ఈ రిజర్వాయర్లలో నీటి మట్టం 3.73 శాతం పెరిగి, మొత్తం నిల్వ సామర్థ్యం 16.92 శాతానికి చేరుకుంది.
కాగా జులై నెలలో ముంబైలో కురవాల్సిన సగటు వర్షపాతంలో 74 శాతం కేవలం ఈ నాలుగు రోజుల్లోనే నమోదు కావడం గమనార్హం!
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


