NEET UG 2026 : నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్ తేదీని ప్రకటించిన ఎన్టీఏ, ఎప్పుడంటే..
NEET UG 2026 Re Exam date : నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ తేదీని ఎన్టీఏ ప్రటించింది. ఈ మేరకు ఎక్స్లో ఒక పోస్ట్ చేసింది. నీట్ యూజీ 2026 పరీక్షను జూన్ 21న నిర్వహించనున్నట్టు వెల్లడించింది.
పేపర్ లీక్ కారణంగా ఇటీవలే రద్దు అయిన నీట్ (నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) యూజీ 2026 పరీక్ష జూన్ 21న మళ్లీ జరగనుంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ కొత్త తేదీని శుక్రవారం ఉదయం ప్రకటించింది.

“కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో నీట్ యూజీ 2026 పరీక్షను జూన్ 21, ఆదివారం నిర్వహిస్తాము,” అని ఎన్టీఏ ఎక్స్ వేదికగా ప్రకటించింది.
నీట్ పరీక్షకు సంబంధించి ఎలాంటి సమాచారం కోసమైనా ఎన్టీఏ అధికారిక వెబ్సైట్స్, కమ్యూనికేషన్ ఛానెల్స్నే సంప్రదించాలని, ఫేక్ వార్తలకు దూరంగా ఉండాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు టెస్టింగ్ ఏజెన్సీ అభ్యర్థించింది.
అభ్యర్థులు neet-ug@nta.ac.in లేదా 011-40759000, 011-69227700ని సంప్రదించి నీట్ యూజీ 2026కి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చని ఎన్టీఏ స్పష్టం చేసింది.
నీట్ యూజీ 2026 పేపర్ లీక్..
వాస్తవానికి ఈ నెల 3వ తేదీనే నీట్ యూజీ 2026 పరీక్ష జరిగింది. రాత్రింపగళ్లు శ్రమించి, ప్రిపేర్ అయిన 20లక్షలకుపైగా విద్యార్థులు ఈ వైద్య ఎంట్రెన్స్ పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారు. కానీ, పరీక్ష ముగిసిందని కాస్త రిలీఫ్ పొందిన సమయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు షాక్ తగిలింది! నీట్ యూజీ పేపర్ లీక్ అయ్యిందన్న వార్తలు వారిని తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. పేపర్ లీక్ ఆరోపణలు వాస్తవమే అని గుర్తించిన ఎన్టీఏ.. మే 3న జరిగిన పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
లక్షలాది మంది విద్యార్థులు, ఏళ్ల తరబడి శ్రమించి రాసే నీట్ వంటి పరీక్షల్లో అవకతవకలను ఎత్తిచూపుతూ, ఎన్టీఏ వైఖరిపై ఇప్పుడు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు నిరసనలు చేపడుతున్నాయి.
మరోవైపు నీట్ యూజీ పేపర్ లీక్ కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లింది. రాజస్థాన్ నుంచి తొలుత పేపర్ లీక్ సమాచారం వచ్చినట్టు అధికారులు గుర్తించారు. అనంతరం అనేక చోట్ల రైడ్లు చేసి, పలువురు అనుమానితులను అరెస్ట్ చేశారు. వీరిలో గురుగ్రామ్కి చెందిన యష్ యాదవ్, జైపూర్కి చెందిన మంగిలాల్ ఖాటిక్, వికాశ్ బివాల్, దినేశ్ బివాల్, నాశిక్కి చెందిన ఖైర్నార్లు ఉన్నారు.
“నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసును ట్రేస్ చేస్తే, అది ఎన్టీఏ లోపలి వ్యక్తి (సోర్సు) వరకు దారి తీస్తోంది,” అని దిల్లీ హైకోర్టుకు సీబీఐ గురువారం వెల్లడించింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


