...
...
Next Story

జూలై 15 నుంచి సరికొత్త ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్: మరింత వేగంగా టికెట్ బుకింగ్స్, సరికొత్త ఫీచర్లు

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన సరికొత్త ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్‌ను జూలై 15 నాటికి ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ అప్‌గ్రేడెడ్ పోర్టల్ ద్వారా ప్రయాణికులు మరింత వేగంగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

Published on: Jul 14, 2026 05:21 PM IST
Advertisement

రైలు టికెట్ బుక్ చేసుకునే సమయంలో సర్వర్ డౌన్ కావడం, పేజీ లోడ్ కావడానికి గంటల తరబడి సమయం పట్టడం వంటి ఇబ్బందులకు త్వరలోనే చెక్ పడనుంది. ప్రయాణికులకు మరింత సులువైన, వేగవంతమైన సేవలను అందించేందుకు వీలుగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నారు. జూన్ 11న రాజస్థాన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి ఈ నూతన వెబ్‌సైట్ లాంచ్ వివరాలను వెల్లడించారు.

జూలై 15 నుంచి సరికొత్త ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్: మరింత వేగంగా టికెట్ బుకింగ్స్
జూలై 15 నుంచి సరికొత్త ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్: మరింత వేగంగా టికెట్ బుకింగ్స్

ముఖ్యంగా జైపూర్‌లోని ఎంఎన్‌ఐటీ (MNIT) విద్యార్థి ఒకరు వెబ్‌సైట్‌లోని 'క్యాప్చా' (CAPTCHA) వెరిఫికేషన్ ప్రక్రియ వల్ల టికెట్ బుకింగ్ ఆలస్యమవుతోందని మంత్రికి వివరించారు. ఈ సమస్యలన్నింటినీ అధిగమిస్తూ సరికొత్త వెబ్‌సైట్‌ను సిద్ధం చేశారు.

సెకనుకు 1.5 లక్షలకు పైగా టికెట్ల బుకింగ్ సామర్థ్యం

కొత్త వెబ్‌సైట్‌లో అతిపెద్ద మార్పు టికెట్ బుకింగ్ సామర్థ్యాన్ని భారీగా పెంచడమే. ప్రస్తుతం ఉన్న సిస్టమ్ నిమిషానికి కేవలం 32,000 టికెట్లను మాత్రమే బుక్ చేయగలదు. కానీ, ఈ సరికొత్త పోర్టల్ ద్వారా నిమిషానికి ఏకంగా 1.5 లక్షలకు పైగా టికెట్లను బుక్ చేసుకోవచ్చని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఎంక్వైరీల వేగం 10 రెట్లు పెంపు

టికెట్ లభ్యత, ట్రైన్ స్టేటస్ వంటి వివరాలను తెలుసుకునే ఎనక్వైరీ వ్యవస్థను కూడా రైల్వే శాఖ విప్లవాత్మకంగా మార్చింది. ప్రస్తుతం నిమిషానికి 4 లక్షల ఎంక్వైరీలు మాత్రమే ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉండగా, కొత్త రిజర్వేషన్ సిస్టమ్ (PRS) ద్వారా నిమిషానికి ఏకంగా 40 లక్షలకు పైగా ఎనక్వైరీలను క్షణాల్లో తెలుసుకోవచ్చు.

ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న కొత్త ఫీచర్లు:

ఈ అప్‌గ్రేడెడ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ద్వారా ప్రయాణికులకు పలు అద్భుతమైన సేవలు లభించనున్నాయి.

ఫేర్ క్యాలెండర్ (Fare Calendar): వివిధ తేదీలలో టికెట్ ధరలను సరిపోల్చుకుని, బడ్జెట్‌కు తగిన రోజున ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడానికి ఈ ఫేర్ క్యాలెండర్ ఉపయోగపడుతుంది.

బహుభాషా సౌకర్యం: దేశవ్యాప్తంగా ఉన్న ప్రయాణికుల సౌకర్యార్థం వెబ్‌సైట్ పలు ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది.

సమీకృత సేవలు: దివ్యాంగులు, విద్యార్థులు, రోగులకు సంబంధించిన ప్రత్యేక కోటాలు, సేవలను ఒకే వేదిక కిందికి తీసుకువస్తున్నారు.

సింపుల్ ఇంటర్‌ఫేస్.. తత్కాల్ బుకింగ్స్ ఇక మరింత సులభం

వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే వచ్చే అనవసరపు పాప్-అప్‌లు, స్క్రీన్‌పై డిస్టర్బ్ చేసే గ్రాఫిక్స్, టికెట్ బుకింగ్ వేగాన్ని తగ్గించే క్యాప్చాలను కొత్త వెబ్‌సైట్‌లో తొలగించారు. దీనివల్ల ముఖ్యంగా తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే వారికి ఎంతో సమయం ఆదా అవుతుంది.

అంతేకాకుండా, ప్రస్తుతం స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ వంటి వివిధ క్లాస్‌ల సీట్ల లభ్యతను వేర్వేరుగా చెక్ చేసుకోవాల్సి వస్తోంది. అయితే కొత్త వెబ్‌సైట్‌లో అన్ని క్లాస్‌ల సీట్ల వివరాలను ఒకే స్క్రీన్‌పై ఒకేసారి చూసుకునే వీలుంటుంది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe