Nifty IT : ఐటీ ఇండెక్స్లో మళ్లీ ప్రకంపనలు- ఈ నెలలోనే 20శాతం డౌన్! 5లక్షల కోట్లు ఆవిరి..
కృత్రిమ మేధ (ఏఐ) విస్తరిస్తున్న నేపథ్యంలో సంప్రదాయ ఐటీ సేవల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. విదేశీ బ్రోకరేజ్ సంస్థల నెగటివ్ రిపోర్టులు, ఏఐ టూల్స్ వల్ల ఉద్యోగాలు, ప్రాజెక్టుల కోత ఉంటుందన్న భయాల నేపథ్యంలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి గురవుతోంది.
భారతీయ స్టాక్ మార్కెట్లో ఐటీ షేర్ల పతనం ఆగడం లేదు! మంగళవారం (ఫిబ్రవరి 24) వరుసగా ఐదో రోజు కూడా ఐటీ సూచీ భారీ నష్టాలను చూస్తోంది. ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ) వల్ల ఐటీ సేవల రంగానికి ముప్పు పొంచి ఉందన్న ఆందోళనలు ఇన్వెస్టర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

నేటి ట్రేడింగ్లో 'నిఫ్టీ ఐటీ' ఇండెక్స్ 3.5% మేర కుప్పకూలి, 52 వారాల కనిష్ట స్థాయి 30,417.75 పాయింట్లకు పడిపోయింది. ఈ ఒక్క నెలలోనే ఐటీ సూచీ ఏకంగా 20% నష్టపోవడం గమనార్హం. కేవలం నిన్నటి ముగింపు సమయానికే ఐటీ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ విలువ) సుమారు రూ. 5.05 లక్షల కోట్లు హరించుకుపోయిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కుప్పకూలిన ఐటీ దిగ్గజాలు..
నిఫ్టీ ఐటీలోని అన్ని కంపెనీలు మంగళవారం ఉదయం నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.
భారీగా నష్టపోయినవి: పర్సిస్టెంట్ సిస్టమ్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, కోఫోర్జ్ షేర్లు 4% పైగా పతనమయ్యాయి.
దిగ్గజ కంపెనీలు: ఇన్ఫోసిస్ షేర్ ధర 3.7%, టీసీఎస్ 3.5%, విప్రో 2.9% మేర క్షీణించాయి.
గత నెల రోజుల్లోనే కొన్ని ఐటీ స్టాక్స్ ఏకంగా 24% వరకు క్రాష్ అవ్వడం గమనార్హం.

ఐటీ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి?
ఐటీ రంగంలో ఈ అమ్మకాల ఒత్తిడికి ప్రధానంగా 'ఏఐ డిస్రప్షన్' (ఏఐ వల్ల కలిగే అంతరాయం) కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
క్లాడ్ కోడ్ ఎఫెక్ట్: ఆంత్రోపిక్ సంస్థ తన 'క్లాడ్' ఏఐ టూల్ ద్వారా ఐటీ సేవల రంగానికి సవాలు విసురుతోంది. ముఖ్యంగా ఐబీఎం కంప్యూటర్లలో వాడే పాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ‘కోబాల్’ను ఆధునీకరించడంలో క్లాడ్ కోడ్ అద్భుతంగా పనిచేస్తుందని ప్రకటించడం అమెరికా మార్కెట్లతో పాటు భారత ఐటీ కంపెనీలపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపింది.
రాబడిపై అనుమానాలు: ఆల్ఫాబెట్, అమెజాన్ వంటి దిగ్గజాలు ఎన్విడియా చిప్స్పై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే ఈ పెట్టుబడులకు తగ్గట్టుగా ఉత్పాదకత, లాభాలు వస్తాయా లేదా అన్న ఆందోళనలు నెలకొన్నాయి.
ఆదాయాల్లో కోత: ఏఐ వల్ల రాబోయే కొన్నేళ్లలో ఐటీ రంగం మొత్తం ఆదాయంలో 14% నుంచి 16% వరకు తగ్గుదల (డెఫ్లేషనరీ రిస్క్) ఉండవచ్చని హెచ్ఎస్బీసీ రీసెర్చ్ అంచనా వేసింది.
బ్రోకరేజ్ సంస్థల హెచ్చరికలు: ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ 'జెఫరీస్'.. టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా ఆరు కంపెనీల రేటింగ్ను తగ్గించింది. ఏఐ వల్ల వ్యాపార నమూనాలో మార్పులు వస్తే, ఈ కంపెనీల వాల్యుయేషన్లు మరో 30% నుంచి 65% వరకు పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది! అలాగే 'సీఎల్ఎస్ఏ' కూడా ఎనిమిది ప్రధాన ఐటీ కంపెనీల టార్గెట్ ధరలను తగ్గించింది.
తరచుగా అడిగే ప్రశ్నలు-
1. ఏఐ టూల్స్ వల్ల భారతీయ ఐటీ కంపెనీల ఆదాయం ఎలా దెబ్బతింటుంది?
భారతీయ ఐటీ కంపెనీల ప్రధాన ఆదాయం 'లేబర్ ఆర్బిట్రేజ్' (తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది మనుషుల ద్వారా పని చేయించడం) పై ఆధారపడి ఉంటుంది. ఆంత్రోపిక్ క్లాడ్ కోడ్ వంటి ఏఐ టూల్స్, గతంలో వందలాది మంది ఇంజనీర్లు నెలల తరబడి చేసే కోడింగ్- మోడర్నైజేషన్ పనులను ఇప్పుడు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి! దీనివల్ల క్లయింట్లు ఇచ్చే 'బిల్లేబుల్ అవర్స్' (పని గంటలు) తగ్గిపోయి, ఐటీ కంపెనీల ఆదాయంలో దాదాపు 14-16% వరకు కోత పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
2. ఐటీ షేర్లు ఇప్పుడు 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి కదా, ఇప్పుడు వీటిని కొనవచ్చా?
ప్రస్తుతానికి ఐటీ రంగంలో పరిస్థితి అస్థిరంగా ఉంది. జెఫరీస్ వంటి అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థల ప్రకారం.. ఏఐ వల్ల వ్యాపార నమూనా పూర్తిగా మారితే ఐటీ కంపెనీల వాల్యుయేషన్లు మరో 30% నుంచి 65% వరకు పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి, మార్కెట్ స్థిరపడే వరకు వేచి చూడటం లేదా కేవలం ఏఐ రంగానికి త్వరగా అలవాటు పడే మేనేజ్మెంట్ ఉన్న కంపెనీలను మాత్రమే ఎంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించడం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


