Best SUV : నిస్సాన్ టెక్టాన్ వర్సెస్ మారుతీ సుజుకీ విక్టోరిస్- ఏది బెస్ట్?
Nissan Tekton vs Maruti Suzuki Victoris : భారత కాంపాక్ట్ ఎస్యూవీ మార్కెట్లో పోటీని పెంచుతూ నిస్సాన్ సంస్థ 'టెక్టాన్' మోడల్ను ప్రవేశపెట్టింది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మారుతీ సుజుకీ విక్టోరిస్తో ఈ కొత్త కారు ధర, ఇంజిన్, ఫీచర్ల పరంగా తలపడనుంది.
నిస్సాన్ సంస్థ తన సరికొత్త అస్త్రం ‘నిస్సాన్ టెక్టాన్’ని మార్కెట్లోకి దించింది. అయితే, ఈ కొత్త కారుకు మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే, ప్రస్తుతం హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ‘మారుతీ సుజుకీ విక్టోరిస్’ నుంచి గట్టి సవాలు ఎదురుకానుంది. ఈ నేపథ్యంలో, టెక్టాన్ కారు మారుతీ విక్టోరిస్కు ఏ మేరకు పోటీ ఇవ్వగలదో ఇంజిన్, ఫీచర్లు, ధరల పరంగా విశ్లేషిద్దాం.

ఇంజిన్ పవర్: టర్బో పంచ్ వర్సెస్ హైబ్రిడ్ మైలేజ్..
ఇంజిన్ పనితీరు పరంగా రెండు కార్లు భిన్నమైన వ్యూహాలతో వచ్చాయి. నిస్సాన్ టెక్టాన్ ప్యూర్ పవర్ను నమ్ముకోగా, మారుతీ సుజుకీ విక్టోరిస్ మైలేజ్, పర్యావరణ హితానికి ప్రాధాన్యం ఇచ్చింది.
నిస్సాన్ టెక్టాన్: ఇందులో రెండు టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది 1.0 లీటర్ 3-సిలిండర్ టర్బో ఇంజిన్ (99 బీహెచ్పీ పవర్, 166 ఎన్ఎం టార్క్) కాగా, ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో వస్తుంది. రేసింగ్ ఫీల్ ఇష్టపడే వారి కోసం 1.3 లీటర్ 4-సిలిండర్ టర్బో ఇంజిన్ (160 బీహెచ్పీ పవర్, 280 ఎన్ఎం టార్క్) అందించారు. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ (డీసీటీ) గేర్బాక్స్ జత చేశారు.
మారుతీ సుజుకీ విక్టోరిస్: లాంగ్ డ్రైవ్లలో మైలేజ్ గురించిన టెన్షన్ లేకుండా మారుతీ ఇందులో మల్టిపుల్ ఆప్షన్లను ఇచ్చింది. స్మార్ట్ హైబ్రిడ్ వేరియంట్లో 1.5 లీటర్ 4-సిలిండర్ ఇంజిన్ (101.64 బీహెచ్పీ పవర్, 139 ఎన్ఎం టార్క్) ఉంటుంది. అదనంగా ఈ కారులో ఈవీ మోడ్తో నడిచే స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్తో పాటు, లగేజ్ స్పేస్కు ఇబ్బంది లేకుండా బాడీ కింద సిలిండర్లు అమర్చిన ఎస్-సీఎన్జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.
కొలతలు, క్యాబిన్ స్పేస్..
కుటుంబంతో కలిసి ప్రయాణించేటప్పుడు కారులో స్థలం ఎంత ఉందనేది ముఖ్యం. పొడవు విషయంలో మారుతీ సుజుకీ విక్టోరిస్ (4,360 ఎంఎం) నిస్సాన్ టెక్టాన్ (4,348 ఎంఎం) కంటే స్వల్పంగా పెద్దది. కానీ, కారు లోపల కూర్చునే స్పేస్ను నిర్ణయించే వీల్బేస్ విషయానికి వస్తే టెక్టాన్ (2,657 ఎంఎం), విక్టోరిస్ (2,600 ఎంఎం) కంటే మెరుగ్గా ఉంది. దానికి తోడు టెక్టాన్ 212 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, భారీ 518 లీటర్ల బూట్ స్పేస్ను ఆఫర్ చేస్తోంది. మారుతీ సుజుకీ విక్టోరిస్లో గ్రౌండ్ క్లియరెన్స్ 210 ఎంఎం కాగా, బూట్ స్పేస్ 439 లీటర్లుగా ఉంది.
ఫీచర్ల జాతర: టెక్నాలజీ పోటీ..
ఫీచర్ల విషయంలో రెండు కార్లు నేటి తరం కస్టమర్లను ఆకట్టుకునేలా అప్డేటెడ్ టెక్నాలజీతో వచ్చాయి.
నిస్సాన్ టెక్టాన్ ఫీచర్లు: ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్, 10.1-ఇంచుల డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్ప్లే, 10.25-ఇంచుల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ఎండకాలంలో చల్లదనాన్ని ఇచ్చే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కూల్డ్ వైర్లెస్ స్మార్ట్ఫోన్ ఛార్జర్, ఆర్కామిస్ 6-స్పీకర్ ఆడియో సిస్టమ్, అంబియెంట్ లైటింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు దీని సొంతం.
మారుతీ విక్టోరిస్ ఫీచర్లు: పార్కింగ్ను సులువు చేసే 360-డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 10.25-ఇంచుల టచ్ స్క్రీన్, డోర్ స్పీకర్లతో కూడిన ఇన్ఫినిటీ 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, గేర్లు మార్చడానికి వీలుగా ప్యాడిల్ షిఫ్టర్లను మారుతీ సుజుకీ అందించింది.
ధరల పోరాటం..
ధర విషయంలో రెండు కంపెనీలు కస్టమర్లను ఆకర్షించడానికి మైండ్ గేమ్ ఆడాయి. నిస్సాన్ టెక్టాన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.49 లక్షలుగా నిర్ణయించగా, టాప్ వేరియంట్ ధర రూ. 19.98 లక్షల వరకు ఉంది. అదేవిధంగా, మారుతీ సుజుకీ విక్టోరిస్ బేస్ మోడల్ ధర కూడా రూ. 10.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచే ప్రారంభమవుతుంది. అయితే దీని టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 18.59 లక్షల వద్ద ముగుస్తుంది.
మైలేజ్, నమ్మకమైన సర్వీస్ నెట్వర్క్ కావాలనుకునే వారికి మారుతీ సుజుకీ విక్టోరిస్ సరైన ఎంపిక కావచ్చు. అదే సమయంలో అదిరిపోయే టర్బో పవర్, ఎక్కువ బూట్ స్పేస్, సరికొత్త లుక్ కావాలనుకునే వారు నిస్సాన్ టెక్టాన్ వైపు మొగ్గు చూపవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


