...
...
Next Story

నితీశ్ కుమార్ కీలక నిర్ణయం? రాజ్యసభకు బిహార్ సీఎం.. జేడీయూ భేటీతో దేశవ్యాప్త చర్చ

బిహార్ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ త్వరలోనే రాజ్యసభలో అడుగుపెట్టనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. జేడీయూ అగ్రనేతల కీలక భేటీ నేపథ్యంలో ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Published on: Mar 04, 2026 06:14 PM IST
Advertisement

బిహార్ రాజకీయాల్లో మరోసారి పెను ప్రకంపనలు మొదలయ్యాయి. గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న ఊహాగానాలే నిజం కానున్నాయా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉందని గట్టిగా వినిపిస్తోంది.

జేడీయూ కీలక భేటీ.. అగ్రనేతల హాజరు

నితీశ్ కుమార్ కీలక నిర్ణయం? రాజ్యసభకు బిహార్ సీఎం.. జేడీయూ భేటీతో దేశవ్యాప్త చర్చ (ANI)
నితీశ్ కుమార్ కీలక నిర్ణయం? రాజ్యసభకు బిహార్ సీఎం.. జేడీయూ భేటీతో దేశవ్యాప్త చర్చ (ANI)

ప్రస్తుతం పాట్నాలో జనతాదళ్ (యునైటెడ్) అగ్రనేతల అత్యవసర సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో సంజయ్ ఝా, రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్) వంటి పార్టీ కీలక నేతలు పాల్గొంటున్నారు. బిహార్‌లో ఖాళీగా ఉన్న ఐదు రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ సమావేశంలో నితీశ్ కుమార్ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వయంగా రాజ్యసభకు వెళ్లాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే, బిహార్ ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రాజకీయాల్లోకి నితీశ్ వారసుడు?

ఈ పరిణామాల మధ్య మరో ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. నితీశ్ కుమార్ కుమారుడు శ్రవణ్ కుమార్ కూడా జేడీయూ తరపున రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం ఉందని సమాచారం. దీని ద్వారా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి లాంఛనంగా ప్రవేశించనున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. తండ్రి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో తన వారసుడిని సిద్ధం చేసే క్రమంలోనే నితీశ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.

బీజేపీ లెక్కలేంటి?

బిహార్‌లో ఖాళీ అవుతున్న ఐదు స్థానాల్లో జేడీయూకి రెండు దక్కే అవకాశం ఉండగా, మిత్రపక్షమైన బీజేపీ కూడా రెండు స్థానాల్లో పోటీ చేయనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నితిన్ నబిన్ కూడా ఈసారి రాజ్యసభకు వెళ్లే అభ్యర్థుల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe