Real Estate : ‘హైదరాబాద్ ప్రాపర్టీలో పెట్టుబడి కన్నా.. సేవింగ్స్ అకౌంట్లో దాచుకుంటేనే లాభాలు ఎక్కువ!’
Hyderabad Real Estate : భారతదేశంలో స్థిరాస్తి పెట్టుబడులు.. పైకి కనిపిస్తున్నంత లాభదాయకం కాదని ఓ ఎన్ఆర్ఐ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ అద్దె రాబడి, రూపాయి విలువ పతనం, పన్నుల చిక్కులే ఇందుకు ప్రధాన కారణమని ఆయన వివరించారు.
Bengaluru Real Estate : విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు (ఎన్ఆర్ఐలు) స్వదేశంలో ఇల్లు లేదా ప్లాటు కొనడం అనేది ఒక సెంటిమెంట్ మాత్రమే కాదు, ఒక గొప్ప పెట్టుబడి మార్గం కూడా. అయితే, వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని ఓ ఎన్ఆర్ఐ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఆస్తులు ఉన్నప్పటికీ, మూడొవ ప్రాపర్టీ జోలికి అస్సలు వెళ్లనని ఆయన తెగేసి చెబుతుండటం గమనార్హం.

కాగితం మీద లాభం.. చేతికి వచ్చేసరికి నష్టం!
దుబాయ్లో నివసిస్తున్న సదరు వ్యక్తి, భారతదేశంలోని రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి తన విశ్లేషణను ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రెడ్డిట్ వేదికగా పంచుకున్నారు.
"నాకు హైదరాబాద్, బెంగళూరులో ప్రాపర్టీలు ఉన్నాయి. పేపర్పై చూస్తే ఇవి మంచి లాభాల్లో ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ లోతుగా లెక్కలు వేస్తే మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. మెయింటెనెన్స్, సొసైటీ ఛార్జీలు, ప్రాపర్టీ ట్యాక్స్ అన్నీ పోను నాకు వచ్చే అద్దె కేవలం 2 నుంచి 3 శాతం మాత్రమే! అదే నేను దుబాయ్లోని నా సేవింగ్స్ అకౌంట్లో డబ్బు దాచుకుంటే 4 శాతం వడ్డీ వస్తోంది. దీనికోసం ఇన్ని తిప్పలు పడటం అవసరమా?" అని ఆయన ప్రశ్నించారు.
రూపాయి పతనం.. మరో పెద్ద దెబ్బ
అద్దె రాబడి తక్కువగా ఉండటమే కాకుండా, కరెన్సీ విలువ తగ్గడం కూడా పెట్టుబడిదారులను కుంగదీస్తోందని ఆయన పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 83 వద్ద ఉండగా, ఇప్పుడు అది 95కి చేరిందని (దాదాపు 14 శాతం పతనం), దీనివల్ల ఏమీ చేయకుండానే పెట్టుబడి విలువ తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్ఆర్ఐ ఇల్లు అంటే అద్దెకు రావడానికి భయం!
ట్యాక్స్ విధానాలు క్లిష్టంగా ఉండటం వల్ల అద్దెకు ఉండేవారు కూడా ఎన్ఆర్ఐల ఇళ్ల వైపు మొగ్గు చూపడం లేదని ఆయన వివరించారు. టెనెంట్ టీడీఎస్ కట్టడం, ఇతర డాక్యుమెంటేషన్ ప్రక్రియల వల్ల అద్దెదారులు ఇబ్బంది పడుతున్నారని, ఇది యజమానులకు తలనొప్పిగా మారిందని చెప్పుకొచ్చారు. ఇక ఆస్తిని అమ్మేసి డబ్బును విదేశాలకు తీసుకెళ్లడం అనేది ఒక పీడకల లాంటిదని ఆయన అభివర్ణించారు.
నెటిజన్ల స్పందన: "వద్దే వద్దు!"
ఈ పోస్ట్పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "ఎన్నారైలు భారతదేశంలో ఇళ్లు కొనడం అనేది తెలివైన పని కాదు. స్థిరమైన కరెన్సీలో డబ్బు దాచుకుంటేనే ఎక్కువ లాభం. పైగా ఆస్తి అమ్మేటప్పుడు కొనుగోలుదారుడు 20 శాతం టీడీఎస్ మినహాయించుకోవాలి. రిటర్న్స్ ఫైల్ చేసి ఆ డబ్బును వెనక్కి తీసుకోవడం చాలా కష్టమైన పని," అని ఒకరు కామెంట్ చేశారు.
మరికొందరు మాత్రం ఈ ట్రెండ్ను ఆహ్వానిస్తున్నారు.
"ఎన్ఆర్ఐలు పెట్టుబడులు తగ్గించుకుంటేనే ఇక్కడ ఇళ్ల ధరలు తగ్గి, సామాన్యులకు సొంత ఇల్లు కొనుక్కునే అవకాశం దక్కుతుంది. ధనవంతులు డజన్ల కొద్దీ ఫ్లాట్లు కొనడం వల్లే హైదరాబాద్ రియల్ ఎస్టేట్, బెంగళూరు రియల్ ఎస్టేట్ ధరలు చుక్కలను తాకుతున్నాయి," అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి, విదేశీ కరెన్సీలో సంపాదిస్తూ ఇండియాలో ప్రాపర్టీ కొంటే రెట్టింపు లాభం వస్తుందనే అంచనాలు ఎప్పుడూ నిజం కాకపోవచ్చని ఈ అనుభవాలు హెచ్చరిస్తున్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


