NEET UG re exam : నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్ పేపర్ కూడా లీక్ అయ్యిందా? వారికి ఎన్టీఏ వార్నింగ్..
NEET paper leak : నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ డబ్బులు వసూలు చేసేందుకు మోసగాళ్లు ఆడుతున్న నాటకాలని, విద్యార్థులు నమ్మవద్దని స్పష్టం చేసింది. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలంది.
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్ రాసే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం లీక్ అయిందని, ముందే లభిస్తోందని లేదా విక్రయానికి ఉందంటూ సోషల్ మీడియా వేదికలు, మెసేజింగ్ యాప్ల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న వార్తలు అవాస్తవని తేల్చిచెప్పింది. ఈ ప్రచారాలన్నీ ముమ్మాటికీ అబద్ధమని, నిరుద్యోగులను, విద్యార్థులను బురిడీ కొట్టించడానికి కొందరు కావాలనే చేస్తున్న మోసపూరిత ప్రయత్నాలని ఏజెన్సీ స్పష్టం చేసింది.

పేపర్ లీక్ కారణంగా మే 3న జరిగిన నీట్ యూజీ 2026 రద్దు అయ్యి, జూన్ 21న మళ్లీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
పరీక్షల సమయంలో విద్యార్థుల్లో, వారి కుటుంబాల్లో ఉండే ఆందోళనను ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకోవాలని చూస్తున్న కొన్ని వ్యవస్థీకృత ముఠాలు (చీటింగ్ రాకెట్లు) ఈ తరహా నకిలీ ప్రశ్నపత్రాలను అమ్ముతూ డబ్బులు వసూలు చేస్తున్నాయని ఎన్టీఏ తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
"ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఇలాంటి వార్తలన్నీ పూర్తిగా కల్పితం," అని ఎన్టీఏ ఘంటాపథంగా చెప్పింది.
పరీక్షా విధానం పూర్తిగా సురక్షితం: ఎన్టీఏ
నీట్ పరీక్షల నిర్వహణ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, పటిష్టంగా ఉందని టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. అభ్యర్థులందరికీ న్యాయమైన, సురక్షితమైన వాతావరణంలో పరీక్ష నిర్వహించడానికి అవసరమైన అన్ని భద్రతా చర్యలను ఇప్పటికే తీసుకున్నామని పేర్కొంది.
"నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్ విధానం పారదర్శకత పూర్తిగా సురక్షితంగా ఉంది. అభ్యర్థులందరికీ ఎక్కడా ఎలాంటి అన్యాయం జరగకుండా, పటిష్టమైన నిఘా నీడలో పరీక్షలు నిర్వహించేందుకు అన్ని రకాల రక్షణ చర్యలు సిద్ధంగా ఉన్నాయి," అని సంస్థ తన ప్రకటనలో వివరించింది.
అనధికారిక వ్యక్తులు ఎవరికీ ఈ ప్రశ్నపత్రాలను చూసే అవకాశం లేదని, కాబట్టి ఆన్లైన్లో వచ్చే ఇలాంటి అనామక, ధృవీకరించని సమాచారాన్ని చూసి అభ్యర్థులు అస్సలు ఆందోళన చెందవద్దని ఎన్టీఏ కోరింది.
నకిలీ అకౌంట్లు, తప్పుడు ప్రచారాలపై కఠిన చర్యలు
సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని, పుకార్లను వ్యాప్తి చేస్తున్న ఛానళ్లు, నకిలీ అకౌంట్లు, ఆన్లైన్ కంటెంట్ను తాము నిరంతరం నిఘా ఉంచి గుర్తిస్తున్నట్లు ఎన్టీఏ తెలిపింది. ఈ రకమైన తప్పుడు సమాచారాన్ని వెంటనే తొలగించేలా సంబంధిత సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లకు ఫిర్యాదు చేయడంతో పాటు, తక్షణ చర్యల కోసం సైబర్ క్రైమ్ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామని పేర్కొంది.
కేవలం సమాచారాన్ని తొలగించడమే కాకుండా, ఇలాంటి అబద్ధపు ప్రచారాలను సృష్టిస్తూ, వైరల్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా పోలీసులకు, సైబర్ క్రైమ్ విభాగానికి అధికారికంగా ఫిర్యాదులు ఇస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
పరీక్ష పేపర్లకు సంబంధించి నకిలీ కంటెంట్ను సృష్టించడం, దానిని ఇతరులకు ఫార్వార్డ్ చేయడం లేదా ప్రమోట్ చేయడం ద్వారా విద్యార్థులను మోసం చేయాలని చూడటం చాలా తీవ్రమైన నేరమని, దీనివల్ల కఠినమైన చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఏజెన్సీ గట్టిగా హెచ్చరించింది.
విద్యార్థులు, తల్లిదండ్రులకు ముఖ్య సూచనలు..
నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ ప్రశ్నపత్రాన్ని ముందే ఇస్తామంటూ వచ్చే ఎలాంటి మెసేజ్లనూ నమ్మవద్దని, అలాంటి వారికి డబ్బులు చెల్లించి మోసపోవద్దని అభ్యర్థులకు, వారి తల్లిదండ్రులకు టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది.
పరీక్షకు సంబంధించి ఎలాంటి నిజమైన సమాచారమైనా సరే, కేవలం ఎన్టీఏ అధికారిక వెబ్సైట్, ధృవీకరించిన అధికారిక ఛానళ్ల ద్వారా మాత్రమే విడుదలవుతుందని, వాటిని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేసింది.
పుకార్లను నమ్మి సమయాన్ని వృథా చేసుకోవద్దని, పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు తమ ప్రిపరేషన్పైనే పూర్తి దృష్టి పెట్టాలని ఎన్టీఏ పిలుపునిచ్చింది.
"మీ కష్టపడే తత్వమే మీకు విజయాన్ని అందిస్తుంది. పారదర్శకంగా, నమ్మకంగా, అత్యంత సురక్షితంగా పరీక్షలను నిర్వహించడానికి ఎన్టీఏ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది," అని సంస్థ అభ్యర్థులకు భరోసా ఇచ్చింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


